న్యూఢిల్లీ: భారత్–అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుతో యూఎస్కు చెందిన ప్రీమియం బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్కు భారీ ప్రయోజనం చేకూరనుంది. ట్రేడ్ డీల్లో భాగంగా 800–1600 సీసీతో పాటు అంతకు మించి ఇంజిన్ సామర్థ్యం కలిగిన అమెరికా మోటార్స్సైకిళ్లపై దిగుమతి సుంకం సున్నా(జీరో టాక్స్) శాతానికి తగ్గాయి. దీంతో తమ కంపెనీకి భారీ ఊరట లభించిందని హార్లే డేవిడ్సన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
‘‘ఒప్పందం అమలు రోజు నుంచి మోటార్ సైకిళ్లపై ఎలాంటి సుంకాలు ఉండవు. ప్రీమియం బైక్ల విభాగంలో భారత్ చిన్న మార్కెట్ అయినప్పటికీ, ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది’’ అన్నారు. హార్లే డేవిడ్సన్కు గతేడాదిలోనూ ప్రభుత్వం ఊరట కల్పించింది. 1,600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని 50 %నుంచి 40 శాతానికి, 1,600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కస్టమ్స్ డ్యూటీ 50% నుంచి 30 శాతానికి సవరించింది.
భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ డీల్ 2026 మార్చిలో చట్టబద్దం కానుంది. తాజాగా ట్రేడ్ డీల్ భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే 3000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ కార్లు, 2500 సీసీ ఇంజిన్ కలిగిన డిజిల్ కార్లపై సుంకాలను భారత్ తగ్గించింది.


