రికార్డు స్థాయిలో రూ.21,317 కోట్ల నికర లాభం
వార్షిక ప్రాతిపదికన 13.06% వృద్ధి నమోదు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) డిసెంబర్ త్రైమాసికంలో రికార్డు లాభాలు నమోదు చేసింది. తన అసెట్ మేనేజ్మెంట్ అనుబంధ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ కలుపుకొని... కన్సాలిడేషన్ ప్రాతిపదికన రూ.21,317 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది క్యూ3లో నమోదైన రూ.18,853 కోట్ల నికర లాభంతో పోలిస్తే 13.06 శాతం వృద్ధి నమోదైంది.
బ్యాంకు చరిత్రలోనే ఒక క్వార్టర్లో ఇదే అత్యధిక నికర లాభం కావడం విశేషం. మొత్తం వయ్యాలు రూ.1.04 లక్షల కోట్ల నుంచి రూ.1.08 లక్షల కోట్లకు చేరాయి. ఇదే క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 9.04% పెరిగి రూ.41,446 కోట్ల నుంచి రూ.45,190 కోట్లకు చేరింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) స్వల్పంగా 0.03% తగ్గి 3.12 శాతంగా నమోదైంది. డివిడెండ్ను కలుపుకొని వడ్డీయేతర ఆదాయం 15.65% పెరిగి రూ. 8,404 కోట్లకు చేరింది.
→ ఆస్తుల నాణ్యతలో బ్యాంకు మెరుగైన పనితీరు కనబరిచింది. డిసెంబర్ 31 నాటికి స్థూల ఎన్పీఏ(మొండి బకాయిలు)లు 2.2% నుంచి 1.57 శాతానికి పరిమితమయ్యాయి. కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ స్థూల ఎన్పీఏలు 1.74% గా ఉన్నాయి. స్లిప్పేజీలు రూ.3,823 కోట్ల నుంచి రూ.4,458 కోట్లకు పెరిగినప్పట్టకీ.., మొత్తం ఎన్పీఏలు నియంత్రణలోనే ఉన్నాయని బ్యాంకు చెప్పుకొచ్చింది.
→ మొండి బకాయిలకు కేటాయింపులు (ప్రొవిజన్లు) రూ.911 నుంచి రూ.4,507 కోట్లకు పెరిగాయి. భవిష్యత్తు అనిశి్చతులను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఈ కేటాయింపులు చేసినట్లు బ్యాంకు తెలిపింది.
→ డిసెంబర్ త్రైమాసికంలో రుణాలు 15.14 శాతం పెరిగాయి. ఇందులో కార్పొరేట్ రుణాలు 13.3% వృద్ధి సాధించగా, రిటైల్ రుణ విభాగం కూడా నిలకడగా కొనసాగింది. డిపాజిట్లు 9.02% పెరిగాయి. క్రిడెట్–డిపాజిట్ నిష్పత్తి 72 శాతంగా అనువైన స్థితిలో ఉంది.
ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.... ‘‘రుణవృద్ధి గణనీయంగా పెరగడం, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ అంశాలు బ్యాంకు నికర లాభాల వృద్ధికి దోహదపడ్డాయి. కార్పొరేట్ రుణాలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ రుణ విభాగం నిలకడైన ప్రదర్శనతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణాల వృద్ధి లక్ష్యాన్ని 13–15 శాతానికి పెంచుతున్నాము. భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ఖరారుతో బ్యాంకులు రుణ వృద్ధి మరింత పుంజుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్)కు రుణాలిచ్చేందుకు బ్యాంకులను అనుమతించాలనే ఆర్బీఐ ప్రతిపాదనను, మోసాలకు గురైన ఖాతాదారులకు రూ. 25,000 వరకు పరిహారం చెల్లింపు నిర్ణయాలను స్వాగతిస్తున్నాము. ఎస్బీఐ ‘‘డిజిటల్–ఫస్ట్’’ బ్యాంకుగా మారే దిశగా ముందుకెళ్తోంది’’ అన్నారు.


