టీ20 వరల్డ్కప్-2026 విజేత టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ ఇమాద్ వసీం ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్కు అనుకూలంగా బ్యాటింగ్ పిచ్లు సిద్ధం చేశారనే ఆరోపణలను వసీం కొట్టిపారేశాడు. భారత్ ఒక అద్భుతమైన జట్టు అని అతడు కొనియాడాడు.
కాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. వరుసగా రెండోసారి టైటిల్ను సొంతం చేసుకోవడమే కాకుండా.. ఓవరాల్గా మూడు సార్లు పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది.
అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ టోర్నీ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. కొంతమంది మాత్రం భారత్ 'పిచ్ల రిగ్గింగ్' చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఓ పాకిస్తాన్ టీవీ ఛానల్ డిబేట్లో వసీం భారత్కు మద్దతుగా నిలిచాడు.
"పాకిస్తాన్ కంటే భారత్ చాలా పెద్ద జట్టు. ఈ విజయానికి వారు అన్ని రకాల అర్హులు. అంపైర్లు భారత్కు సహకరిస్తారని లేదా వారు స్పిన్ అనుకూల పిచ్లు సిద్ధం చేసుకుంటారని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఈ టోర్నీలో పిచ్లు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి.
కొన్నిసార్లు పరిస్థితులు భారత్కు అనుకూలంగా లేనప్పటికి వారు అద్భుతంగా ఆడారు. తప్పులు వెతకడం మానేసి, ఒక క్రికెట్ జట్టు ఉన్న దేశంగా మనం వారిని అభినందించాలి. పాక్ కంటే భారత్ అద్భుతమైన జట్టు అన్న విషయాన్ని మనం అంగీకరించాలి"అని వసీం పేర్కొన్నాడు. కాగా కొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.


