అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాను టార్గెట్ చేశారు. మరో వాణిజ్య వివాదానికి తెరలేపారు. కెనడా-అమెరికా మధ్య వంతెనను బ్లాక్ చేస్తామంటూ హెచ్చరించారు. అమెరికా నుంచి పొందిన వాటన్నింటికీ పూర్తిస్థాయిలో చెల్లించకపోతే చర్యలు తప్పవన్న ట్రంప్.. ఈ మేరకు తన 'ట్రూత్ సోషల్' (Truth Social) ప్లాట్ఫామ్లో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. వాణిజ్య పరంగా కెనడా అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.
గోర్డీ హోవే బ్రిడ్జ్ (Gordie Howe Bridge) ప్రాజెక్టుపై కెనడాతో తక్షణమే చర్చలు ప్రారంభిస్తామని.. వాషింగ్టన్కు కనీసం సగం వాటా, తగిన పరిహారం చెల్లించే వరకు వంతెన ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామంటూ ఆయన హెచ్చరించారు. దశాబ్దాలుగా కెనడా అమెరికా పట్ల.. చాలా అన్యాయంగా" వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంటారియో, మిచిగాన్ మధ్య నిర్మిస్తున్న ఈ కొత్త వంతెన విషయంలో పూర్తి పరిహారం అందే వరకు దానిని తెరవనిచ్చేది లేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు.

గోర్డీ హోవ్ బ్రిడ్జ్ ప్రాముఖ్యత..
మిచిగన్- కెనడా ఒంటారియోను కలిపే ఆరు లైన్ల వంతెన ఇది.. డెట్రాయిట్ నది మీదుగా నిర్మాణం జరుగుతోంది. ఇది మిచిగాన్లోని ఇంటర్ స్టేట్-75ని అంటారియోలోని హైవే 401తో నేరుగా కలుపుతుంది. ట్రాఫిక్ తగ్గించి, రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
గతంలో కూడా కెనడాపై ట్రంప్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గ్రీన్లాండ్పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోందంటూ ఆయన మండిపడ్డారు.


