వాషింగ్టన్: భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై తాజాగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఈ ఒప్పందం కేవలం ఈ రెండు దేశాలకు మాత్రమే గరిష్ట ప్రయోజనాలను చేకూర్చేలా రూపొందుతున్నదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ద్వైపాక్షిక మార్కెట్ సౌలభ్యం, టారిఫ్ తగ్గింపులు, కఠినమైన ‘రూల్స్ ఆఫ్ ఆరిజిన్’ (వస్తువుల మూల స్థాన నిబంధనలు) ద్వారా కేవలం భారతీయ, అమెరికన్ ఉత్పత్తులు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య జరిగిన చర్చల అనంతరం విడుదలైన ఈ ముసాయిదా, ఇరు దేశాల ఆర్థిక, జాతీయ భద్రతా ప్రయోజనాలను ఏకీకృతం చేయనుంది.
కీలకంగా ‘రూల్స్ ఆఫ్ ఆరిజిన్’
ఈ ఒప్పందంలో భాగంగా సుంకాల విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించడంతో, భారతీయ దిగుమతులపై గతంలో ఉన్న 25 శాతం అదనపు టారిఫ్ను తొలగించడానికి ట్రంప్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనితో పాటు, పరస్పర వాణిజ్య సమతుల్యత కోసం భారత్పై విధిస్తున్న సుంకాలను 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించనున్నారు. ఇతర దేశాలు వేరే మార్గాల్లో ఈ రాయితీలను పొందకుండా అడ్డుకోవడమే ఈ ‘రూల్స్ ఆఫ్ ఆరిజిన్’ ప్రధాన ఉద్దేశమని వైట్ హౌస్ పేర్కొంది.
భారత మార్కెట్లోకి అమెరికన్ ఉత్పత్తుల జోరు
ఈ ఒప్పందం కారణంగా అమెరికాలోని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు భారత్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం సోయాబీన్ ఆయిల్, పండ్లు, డ్రై ఫ్రూట్స్, వైన్, స్పిరిట్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించనుంది. దీనికి ప్రతిగా రాబోయే ఐదేళ్లలో ఇంధనం, విమానయాన రంగాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బొగ్గు తదితర రంగాల్లో అమెరికా నుండి సుమారు 500 బిలియన్ డాలర్ల (రూ. 45,37,000 కోట్లు)విలువైన కొనుగోళ్లు జరపాలని భారత్ నిర్ణయించుకుంది. ఇది ఇరు దేశాల మధ్య సరఫరా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయనుంది.
డిజిటల్ వాణిజ్యం- భవిష్యత్ ప్రణాళిక
కేవలం వస్తువులే కాకుండా డిజిటల్ వాణిజ్యంపై కూడా ఈ ఒప్పందం ప్రత్యేక దృష్టి సారించింది. భారత్ తన డిజిటల్ సేవల పన్నులను తొలగించడంతో పాటు, ఎలక్ట్రానిక్ లావాదేవీలపై కస్టమ్స్ డ్యూటీలు లేకుండా చేసేందుకు ద్వైపాక్షిక నిబంధనలపై చర్చలు సాగించనుంది. త్వరలోనే ఈ మధ్యంతర ఒప్పందాన్ని అమలులోకి తెచ్చి, తదుపరి దశలో సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని (బీటీఏ) ఖరారు చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఫలితంగా మేధో సంపత్తి, కార్మిక రంగాల్లో కూడా పారదర్శకత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పుతిన్తో భేటీకి ఎప్స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు..


