టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్లో పాకిస్తాన్ బొక్కబోర్లా పడింది. పసికూన బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఘోరంగా విఫలమైంది. మూడు మ్యాచ్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న పాక్.. ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్ 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.
పేసర్లు నహిద్ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్ రహ్మాన్ (4.4-0-18-1), తస్కిన్ అహ్మద్ (7-029-1), స్పిన్నర్ మెహిది హసన్ మిరాజ్ (10-0-29-3) ధాటికి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ విలవిలలాడిపోయింది. పాక్ ఇన్నింగ్స్లో ఎనిమిదో నంబర్ ఆటగాడు ఫహీమ్ అష్రాఫ్ చేసిన 37 పరుగులే అత్యధికం.
తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్జాదా ఫర్హాన్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. పాక్ ఇన్నింగ్స్లో ఫహీమ్, ఫర్హాన్ కాక మాజ్ సదాకత్ (18), మొహమ్మద్ రిజ్వాన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు.
మిగతా పాక్ ప్లేయర్లలో హమిల్ హుసేన్ 4, సల్మాన్ అఘా 5, హుసేన్ తలాత్ 4, షాహీన్ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్ సమద్, మొహమ్మద్ వసీం జూనియర్ డకౌటయ్యారు.
బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రపంచకప్ నుంచి వైదొలిగే విషయంలో బంగ్లాదేశ్కు అండగా ఉండినట్లు నటించి, చివరి నిమిషంలో హ్యాండిచ్చిన పాక్కు కూడా ప్రపంచకప్ తర్వాత ఇదే తొలి మ్యాచ్. పాక్ ప్రపంచకప్లో సూపర్-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఈ సిరీస్కు పాక్ సీనియర్ ఆటగాడు బాబర్ ఆజమ్ లేకుండా బరిలోకి దిగింది. పాక్ జట్టుకు షాహీన్ అఫ్రిది నాయకత్వం వహిస్తున్నాడు. జట్టు మారినా, ప్లేస్ మారినా పాక్ ఆటతీరులో మాత్రం ఏ మార్పు లేదు. ప్రపంచకప్తో పోలిస్తే ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా ప్రభావం చూపలేకపోయాడు. ఈ మ్యాచ్లో పాక్ గట్టెక్కితే అద్భుతమే.


