అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..! | Kolgaon Gram Panchayat in Shrigonda Ahilyanagar passed Historic resolution | Sakshi
Sakshi News home page

అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!

Mar 10 2026 5:03 PM | Updated on Mar 10 2026 6:02 PM

Kolgaon Gram Panchayat in Shrigonda Ahilyanagar passed Historic resolution

మహిళల్ని గౌరవించాలి...అనేది మన భారతీయ సంప్రదాయంలో కీలకమైన విషయం. అయితే గౌరవించడం అలా ఉంచి ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడినా.. ఆ  సమయంలో గొడవతో సంబంధంలేని  మహిళలను అవమానపరిచేలా తిట్లు దుర్భాషలు ఉపయోగించడం మన దగ్గర సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి సమయాల్లో తరచుగా ఎందరో తల్లులు, అక్కలు...బాధితులుగా మారుతున్నారు. మన  రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు సైతం దీనికి అతీతంగా లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో అలాంటి తిట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలోని ఓ మారుమూల గ్రామం తొలి అడుగు వేసింది.

ఒకరి తల్లి లేదా సోదరిని ఉద్దేశించి దుర్భాషలాడే వ్యక్తులను వెనువెంటనే శిక్షించాలని ఒక వినూత్న  తీర్మానాన్ని ఆ గ్రామం ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళా సాధకులను సత్కరించడానికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక  స్వయం సహాయక సంఘ సభ్యురాలు ఈ ఆలోచనను సూచనప్రాయంగా తెలియజేశారు. .అహల్యానగర్‌లోని శ్రీగొండలోని కోల్గావ్‌ గ్రామ పంచాయతీ  దీనిని ఆమోదించింది.

విభిన్న కులాలు  మతాలకు చెందిన సుమారు 9,000 మంది నివాసితులున్న కోల్గావ్‌ గ్రామం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, సీనియర్‌ అంగన్ వాడీ సేవిక (కార్యకర్త) శకుంతల దేశ్‌ముఖ్‌ అధ్యక్షతన ప్రత్యేక మహిళా గ్రామసభను ఏర్పాటు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జగ్‌తాప్‌ అనే మహిళ  లేవనెత్తిన మాటలతో మహిళల్ని అవమానించే అంశం గ్రామ సభలో వివరణాత్మక చర్చకు దారితీసింది. సుదీర్ఘ మధనం తర్వాత, మహిళలను కించపరిచేలా అవమానకరమైన భాషను ఉపయోగించే వారికి జరిమానాగా  రూ. 500  విధించాలని నిర్ణయించారు.  మరోవైపు ఈ నిబంధన దుర్వినియోగాన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 

దుర్భాషలు ఆడినట్టు డిజిటల్‌ ఆధారాలు అందించినప్పుడు మాత్రమే జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ‘అవమానకరంగా మాట్లాడిన వారిని గుర్తించడడంలో  మహిళలు ( అవసరమైతే, వారి పిల్లలు)  ముందుండాలని పంచాయతీ కోరింది, అలా వసూలు చేసిన జరిమానాలను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తామని వీరు చెబుతున్నారు.

‘తల్లి లేదా సోదరిని ప్రస్తావిస్తూ తిట్టడం ద్వారా మహిళల్ని అవమానించడం ఇప్పుడు సర్వ సాధారణమైంది. అమ్మాయిలు కుటుంబ బాధ్యతలను భరించే మహిళలుగా ఎదుగుతారు. అలాంటి దుర్వినియోగాలను సాధారణం గా అంగీకరించే స్థాయికి వారి గుర్తింపులను కించపరచకూడదు’అని జగ్‌తాప్‌ అంటున్నారు. ఇలాంటివే అనూహ్యమైన మరికొన్ని తీర్మానాలతో ఈ పంచాయితీ గత కొంతకాలంగా ఆదర్శవంతంగా నిలుస్తోంది.

గతేడాది తీసుకున్న ఓ నిర్ణయం కూడా అనేకమందిలో ఆలోచన రేకెత్తించేలాంటిదే. దీని ప్రకారం.. గ్రామంలో పిల్లలు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్లో టెలివిజన్‌ లేదా సెల్‌ఫోన్‌ వినియోగించరు. పుస్తకాలు మాత్రమే చేతబట్టుకోవాలి.  ప్రస్తుతం గ్రామంలో  తల్లిదండ్రులు కూడా పాటించే నియమం ఇది. 

గ్రామసభ పరిశుభ్రతకు సంబంధించి మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించింది, నివాసితులు తమ ఇళ్లలో వాణిజ్య సంస్థలలో పరిశుభ్రతను కాపాడుకోవాలని కోరింది. గ్రామ పంచాయతీకి సమర్పించిన ఫోటో/వీడియో ఆధారాల ద్వారా ఎవరైనా దీనిని ఉల్లంఘించినట్లు తేలిదే, వారికి రూ. 100 జరిమానా విధిస్తారు. 

(చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement