సాక్షి, కదిరి: అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవం దగ్గర తొక్కిసలాట జరిగింది. రథం కింద పడి ఐదుగురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించి, చికిత్స అందేలా చేశారు.
మరోవైపు, కదిరిలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. కదిరిలో ఆధిపత్యం కోసం టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ తంటాలు పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు బీజేపీ నేత విష్ణువర్థకు అనుమతి ఇవ్వలేదు.
రథోత్సవరంలో పాల్గొనవద్దని బీజేపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. ఇది ఆధిపత్య పోరుకు దారి తీసింది. గత కొన్నేళ్లుగా లక్ష్మీనరసింహ రథోత్సవంలో భక్తులకు విష్ణువర్థన్ సూచనలు చేస్తూ వస్తున్నారు. దీనికి అడ్డుకట్టవేయాలనే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్.. ఆ ఉత్సవంలో పాల్గొనవద్దని బీజేపీ నేతలకు హుకుం జారీ చేశారు. ఒకవేళ బీజేపీ నేతలు వస్తే దాడులు చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా విష్ణువర్థన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


