‘10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తా’ | YS Jagan Meet With Tobacco Farmers | Sakshi
Sakshi News home page

‘10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తా’

Jul 22 2026 2:30 PM | Updated on Jul 22 2026 6:42 PM

YS Jagan Meet With Tobacco Farmers

సాక్షి,తాడేపల్లి: ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్న పొగాకు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. 

ఈ సందర్భంగా పొగాకు రైతులతో నిర్వహించిన సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  పొగాకు రైతులకు అండగా నిలవడం నా బాధ్యత.అందుకే వచ్చే వారం లేదా పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తాను. గత ఏడాది ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను. ఈసారి గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి కష్టాలు తెలుసుకుంటాను.

 

ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తాను. ఈ పర్యటన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే కొద్దిరోజుల వ్యవధిలో కందుకూరులో మరో పర్యటన నిర్వహిస్తాను. పొగాకు రైతుల సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాను. ఏ జిల్లాలో, ఏ పంట రైతులు ఇబ్బందులు పడుతున్నా వైఎస్సార్‌సీపీ వారికి అండగా నిలుస్తుంది.

నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడం సులభం. కానీ నిద్ర నటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని లేపాలంటే మరింత గట్టిగా ఒత్తిడి తీసుకురావాల్సిందే. రైతులకు శాశ్వతంగా మంచి జరగాలంటే ప్రజా ప్రభుత్వం రావాల్సిందే. అయితే అప్పటివరకు రైతుల సమస్యలను వదిలిపెట్టకుండా ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తాం.

పొగాకు వేలం ప్రారంభమై దాదాపు 94 రోజులు గడిచినా పండిన పంటలో కేవలం 16.5 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. రాష్ట్రంలో సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు పండితే ఇప్పటివరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. సాధారణంగా 100 రోజుల్లో పూర్తి కావాల్సిన కొనుగోలు ప్రక్రియలో 94 రోజులు గడిచినా ఐదో వంతు పంట కూడా కొనకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. సెప్టెంబరులో కర్ణాటకలో వేలం ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన పంటను ఎవరు కొంటారనే భయాందోళన రైతుల్లో నెలకొంది.

పొగాకు ధర రూ.200కు తగ్గకూడదని చంద్రబాబు సమీక్షలో చెప్పిన మరుసటి రోజే మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. పొదిలిలో రూ.179, టంగుటూరులో రూ.184, కనిగిరిలో రూ.184, కందుకూరులో రూ.186, జంగారెడ్డిగూడెంలో రూ.170, గోపాలపురంలో రూ.130కు కొనుగోలు చేశారు. చంద్రబాబు హెచ్చరించిన మరుసటి రోజే ధరలు పడిపోవడం వ్యాపారుల సిండికేట్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. ‘ఏదో ఒక ధరకు మా పంట కొనండి ..మమ్మల్ని బతికించండి’ అని రైతులు వేడుకోవాల్సిన దుస్థితికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. కొనుగోళ్లలో నో-బిడ్లు పెట్టడం,పెద్దఎత్తున బేళ్లను తిరస్కరించడం ద్వారా రైతులను మరింత నష్టపరుస్తున్నారు.

Tadepalli: పొగాకు రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి

వ్యాపారుల మధ్య పోటీ పెరిగి రైతులకు మంచి ధర రావాలనే ఉద్దేశంతో టొబాకో బోర్డు ఏర్పాటైంది. కానీ చంద్రబాబు పాలనలో ఆ లక్ష్యమే పూర్తిగా దెబ్బతింది. వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. నిబంధనలు పాటించని కంపెనీలపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఏ కంపెనీ లైసెన్సునూ సస్పెండ్ చేయలేదు. ఒక్క వ్యాపారినీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదు. ఎంత పంట వేయాలో, ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తామో ముందుగా హామీ ఇచ్చిన లైసెన్సు దారులు ఇప్పుడు తమ బాధ్యతను విస్మరిస్తున్నారు. వారు ఇచ్చిన హామీ మేరకు రైతులకు నష్టం రాని ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మార్క్‌ఫెడ్‌ను కొనుగోళ్లలోకి తీసుకొచ్చి ప్రభుత్వం రైతుల తరఫున నిలబడుతోందనే బలమైన సంకేతం ఇవ్వాలి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్క్‌ఫెడ్‌ను పొగాకు వేలం ప్లాట్‌ఫారంపైకి తీసుకొచ్చాం. మార్క్‌ఫెడ్ రంగప్రవేశంతో మార్కెట్లో నిజమైన పోటీ ఏర్పడి వ్యాపారుల సిండికేట్ విచ్ఛిన్నమైంది. ప్రభుత్వం రైతుల తరఫున కొనుగోళ్లకు సిద్ధంగా ఉందనే భయం వ్యాపారుల్లో ఏర్పడటంతో పొగాకు ధరలు పెరిగాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మార్క్‌ఫెడ్‌ను కొనుగోళ్లలోకి రానివ్వకుండా అడ్డుకుంటోంది. దీనివల్ల వ్యాపారుల సిండికేట్‌కు మరింత బలం చేకూరుతోంది.

మా ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు దాదాపు రూ.3,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేశాం. ఐదేళ్లలో పంటల కొనుగోళ్లు, మార్కెట్ జోక్యం కోసం రైతుల తరఫున సుమారు రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి రైతుభరోసా కేంద్రాన్ని వ్యవసాయ ధరల పర్యవేక్షణ కేంద్రంగా మార్చాం. ప్రతి పంటకు కనీస గిట్టుబాటు ధరలను ఆర్బీకేల్లో బోర్డులపై ప్రదర్శించాం. ధరలు కనీస స్థాయి కంటే తగ్గిన వెంటనే ఆర్బీకే వ్యవసాయ సహాయకుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే వ్యవస్థను తీసుకొచ్చాం.

సీఎం యాప్ కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ధరలను నిరంతరం పర్యవేక్షించాం. ప్రతి జిల్లా జాయింట్ కలెక్టర్‌ను మార్క్‌ఫెడ్ జాయింట్ ఎండీగా నియమించి ధరలు పడిన ప్రాంతంలో వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో పోటీ ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయి.

గతంలో ప్రభుత్వం రైతులకు తోడుగా ఉందనే భరోసా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం తమకు అండగా లేదనే భావన రైతుల్లో నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే దళారులు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకునే పరిస్థితికి కారణమైంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు ముఖంలో చిరునవ్వు ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడకపోతే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం’అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement