న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల నియంత్రణల్లో కీలక మార్పులను సెబీ ప్రతిపాదించింది. వీటిల్లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులకు అనుమతించడం ఇందులో కీలకమైనది. ఇతర పెట్టుబడుల’ కింద 20 శాతం పరిమితికి లోబడి లిక్విడ్ ఫండ్స్ రీట్లు, ఇన్విట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఇన్విట్లు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీలు)ను వాటి రాయితీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగించేందుకు అనుమతించనుంది. ప్రైవేటు ఇన్విట్లు తమ ఆస్తుల్లో 10 శాతం వరకు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సైతం ప్రతిపాదించింది. అలాగే ఇన్విట్ల ఆస్తుల విలువలో నికర రుణ భారం 49 శాతం మించినప్పుడు, తాజా రుణాల వినియోగ పరిధినీ విస్తృతం చేయాలన్నది మరో ప్రతిపాదన.
ఆస్తుల కొనుగోలు, అభివృద్ధి కోసమే కాకుండా... మూలధన విస్తరణ, ఆస్తుల నిర్వహణ కోసం సైతం ఇన్విట్లు తాజా రుణ సమీకరణకు అనుమతించనుంది. ఇందుకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 26 వరకు అభిప్రాయాలు తెలియజేయాలని సెబీ కోరింది.


