విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా యూఏఈ విద్యామంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేసింది. స్కూల్ క్యాంటీన్లలో జంక్ ఫుడ్, డ్రింక్స్ అమ్మడంపై నిషేధం విధించింది. ఈ జాబితాలో సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కృత్రిమ జ్యూసులు, చాక్లెట్, కేక్, డోనట్, స్వీట్ బిస్కెట్లు,చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్, సాసేజులు, బర్గర్స్ ఉన్నాయి. అలర్జీ సమస్యల కారణంగా వేరుశనగ, కాజూనట్స్ని కూడా నిషేధించారు. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ మెండుగా ఉండే ఇంట్లో తయారు చేసిన ఆహారం పిల్లలకు ఇవ్వమని ప్రభుత్వం సూచించింది.
అలానే పిల్లల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై కూడా కఠిన నియమాలు అమలు చేశారు. తొలిసారి పాఠశాలకు ఎవరైనా ఫోన్ తీసుకునివస్తే నెల రోజులపాటు దాన్ని తిరిగి ఇవ్వరు. మళ్లీ మళ్లీ ఇలానే చేస్తే.. విద్యాసంవత్సరం పూర్తయ్యే వరకు ఆ ఫోన్ తిరిగి ఇవ్వడం కుదరదని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. ఈ నియమాలు అమలు చేయడంలో భాగంగా అధికారులు.. విద్యార్థుల బ్యాగ్స్ తనిఖీ చేయొచ్చు. అయితే తనిఖీలు చేసినప్పుడు పిల్లల బ్యాగ్లో మొబైల్ దొరికితే.. వెంటనే తల్లిదండ్రులు సంతకంతో రికార్డ్ చేయాలి.
ఐప్యాడ్ లేదా ట్యాబ్ అనేవి చదువుకోసం మాత్రమే. టీచర్స్ అనుమతితోనే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. విరామం లేదా క్లాస్ తర్వాత వీటిని ఉపయోగించడం.. నిబంధనలకు విరుద్ధం. ఈ చర్యలన్నీ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయని సంబంధిత మంత్రిత్వ శాఖ భావిస్తోంది.


