బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి.. | Rich Dad Poor Dad Robert Kiyosaki Stops Buying Gold, Silver, Bitcoin Until Prices Hit New Lows, Check His Post Inside | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..

Feb 6 2026 1:04 PM | Updated on Feb 6 2026 2:16 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki stops buying gold silver Bitcoin

“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్‌కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ఎక్స్‌’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్‌లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడే కొనేది లేదు
వెండి ధర 60 డాలర్లు, బిట్‌కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్‌కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.

గురువారం సెషన్‌లో బిట్‌కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్‌ట్విట్స్ ప్రకారం.. బిట్‌కాయిన్‌పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్‌లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.

బంగారం, వెండి మార్కెట్ పరిస్థితి
గురువారం రాత్రి బంగారం ఔన్స్‌కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్‌ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్‌  (GLD) రెగ్యులర్ ట్రేడింగ్‌లో  2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్‌లో మరో 0.92% తగ్గింది. స్టాక్‌ట్విట్స్‌లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.

ఇదీ చదవండి: క్రాష్‌.. క్రాష్‌.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి

ఇక​ వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్‌లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్‌ సిల్వర్‌ ట్రస్ట్‌ (SLV) ఆఫ్టర్ అవర్స్‌లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.

సమయం, సహనం కీలకం
ధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.

“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement