సివిల్స్‌లో సత్తా చాటిన మహిళామణులు..! | Women increasingly dominating the civil services | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో సత్తా చాటిన మహిళామణులు..!

Mar 10 2026 3:45 PM | Updated on Mar 10 2026 3:50 PM

Women increasingly dominating the civil services

ఒకప్పుడు... ‘సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్‌ లో సత్తా చాటుతున్నారు...

24-35%: ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌లో మహిళల ప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.

41%: 2023 ఐఏఎస్‌ బ్యాచ్‌లో రికార్డ్‌ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.

18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.

అసామాన్య విజేతలు
ఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్‌సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ∙డాక్టర్‌ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్‌కు చెందిన అథిరా మగతన్‌ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడిపోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్‌లో ఆమె 483 ర్యాంక్‌. 

పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్‌దీప్‌ కౌర్‌ యూపీఎస్‌సీలో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 15 సాధించింది. కౌర్‌ తండ్రి సామాన్య రైతు. 

కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్‌ శ్రీజ చిన్న స్టడీ రూమ్‌లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్‌లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ సాధించడానికి ఆ కొటేషన్‌లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్‌స్ట్రక్షన్‌ వర్కర్‌. తల్లి సాధారణ గృహిణి. 

గుజరాత్‌లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్‌ ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్‌ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు.

పంజాబ్‌లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్‌దీప్‌ కౌర్‌ మొదటి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్‌  సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్‌సింగ్‌ పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్‌ కౌర్‌ గృహిణి

మధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్‌ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్‌సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్‌.

ఒకే ఒక్కరు!
సిక్కింలోని రాయ్‌గావ్‌కు చెందిన అన్నీలా షెర్పా, యూపీఎస్‌సీ పరీక్షలో ఆ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించిన ఏకైక అభ్యర్థిగా నిలిచి ఆల్‌ ఇండియా ర్యాంకు 893 సాధించింది. 

(చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement