ఆరోగ్యం, వ్యాయామాలు సామాన్యుల వల్ల ఎక్కడవుతుంది అన్నమాటలు ఎన్నోసార్లు విని ఉంటారు. బాగా డబ్బున్నవాళ్లకు, యువతకు మాత్రమే సాధ్యం అనేది చాలామంది భావన. వాళ్లకు ఏ బాధ్యతలు, బరువులు అంతగా ఉండవు కాబట్టి హాయిగా చేయగలరని అనుకుంటుంటారు. కానీ ఈ మధ్యతరగతి జంట గురించి విన్నాక ఆ అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. 50లలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మేల్కొని విజయం సాధించడమే గాక..ఇతరులకు స్వచ్ఛందంగా ఆరోగ్యస్పృహ కలిగిస్తున్నారు. మరి ఆ జంట ఫిట్నెస్ ప్రయాణం ఎలా సాగిందంటే..
చాలామందికి ఫిట్నెస్ అనేది యువతకు చెందినదిగా అనిపిస్తుంది. పెద్దలకు సుదీర్ఘ పనిదినాలు, కుటుంబ బాధ్యతలు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేలా చేస్తాయి. కనీసం శరీరం చెప్పే సంకేతాలను కూడా పట్టించుకోరు. తమ ఆరోగ్యం కంటే..కుటుంబ బరువు బాధ్యతలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలానే భావించారు డెహ్రాడూన్కు చెందిన తారా థాపా ఆయన భార్య సుశీలా. తార ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ రిపేర్ షాపుని నడుపుతుండగా, సుశీల బీమా సలహాదారుగా పనిచేస్తోంది.
ఈ ఇద్దరి ఫోకస్ కుటుంబ బాధ్యతలపైనే ఉంది. తమ ఇద్దరు కుమారులను పెంచడం, ఓ చక్కటి ఇంటిని నిర్మించుకోవడం ఇవే తమ ఆశయలు, జీవితం అన్నట్లుగా బతికారిద్దురు. అనుకున్నట్లుగా కుమారులు చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ఒకరు సోలార్ పర్మిట్ డిజైనర్గా, మరొకరు కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్నారు. కానీ అప్పటికే ఆ జంటను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తారాకి తీవ్రమైన వెన్నునొప్పి, సుశీల నిరంతర అలసట, పునరావృతమయ్యే మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డారు ఇద్దరూ.
అప్పుడే ఇరువురికి తమ శారీరక పరిమితులను అంగీకరిస్తూ ఆగిపోకూడదని అనిపించింది. ఆ అనారోగ్య సమస్యలను సవాలు చేసేలా.. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. 2017లో, తార ఫిట్నెస్పై తీవ్రంగా దృష్టి పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసి భార్య సుశీల రెండేళ్ల తర్వాత 2019లో ఆయన బాటలోనే నడిచింది. అలా ఈ జంట రోజు సూర్యోదయానికి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. ఉదయం ఐదు గంటలకల్లా..వ్యాయామాలు చేయడానికి, వాకింగ్కి రెడి అయిపోతారు.
కొండలలో నివసించడం వల్ల వారు ప్రకృతిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మారింది. తరచుగా డెహ్రాడూన్ చుట్టూ ఉన్న పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేస్తూ సెలవులను ఆస్వాదిస్తుంటారు. భోజనంలో కూడా పప్పులు, కూరగాయలు, కాలనుగుణ పండ్లను భాగం చేసుకునేవారు. పండుగల సమయంలో కూడా, వారు అతిగా తినడం కంటే సమతుల్యతపే పాటిస్తూ.. మితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయాణం తమ సొంత ఇంటిని దాటి ప్రేరేపించడం మొదలైంది.
మూడేళ్ల క్రితం సుశీల పింక్ పాంథర్ అనే మహిళా సమూహాన్ని ప్రారంభించారు. ఈ బృందంలో మహిళలు సౌకర్యవంతమైన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి ఫిట్నెస్ను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు తమ ఇళ్లను వదిలి వెళ్ళడానికి కూడా సంకోచించిన చాలా మంది సభ్యులు ఇప్పుడు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుండటం విశేషం.
అంతేగాదు ఈ జంట తమ ఫిట్నెస్ ప్రయాణాన్ని ఆన్లైన్లో పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి కథ చాలమందికి కనెక్ట్ అయ్యి..ఎందరినో ప్రేరేపించింది. ఈ జంట వ్యక్తిగత వృద్ధి వాయిదాగా మారకూడదని, వయసు ఎప్పుడూ సాకుగా మారకూడదని తమ చేతలతో చెప్పకనే చెప్పారు కదూ. నెటిజన్లు సైతం చాలా స్ఫూర్తిదాయకం అని ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు.
గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికే. అనుసరించే ముందు వ్యక్తిగత సమస్యలను పరిగణనలోనికి తీసుకోవాలి, అలాగే వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!)


