చైనా దూకుడు.. ఆపకుండా బంగారం కొంటున్న డ్రాగన్‌! | China Boosts Gold Reserves Amid Global Market Turbulence | Sakshi
Sakshi News home page

చైనా దూకుడు.. ఆపకుండా బంగారం కొంటున్న డ్రాగన్‌!

Feb 8 2026 12:46 PM | Updated on Feb 8 2026 1:07 PM

China Boosts Gold Reserves Amid Global Market Turbulence

బంగారం, వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన అనంతరం తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో కొత్త కదలికలకు దారితీసింది. ధరలు తీవ్ర అస్థిరతను చూపుతున్నప్పటికీ, చైనా మాత్రం బంగారం కొనుగోలును దూకుడుగా కొనసాగిస్తోంది. చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) వరుసగా 15వ నెల కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంది.

2,307 మెట్రిక్‌ టన్నుల బంగారం
పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా విడుదల చేసిన డేటా, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. గత జనవరి నెలలో కూడా చైనా బలమైన బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. జనవరి చివరి నాటికి చైనా మొత్తం బంగారం నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు (ఒక ఫైన్ ట్రాయ్ ఔన్సు అంటే 31.1035 గ్రాములు మొత్తం 2,307.56 మెట్రిక్‌ టన్నులు) చేరాయి. ఇది డిసెంబర్ చివర్లో నమోదైన 74.15 మిలియన్ ట్రాయ్ ఔన్సులతో పోలిస్తే స్వల్ప పెరుగుదలే అయినప్పటికీ, నిల్వల మొత్తం విలువ మాత్రం గణనీయంగా పెరిగింది.

ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకే?
జనవరి చివరి నాటికి చైనా బంగారం నిల్వల మొత్తం విలువ 369.58 బిలియన్ డాలర్లకు చేరింది. గత నెలలో ఇది 319.45 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ భారీ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా నెల ప్రారంభంలో ఉన్న అధిక బంగారం ధరలు, అలాగే చైనా నిరంతర కొనుగోలు వ్యూహాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ప్రమాదాల నేపథ్యంలో చైనా తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే భాగంగా బంగారం నిల్వలను పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చైనా నుంచి వచ్చిన బలమైన డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా జనవరిలో బంగారం ధరలు ఔన్సుకు 5,600 డాలర్ల చారిత్రక గరిష్టాన్ని తాకాయి. అయితే ఈ ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌లో తదుపరి కీలక నాయకత్వ పాత్రకు కెవిన్ వార్ష్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడడంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా పడిపోయాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,887 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ దిద్దుబాటు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరల దిశపై అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు చేస్తుండగా, అదే సమయంలో దేశీయ వినియోగదారుల బంగారం వినియోగం మాత్రం వరుసగా రెండో ఏడాది కూడా తగ్గుముఖం పట్టింది.

భారత్‌ పసిడి నిల్వలు ఇలా..
జనవరి 2026 నాటికి, భారతదేశ కేంద్ర బ్యాంకు తన విదేశీ మారక నిల్వలలో సుమారు 880 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. తాజా విదేశీ నిల్వల డేటా ప్రకారం జనవరి చివరి నాటికి భారతదేశ మొత్తం రిజర్వ్ వాల్యుయేషన్‌కు  ఆర్బీఐ బంగారం హోల్డింగ్స్ సుమారు 123 బిలియన్ డాలర్లు దోహదపడ్డాయి. ప్రపంచ ధరల లాభాలతో భారతదేశ బంగారం నిల్వ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ తాజా పసిడి కొనుగోళ్లు గణనీయంగా మందగించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement