సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్
జాబితాలో ఇన్క్రెడ్ హోల్డింగ్స్
మన్ ఫ్లీట్ పార్ట్నర్స్ వెనకడుగు
ఐపీవో స్ట్రీట్
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలోనూ దేశీయంగా ప్రైమరీ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్యనే కదులుతున్నప్పటికీ పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా 8 కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: ఐపీవో చేపట్టేందుకు వీలుగా గతేడాది(2025) సెపె్టంబర్– నవంబర్ మధ్య కాలంలో సెబీకి 9 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో మన్ ఫ్లీట్ పార్ట్నర్స్ ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకోగా.. మిగిలిన 8 కంపెనీలకు సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో ఇన్క్రెడ్ హోల్డింగ్స్సహా.. ఆర్వీ ఇంజినీరింగ్, ఎలివేట్ క్యాంపసస్, శంకేష్ జ్యువెలర్స్, ఆర్మీ ఇన్ఫోటెక్, ఆర్డీ ఇండస్ట్రీస్, సెడెమాక్ మెకట్రానిక్స్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా చేరాయి. ప్రాస్పెక్టస్ల ప్రకారం ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 10,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇప్పటికే కొత్త ఏడాది(2026)లో భారత్ కోకింగ్ కోల్, షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్, అమాగీ మీడియా ల్యాబ్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కాగా.. మొత్తం రూ. 4,766 కోట్లు సమీకరించిన విషయం విదితమే.
ఎన్బీఎఫ్సీ నుంచి..
ఎన్బీఎఫ్సీ ఇన్క్రెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఇన్క్రెడ్ హోల్డింగ్స్ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసి అనుమతి పొందింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ ద్వారా రూ. 3,000–4,000 కోట్ల మధ్య సమీకరించే ప్రణాళికల్లో ఉంది.
ఎడ్యుకేషన్ ద్వారా
విద్యార్ధుల వసతి(స్టూడెంట్ ఎకామడేషన్), కే–12 ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఎలివేట్ క్యాంపసస్ ఐపీవో ద్వారా రూ. 2,550 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కొత్తగా ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కే–12 సంస్థల కొనుగోలు, క్యాంపస్ల ఏర్పాటు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులు వెచ్చించనుంది.
కేబుళ్ల తయారీ
కేబుళ్లు, కండక్టర్ల తయారీ కంపెనీ లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఆటో విడిభాగాలు
పవర్ట్రెయిన్ నియంత్రిత వ్యవస్థలు, ఆటో విడిభాగాల తయారీ కంపెనీ సెడెమాక్ మెకట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 800–1,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80,43,300 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.
లెడ్ అలాయ్స్
లెడ్ స్మెల్టర్ కంపెనీ ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.76 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలు, రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత నాణ్యతగల లెడ్ అలాయ్స్ను తయారు చేస్తోంది.
ఐటీ ఇన్ఫ్రా..
ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లు అందించే ఆర్మీ ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 250 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఇన్ఫ్రా కన్సెల్టెన్సీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ సరీ్వసుల కంపెనీ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 203 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 67.5 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు.
బంగారు ఆభరణాలు
బంగారు ఆభరణాల తయారీ కంపెనీ శంకేష్ జ్యువెలర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో కోటి షేర్లను ప్రస్తుత వాటా దారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 158 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 38 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది.


