సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం ఉదయం ల్యాబ్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం, అగ్ని ప్రమాదంపై శిఖా గోయల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ప్రమాదంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో ఆఫీసులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నాం. దయచేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది.
ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి. 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయి. కేసుకు సంభంచిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందపరిచాం. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చింది. ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం లేదు. ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుంది.
2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్కి సంబంధించిన ఫోన్ టాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కి వచ్చాయి. మిగతా మెటీరియల్ అసిస్ట్ చేసాం. ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి. వీటిని రిట్రివ్ చేస్తాం. ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఇంత వరకు ఎంత నష్టం జరిగింది స్పష్టత లేదు. ఈ కేసుకు సంభంచిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏ కేసుకు సంబంధించిన మెటీరియల్ ధ్వంసమైంది? అనేది విచారణ జరుపుతున్నాం అని క్లారిటీ ఇచ్చారు.


