నైపుణ్య కల్పన సంస్కరణలు అవసరం
లాజిస్టిక్స్ రంగ నైపుణ్య మండలి అంచనా
న్యూఢిల్లీ: దేశ లాజిస్టిక్స్ రంగంలో 2030 నాటికి అదనంగా 47 లక్షల మంది సిబ్బంది అవసరం అవుతారని లాజిస్టిక్స్ రంగ నైపుణ్య మండలి సీఈవో రవికాంత్ యమర్తి అన్నారు. రవాణా, గోదాములు, సరఫరా వ్యవస్థ వ్యాప్తంగా సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. ఈ తక్షణ, పెరుగుతున్న డిమాండ్ను అధిగమించేందుకు నైపుణ్యాల కల్పనకు సంబంధించి భారీ సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ రంగంలో నియామకాలు బలంగా ఉన్నాయంటూ, 2025 ద్వితీయ ఆరు నెలల్లో 10.8 శాతం పెరిగినట్టు చెప్పారు. పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ ఎన్నో ఖాళీలు భర్తీ అవుతుండడాన్ని ఇది తెలియజేస్తోందన్నారు.
ముంబైలో జరిగిన లాజిమ్యాట్ ఇండియా 2026 ఆరంభ కార్యక్రమంలో భాగంగా రవికాంత్ మాట్లాడారు. నైపుణ్యాల అంతరాన్ని అధిగమించేందుకు లాజిమ్యాట్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 350 అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. లాజిస్టిక్స్ ఆవిష్కరణలు, సహకారం పరంగా అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ప్రాధాన్యం పెరుగుతున్నట్టు ల్యాండెస్మెస్సే స్టగర్ట్ జీఎంబీహెచ్ అండ్ కేజీ వైస్ ప్రెసిడెంట్ బెర్న్హర్డ్ ముల్లర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లాజిస్టిక్స్ రంగంలో మరింత మంది మహిళలు భాగస్వాములు అయినప్పుడు లాజిస్టిక్స్ రంగ వృద్ధి మరింత వేగాన్ని సంతరించుకుంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ శ్యామ్ జగన్నాథన్ అభిప్రాయపడ్డారు.


