IWD ప్రతీ అడుగు కన్నీటి మడుగు | Speical Story on International Womens Day andhrapradesh | Sakshi
Sakshi News home page

International Women's Day ప్రతీ అడుగు కన్నీటి మడుగు

Mar 10 2026 3:12 PM | Updated on Mar 10 2026 3:31 PM

Speical Story on International Womens Day andhrapradesh

ఇంట్లో ఓకే.. బయటే భయం! 

నవ సమాజ నిర్మాణంలో ఆమె పాత్ర కీలకం 

ఇంట్లో స్వేచ్ఛ.. బయట అనుమానపు చూపులే 

సాంకేతిక యుగంలోనూ కొనసాగుతున్న ఆడ మగ వివక్ష 

మహిళా దినోత్సవం రోజు మాత్రమే మర్యాద.. ఆపై షరా మామూలే 

సమాజం, ప్రభుత్వం మహిళలకు రక్షణ కవచంగా నిలబడాలి 

మహిళా, విద్యార్థి సంఘాలు,  సాధారణ మహిళల ఆవేదన

ఇంట్లో ఆడ, మగ తేడా చూపని తల్లిదండ్రులు.. ఉన్నత ఉద్యోగాల్లో కొలువుదీరుతున్న మహిళలు.. మహిళా దినోత్సవం రోజున మహోన్నత సత్కారాలు.. ఇది నాణేనికి ఓ వైపు కాగా.. నాణేనికి ఇంకో వైపు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిన ప్రతిక్షణం.. అడుగడుగునా ఆకతాయిల ఆగడాలు.. కామాంధుల కర్కశత్వం.. మోసం చేయాలనే కేటుగాళ్లు.. రోజుకో లైంగికదాడి.. సమాజంలో తప్పని లైంగిక వేధింపులు.. ఎన్ని కఠిన చట్టాలున్నా.. మహిళ నేటికీ సభ్యసమాజంలో వివక్షకు గురవుతూనే ఉంది.  ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత క్షేమంగా ఇల్లు చేరతామన్న ధీమా లేకపోయింది.

తిరుపతి సిటీ: ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నవసమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. తెల్లవారకముందే దినచర్య మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఇటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే అటు ఉద్యోగాల్లోనూ తమ సత్తా చాటుతూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి తరణంలోనూ సమాజంలో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సమాజం అనుమానపు చూపులతో చంపుతోంది. కొందరి మానవమృగాల నుంచి మహిళాలోకానికి నేటికీ ముప్పుతప్పడం లేదు. ఇంట్లో ఆడ, మగ అనే వివక్ష ప్రస్తుతం చాలా వరకు తగ్గినా, బయట సమాజంలో ఎటువంటి మార్పు కనబడలేదు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున నేటి సమాజంలో  మహిళల రక్షణ, వివక్ష అనే అంశంపై సాక్షి మహిళా సంఘాల నేతలతో, విద్యార్థినులతో మాట్లాడగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.  

ఇంట్లో పరిస్థితి మెరుగుపడినా.. బయటే భయం 
ఆధునిక యుగంలో కుటుంబంలో ఆడ, మగ వివక్షణ చాలా వరకు తగ్గింది. ఇద్దరీ సమానంగా చూడాలనే అవగాహన తల్లిదండ్రులకు కలిగింది. కానీ బయట కాలు పెడితే చాలు మళ్లీ ఇంటికి చేరినంతవరకు క్షణక్షణం భయంగానే బతకాల్సి వస్తోంది. పోలీసులు ఎంత అభయమిస్తున్నా, కఠిన చట్టాలున్నా సమాజంలో పరిస్థితి మారలేదు. మా తల్లిదండ్రులు నేను కళాశాలకు బయలు దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కనీసం ఐదు సార్లు ఫోన్‌ చేసి మాట్లాడుతారు. మహిళలకు బయట రక్షణ ప్రశ్నార్థకంగానే ఉంది. – సరళ, ఎంబీఏ విద్యార్థిని, తిరుపతి  

గౌరవించకపోయినా.. హాని కలిగించకుంటే చాలు  
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా అత్యాచారాలు, మానుభంగాలు, వేధింపులు తగ్గకపోవడం దారుణం. మ రిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మహిళలను గౌరవించకపోయినా పర్వా లేదు. కనీసం వారికి హాని కలిగించకుంటే చాలు. పదేళ్ల చిన్నారులను సైతం బయటకు ఒంటరిగా పంపాలంటే తల్లిదండ్రులకు వణుకుపట్టే పరిస్థితి ఉంది. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన చట్టాలను తీసుకురావాలి.  – పుష్పావతి, ప్రైవేటు కళాశాల ఉపాధ్యాయురాలు, తిరుపతి రూరల్‌

పరిస్థితుల్లో మార్పు రాలేదు 
మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకువస్తున్నాం..అవగాహన కార్యక్రమాలు నిర్వస్తున్నామంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడలేదు. ఇంటి నుంచి కాలు బయటపెడితే  ప్రతి క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఏమిజరుగతుందో తెలియని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. కళాశాలలోనూ, విధులు నిర్వహించే ప్రాంతాలలోనూ వేధింపులకు గురవుతున్న మహిళలు బయటకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. మహిళా దినోత్సవం అంటూ హంగామా చేయడం కాదు..మహిళ రక్షణ కల్పించాలి. – డాక్టర్‌ సాయిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి, తిరుపతి

ఒంటరిగా వెళ్లాలంటే భయం 
పాఠశాలకు, కళాశాలలకు విద్యార్థినులు ఒంటరిగా నేటి వెళ్లలేకపోతున్నారు. తల్లిదండ్రులు వెన్నంటి ఉంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. విద్యాసంస్థల వద్ద, బస్టాండుల వద్ద భద్రత లేదు. ఓ మహిళా ఒంటరిగా నడిచి వెళుతుంటే సమాజం వింతగా అదోలా కన్నెత్తి చూస్తుంది. దారిన వెళ్లే పోకిరీలు అసభ్యమాటలతో వేధింపులకు గురికాక తప్పడం లేదు. తల్లిదండ్రుల అండ లేని విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బయట కాలుపెట్టాలంటే వణికిపోతున్నారు. కుటుంబంలో వివక్షణను తప్పించు కున్నా బయట ప్రపంచం వివక్షతో పాటు వేధింపులకు ఎంతో మంది మహిళలు గురవుతూనే ఉన్నారు. – ఆర్‌ ఆషా, పీడీఎస్‌ఓ,జిల్లా కార్యదర్శి, తిరుపతి 

 (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్‌ గైడ్‌)

ఆ రోజు ఆర్భాటాలు.. తర్వాత షరా మామూలే.. 
ప్రస్తుతం సమాజం ఎలా తయారైందంటే మహిళా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు పెట్టి మహిళలను పొగుడుతూ సన్మానాలు చేయడం..మరుసటి రోజు నుంచి షరా మామూలుగా వివక్ష చూపడం ఇది నేటి సమాజం మహిళలకు ఇచ్చే గౌరవం. కుటుంబంలోని…కుటుంబంలోని మహిళలపై వివక్ష కాస్త తగ్గినప్పటికీ బయట కళాశాలల్లోనూ, బస్టాప్‌ల్లోనూ, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనూ నేటికీ వందకు 80శాతం మంది మహిళలు వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ సంస్కృతిలో మార్పు రావాలంటే కుటుంబంలోని ప్రతి పురుషుడు పర స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి.– పవిత్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షురాలు, తిరుపతి  

వివక్షకు గురవుతున్నారు 
ఉన్నత లక్ష్యంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివిన మహిళలు నేడు వివక్షకు గురవుతుండడం దారుణం. విధులు నిర్వహిస్తున్న ఎంతో మంది ఉద్యోగినులు వివక్షతో పాటు వేధింపులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను యావత్‌ సమాజం గమనిస్తూనే ఉంది. కానీ వాటి అరికట్టేందుకు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా కారి్మకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. – లక్ష్మమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement