దేశీయంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2025లో ఇది 28 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్అవర్)గా ఉండగా 2040 మధ్య నాటికి 700 జీడబ్ల్యూహెచ్ స్థాయికి చేరనుంది. ఇండియా బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్, సప్లై చెయిన్ (ఐబీఎంఎస్సీఎస్) సదస్సు సందర్భంగా ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం 2025లో మొత్తం బ్యాటరీల డిమాండ్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా దాదాపు 60 శాతంగా ఉండగా, 2047 నాటికి 74–77 శాతానికి పెరగొచ్చని అంచనా. 2035 నాటికి దేశీయంగా ఈవీల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 30 శాతం మేర వృద్ధి చెందనుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లు దీనికి సారథ్యం వహించనుండగా, ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు ఆ తర్వాత స్థానాల్లో ఉండనున్నాయి. బ్యాటరీల తయారీదారులు, ఇన్వెస్టర్ల కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే శర్మ తెలిపారు.
ఎనర్జీ స్టోరేజీ విప్లవం వల్ల వ్యవస్థవ్యాప్తంగా భాగస్వామ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పునరుత్పాదక శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్ కుల్హారి తెలిపారు. రెండు రోజుల ఈ సదస్సులో చైనా, జపాన్, అమెరికా తదితర దేశాల నుంచి 250పైచిలుకు కంపెనీలు, 600 మందికి పైగా డెలిగేట్లు, పరిశ్రమ దిగ్గజాలు పాల్గొంటున్నారు.


