ఆటలు, పాటలు, డ్యాన్స్లతో నానా గందరగోళం, సివిక్ సెన్స్పై చర్చ
రైలు ప్రయాణం అనేక ప్రాంతాలను పరిచయం చేస్తుంది. అందమైన ప్రకృతి.. పచ్చని చెట్లు, ఏపుగా ఎదిగిన పైరులు..ఇలా చాలా అనుభవాలను మిగులుస్తుంది. దీంతో పాటు ఒక్కోసారి కొన్ని చేదు అనుభవాలు కూడా తప్పవు. అలా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి భయంకరమై అనుభవం ఎదురైంది. చివరికి రైల్వే హెల్ప్ లైన్కి కాల్ చేసేంతగా ఆయన ఓపిక నశించింది. దీనికి సంబంధించి ఆయన షేర్ చేసిన నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ప్రయాణాన్ని "లైవ్ రియాలిటీ షో"గా మార్చేసారని అభివర్ణిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.
ఇంతకీ ఏమి జరిగిందంటే మన్మోహన్ వర్మ అనే ప్రయాణీకుడు చేసిన వివరాల ప్రకారం ఇటీవల ఆయన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో బిలాస్పూర్ నుండి లక్నోకు ప్రయాణిస్తున్నారు. ఈయన ప్రయాణిస్తున్న బోగీలోనే 20-30 మంది సభ్యులు గల ఒక కుటుంబం కూడా చేరింది. రైలు ఎక్కింది మొదలు ఒకటే గోల. బోగిని అరుపులు, కేకలు, పాటలతో "రీల్ స్టూడియో"గా మార్చింది. కోచ్ లోపల డ్యాన్స్ చేస్తూ రీల్స్తో రచ్చ రచ్చ చేశారు. వ్యక్తి తన తలపై రైల్వే బెడ్షీట్ పెట్టుకుని ఇతరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇతర ప్రయాణీకుల అసౌకర్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గంటల తరబడి ఇలా నానా యాగీ చేశారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన వర్మ రైల్వే హెల్ప్లైన్కు (139)ను సంప్రదించారు. దీంతో రైల్వే పోలీసులు ఫిర్యాదుపై స్పందించి, కోచ్లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
‘‘రైల్వే కోచ్ అనేది పబ్లిక్ ప్లేస్. మన సొంత స్థలం కాదు.. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ప్రయాణీకుల్లో కనీస సివిక్ సెన్స్ లేకుండా పోయిందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కోచ్ ఒక ప్రైవేట్ లివింగ్ రూమ్ కాదూ, రీల్-మేకింగ్ సెట్ అంతకన్నా కాదన్నారు. పెద్ద పెద్దగా శబ్దాలు చేయకుండా కనీస మర్యాదతో మెలగాలి. తోటి ప్రయాణీకులను గౌరవించాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అపుడు మాత్రమే ప్రయాణం ఆనందంగా ఉంటుందంటూ తన పోస్ట్లో చెప్పారు.
నెటిజన్లు స్పందన
దీనిపై నెటిజన్లు కూడా స్పందించి తన అనుభవాలు పంచకున్నారు. రైళ్లలో పుట్టిన రోజు జరుపుకోవడం,
బిగ్గరగా ఆడిపాటం లాంటి భయంకరమైన అనుభవం తనకూ ఎదురైందంని ఒక యూజర్ పేర్కొన్నారు.
ఇలాంటి అనుభవాలు రైళ్లలో ప్రయాణించే వారికి చాలా ఎదురవుతూ ఉంటాయి. తాజా వీడియో పబ్లిక్ ప్రదేశాల్లోఎలా ప్రవర్తించాలి, ఇతర ప్రయాణీకులను ఎలా గౌరవించాలి అనేదానిపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
(చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్ గైడ్)


