న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అమ్మకాలు వెల్లువెత్తడం, డాలరు బలపడటంలాంటి కారణాలతో గురువారం వెండి ధరలు పతనమయ్యాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు 10 శాతం క్షీణించి (రూ. 30,300)రూ. 2.68 లక్షలకు పడిపోయింది.
అటు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర 10 గ్రాములకు రూ. 4,500 క్షీణించి (3 శాతం) రూ. 1,60,600కి తగ్గింది. మళ్లీ అమ్మకాల ఒత్తిడి, ఒడిదుడుకులు పెరగడంతో వెండి, పసిడి రేట్ల రెండు రోజుల ర్యాలీకి బ్రేక్ పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు.
అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) సిల్వర్ ధర 11.94 డాలర్లు (సుమారు 14 శాతం) తగ్గి 76.26 డాలర్లకు చేరింది. పసిడి సైతం 137.32 డాలర్లు (దాదాపు 3 శాతం) క్షీణించి 4,826.99 డాలర్లకు పరిమితమైంది. చైనా ఫ్యూచర్స్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, గ్లోబల్ మార్కెట్లు దానికి తగ్గట్లుగా స్పందించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనా న్షియల్ సరీ్వసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు.
ఫ్యూచర్స్లో: దేశీయంగా ఎంసీఎక్స్ వెండి మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ. 26,850 తగ్గి రూ. 2,42,000 వద్ద ట్రేడయ్యింది. అటు ఏప్రిల్ కాంట్రాక్టు బంగారం ధర రూ. 2,310 తగ్గి రూ. 1,50,736కి పడిపోయింది. అంతర్జాతీయంగా కామెక్స్లో సిల్వర్ మార్చ్ కాంట్రాక్టు ఔన్సుకి 8.85 డాలర్లు క్షీణించి 75.55 డాలర్లకు దిగి వచ్చింది. పసిడి 80 డాలర్లు పడి 4,870.9 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.


