న్యూఢిల్లీ: అంకుర సంస్థల నిర్వచనాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టర్నోవరు పరిధిని రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచింది. డీప్ టెక్ స్టార్టప్ల పరిధిని కూడా విస్తరించింది. ఇకపై రిజిస్టరయిన 20 ఏళ్ల వరకు, వాటిని స్టార్టప్లుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఇది పదేళ్లుగా ఉంది.
టర్నోవరు పరిమితిని కూడా రూ. 300 కోట్లకు ప్రభుత్వం పెంచింది. డీప్ టెక్ సంస్థలకి భారీ స్థాయిలో పెట్టుబడులు కావాల్సి ఉంటుందని, వ్యాపార కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు సుదీర్ఘ సమయం పట్టేయొచ్చని డీపీఐఐటీ నోటిఫికేషన్లో పేర్కొంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు తదితరాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా నిర్దిష్ట కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్లకు కూడా స్టార్టప్ గుర్తింపునివ్వనుంది.
ఇదే సమయంలో ఈ మార్పులతో స్టార్టప్ వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టర్నోవరు, కాలపరిమితుల పెంపుతో ఎక్కువ సంస్థలు స్టార్టప్ హోదా పొందే అవకాశం ఏర్పడనుంది. దీంతో పన్ను రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, ఫండింగ్ అవకాశాలు విస్తరించనున్నాయి. ముఖ్యంగా డీప్ టెక్, అగ్రి టెక్, క్లైమేట్ టెక్ వంటి రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ, సహకార రంగాల్లోనూ సాంకేతికత ఆధారిత వ్యాపారాలు పెరగడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వారు భావిస్తున్నారు.


