యూఎస్ డీల్పై పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మార్చి మధ్య నాటికి భారత్, అమెరికా సంతకాలు చేస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అనంతరం భారత వస్తు దిగుమతులపై అమెరికా సుంకాలు తగ్గిస్తుందని చెప్పారు. అలాగే, అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపైనా భారత్ సుంకాలు తగ్గిస్తుందన్నారు. తొలి దశ వాణిజ్య ఒప్పందంపై వచ్చే 4–5 రోజుల్లో రెండు దేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేస్తాయని చెప్పారు. అనంతరం భారత ఉత్పత్తులపై సుంకాలు 18 శాతానికి దిగొస్తాయని చెప్పారు.
ప్రస్తుతం భారత వస్తువులపై 50 శాతం టారిఫ్లను అమెరికా అమలు చేస్తోంది. దీన్ని 18 శాతానికి తగ్గించనున్నట్టు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఇందులో 25 శాతం, రష్యాపై చమురు కొంటున్న కారణంగా విధించినది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) మొదటి దశ దాదాపు సిద్ధమైంది. వచ్చే నాలుగైదు రోజుల్లో దీన్ని ఖరారు చేసి, సుంయక్త ప్రకటన విడుదల చేస్తాం. దీని ఆధారంగా భాగస్వామ్యం తొలి దశ మొదలవుతుంది’’అని గోయల్ వివరించారు. భారత ఉత్పత్తులపై 18 శాతం సుంకాలన్నవి అమెరికా జారీ చేసే అధికారిక ఉత్తర్వు ద్వారా అమల్లోకి వస్తాయన్నారు.
500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు..
500 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లపై గోయల్ స్పందిస్తూ.. భారత్ చాలా వేగంగా వృద్ధి సాధిస్తోందంటూ.. ఇందుకు పెద్ద మొత్తంలో ఇంధనం, డేటా సెంటర్ల ఎక్విప్మెంట్, ఐసీటీ ఉత్పత్తులు అవసరం అవుతాయని చెప్పారు. ఈ ప్రకారం రూ.500 బిలియన్ డాలర్లు అన్నది ఒక అంచనా అని.. అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో ఈ స్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.


