చిప్‌ పోతేనే కదా ఇలాంటి పనులు చేసేది: బొత్స | Botsa Slams Chandrababu Jungle Raj Over Jogi House Incident | Sakshi
Sakshi News home page

చిప్‌ పోతేనే కదా ఇలాంటి పనులు చేసేది: బొత్స

Feb 7 2026 1:19 PM | Updated on Feb 7 2026 1:33 PM

Botsa Slams Chandrababu Jungle Raj Over Jogi House Incident

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  

‘‘ఒక మాజీ మంత్రి నివాసంపై పెట్రోల్‌ బాంబులు వేయడం ఏంటి?. పెట్రోల్ బాంబులు వేయడాన్ని జై ఆంధ్ర ఉద్యమం సమయంలో చూశా. పోలీసులు ఉంది దేనికి అసలు?. పోలీసులంటే దాడులు ఆపాలి. అదీ పోలీసింగ్‌ అంటే. కానీ, ఇక్కడ పోలీసులు గూండాలకు ఎస్కార్టులుగా, రక్షణగా ఉంటున్నారు. పోలీసులు, గూండాలు కలిసి దాడికి వస్తారా?. ఇదెక్కడైనా చూశామా?. 30 ఏళ్లలో ఇలాంటివి చూడలేదు. ఇంటిపై దాడి చేస్తే ఏ కేసులు పెట్టాలి?. ఏ సెక్షన్లు పెట్టాలి?. దాడులు చేసిన నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇస్తారా?..304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు...కారణమేంటి?. 

.. జోగి రమేష్‌ ఇంటిపై దాడి హేయమైన చర్య. ఈ దాడి క్షణికావేశంలో జరిగింది కాదు. ఇది పక్కా ఆర్గనైజ్డ్ దాడి. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఏదైనా జరగకూడనిది జరిగితే ఏంటి పరిస్థితి. చంద్రబాబూ.. అసలు మీ ఆలోచన ఏంటి ?. జోగి రమేష్‌ అన్నదాంట్లో తప్పేముంది?. ఆయన చెప్పినట్లు మంత్రి లోకేష్‌కే కాదు చంద్రబాబుకి కూడా చిప్‌ పోయినట్లు ఉంది. చిప్‌ పోతేనే ఇలాంటి పనులు చేస్తారు. రాజకీయాల్లో సంమయనం పాటించాలి కానీ.. ప్రతీకారాలకు పాల్పడకూడదు. జోగి రమేష్ కు కూడా నేను ఇదే సూచించా. ఈ దాడి ఘటనను మనసులో పెట్టుకోవద్దని జోగి రమేష్ చెప్పా. ఈ ప్రభుత్వం చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం..

..చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?.  రాష్ట్రంలో అసలు పాలన ఉందా?. శాంతి భద్రతలు అసలు ఉన్నాయా?. ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఇలాంటి దాడులు రాజకీయంగా చాలా తప్పు. ప్రజాస్వామ్యం గురించి చెప్పే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం మాట్లాడతారు?. పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు. తాను ఏం మాట్లాడుతున్నారో .. తాను చెప్పిన సనాతన ధర్మమేంటో పవన్ తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్నా దాడులు ...ఆడపిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలు పవన్‌కు కనిపించడం లేదా?. 

.. రాజకీయంగా మీరు తప్ప వేరే ఎవరూ బ్రతక కూడదా?. చంద్రబాబూ.. ఏమైంది మీ జ్ఞానం?. మీ తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్‌సీపీ బెదరదు. ఈ దాడుల పై న్యాయపోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గపు ఆలోచనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి గెలిపించడం ధర్మమేనా ఆలోచన చేయాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం ప్రమాదకరం’’ అని బొత్స అన్నారు. 

ఈ ప్రభుత్వానికి అసలు ఆలోచన ఉందా... ప్రతీదీ డైవర్షన్ చేయడమేనా?. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ చెప్పింది. లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్రోల్ బాంబులు వేయిస్తారా?. లడ్డూ వ్యవహారం పై సిట్ ఏమి చెప్పిందో మీరెందుకు చెప్పలేకపోతున్నారు. లడ్డూ అంశం పై ఏకసభ్య కమిషన్ వేయడం దేనికి?. పవన్ ,లోకేష్ ,బీజేపీ నేతలను ముగ్గురిని కలిపి ఒక కమిషన్ వేయొచ్చు కదా!. ఆ దేవదేవుడిని ఎందుకు రోజూ కించపరుస్తున్నారు?. దేవుడితో రాజకీయాలెందుకు?.. దేవుడే అన్నీ చూస్తున్నాడు. తప్పు చేస్తే..తప్పు మాట్లాడితే ఆ దేవుడే శిక్షిస్తాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది...అంతే కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన వారిని ఎవరినీ వదలం. చట్టముందు దోషులుగా నిలబెడదాం..

ఈ ప్రభుత్వం తీరు ఆడలేక మద్దెల ఓడ మాదిరి ఉంది. చంద్రబాబు తనను విశ్వామిత్రుడు, వశిష్టమహర్షిగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడిందే నిజం అనుకుంటున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందని ఎన్ని కేసులైనా పెడుతుంది ఈ దుర్మార్గపు ప్రభుత్వం. మా నేతల పై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. రైతులకు యూరియా కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఇది అని బొత్స మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement