సాక్షి, అనకాపల్లి: ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్పై భూకబ్జా ఆరోపణలు బయటకు వచ్చాయి. దాదాపు 200 కోట్లు విలువైన 42 ఎకరాల భూమిని కబ్జా చేయాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ చూస్తున్నారని దళితులు ఆరోపించారు. ఆ భూములే తమకు జీవనాధారం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల మేరకు.. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్పై రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామానికి చెందిన దళితులు భూ కబ్జా ఆరోపణలు చేశారు. 50 ఏళ్ల క్రితం తమకు ఇచ్చిన 42 ఎకరాల భూములను విజయ్ కుమార్ కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆ భూములే తమకు జీవనాధారం.. సదరు 42 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. మా భూముల్లోకి వెళ్లొద్దంటూ అధికారులు పోలీసులు బెదిరిస్తున్నారు. నిరసన తెలియజేసేందుకు వేసిన టెంట్ను కూడా పోలీసులు అర్ధరాత్రి తొలగించారని అన్నారు.
తమ భూములు బలవంతంగా తీసుకుంటే చావడానికి అయిన సిద్ధమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాలు పెరిగిపోయాయి. గడిచిన 50 ఏళ్ల సమయంలో మా భూములను ఎవరు తీసుకునే సాహసం చేయలేదు. కానీ, ఇప్పుడు కూటమి నేతల కన్ను మా భూములపై పడింది అంటూ మండిపడ్డారు.


