విజయనగరంలో నిరసన తెలుపుతున్న మహిళలు
గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై కొంగుబిగించి కన్నెర్ర
వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కదిలిన వనితాలోకం
టీడీపీ నేత నిర్వాకంపై రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు చెరిగిన నారీమణులు
లైంగికదాడులు, హత్యలు, అవమానాలపై ఎగసిపడిన నిరసన జ్వాలలు
ర్యాలీలు, ధర్నాలతో అట్టుడికిన జిల్లా కేంద్రాలు
చంద్రబాబు దుశ్శాసన పాలనపై నారీలోకం కొంగు బిగించి కన్నెర్ర చేసింది. లైంగికదాడులు, హత్యలు, అవమానాలపై రణనేత్రియై సమరభేరి మోగించింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కింది. అతివలపై పెరుగుతున్న దారుణాలపై నిప్పులు చెరిగింది. ఈ దుష్ట సర్కారుకు ఒక్క క్షణం కూడా గద్దెపై ఉండే అర్హత లేదని ధ్వజమెత్తింది. ఫలితంగా ర్యాలీలు, ధర్నాలతో జిల్లా కేంద్రాలు అట్టుడికాయి. సర్కారు వెన్నులో వణుకుపుట్టించాయి.
సాక్షి, అమరావతి: చంద్రబాబు దుశ్శాసన పాలనలో పచ్చపైత్యంతో పేట్రేగిపోయిన టీడీపీ నేత, మరికొందరు కలిసి గుంటూరులో సాగించిన దుశ్శాసన పర్వంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కదంతొక్కారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వనితలకు రక్షణ కల్పించడంలో సర్కారు విఫలమైందని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.అంబేడ్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. చంద్రబాబు పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని, రాష్ట్రంలో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలు
⇒ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు శాంతియుత నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న మహిళలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు సంఘీభావం పలికారు.
నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ మహిళా నేతలు
⇒ గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో భారీగా పాల్గొన్న మహిళా నేతలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్ కుమార్, డైమండ్ బాబు, మహి సంఘీభావం తెలిపారు. 
గుంటూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న నేతలు
⇒ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సర్కారుకి సద్బుద్ధి ప్రసాదించాలని మహిళా నాయకులు సాయిలక్ష్మి, విజయలక్ష్మి, కుమారి తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
⇒ అనంతపురం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కూడా మహిళలు భారీ ధర్నా నిర్వహించారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
⇒ రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించారు. చంద్రబాబు దుశ్శాసన పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
పాడేరులో నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ మహిళా నాయకులు
చంద్రబాబు పాలనలో దుశ్శాసన పర్వం
రాష్ట్రంలో నిత్యం మహిళలు, బాలికలపై అఘాయిత్యాలతో చంద్రబాబు పాలన దుశ్శాసన పర్వాన్ని తలపిస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల భద్రతను గాలికొదిలేశారని, స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. ఆమె మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన అమానుష ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. రూ.10 వేలు లంచం ఇవ్వలేదన్న కారణంతో ఓ టీడీపీ నాయకుడు గుంటూరు నగరం నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు కూటమి నేతలు మహిళలపై వరుసగా దాడులకు పాల్పడుతున్నా, ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారని అన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. గుంటూరు ఘటనపై మహిళా హోం మంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని, బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. నిందితుడు టీడీపీ కార్యకర్త అయితే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. నేరస్తులను బహిరంగంగా ఎగ్జిబిట్ చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతోందని అన్నారు. గుంటూరు ఘటన దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయని కాకుండా, బాధితురాలికి న్యాయం చేయడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని వరుదు కళ్యాణి ప్రశ్నించారు.


