భక్తుల చేత వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఉంది. గత 27న అంకురార్పణంతో అత్యంత వైభవంగాప్రారంభమయిన ఖాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు పక్షం రోజుల పాటు సాగుతాయి. భక్తప్రహ్లాద సమేత నారసింహుని దర్శనం ఇక్కడ తప్ప మరెక్కడా ఉండదు.
హిరణ్యకశిపుని శిక్షించేందుకు, అలాగే తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు ‘నర–సింహ’ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో సమీపంలోని కదిరికొండ తంలో సంచరించారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై నుండి నారసింహుని వేడుకున్నారు. దీనికి గుర్తుగా ఆ కొండపై నారసింహుని ఆలయం కూడా ఉంది. అదేకొండపై శ్రీవారి పాద ముద్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ఖాద్రి’ అని పిలిచారు. ‘ఖా’ అంటే విష్ణుపాదమని, ‘అద్రి’ అంటే కొండ అని అర్థం. ఖాద్రి కాస్తా ఇప్పుడు కదిరి అని పిలుస్తున్నారు. కదిరి ప్రాంతంలో ఒకప్పుడు ఖాదిరి వృక్షాలు (చండ్ర వృక్షాలు) ఎక్కువగా ఉండేవి. వీటికింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభువుగా వెలిశాడని, అందుకే ఖాద్రీ నారసింహుడని పిలుస్తున్నారని మరో కథనం.
రంగనాయకుడి స్వప్నం
10వ శతాబ్దంలో అప్పటి పట్నం పాలేగారైన రంగనాయకుడికి చెందిన గోవులు ప్రతిరోజూ ఖాదిరి వృక్షం కింద ఉన్న ఓ పుట్టలో పాలు వదిలేవి. ఆ పాలను నారసింహుడు తాగేవారని, అందువల్లనే రంగనాయకులు ఆర్థికంగా బాగా ఎదిగారని ఒక కథనం. ఓరోజు ఆయనకు శ్రీవారు కలలో కన్పించి తాను స్వయంభువుగా వెలిశానని, పుట్టలో ఉన్న తన విగ్రహాన్ని వెలికితీసి తనకు గుడి కట్టించమని కోరితే ఆలయం నిర్మించినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. నాటి ఆలయం కాలగతిలో అదృశ్యం కావడంతో బుక్కరాయలు, హరిహర రాయలు, తర్వాత శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.
వసంత వల్లభుడని కూడా...
శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భృగుమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిశానని, తన విగ్రహాలను వెలికితీసి పూజాది కార్యక్రమాలు చేయాలని కోరినట్లు ఇంకో కథనం. ఉత్సవ విగ్రహాల వెలికితీత వసంత మాసంలో జరగడంతో స్వామివారిని వసంత వల్లభుడని కూడా పిలుస్తున్నారు. అందుకే కోనేరును భృగుతీర్థమని కూడా పిలుస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలనే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో పక్షం రోజులపాటు ప్రతిరోజూ తిరువీధుల్లో ఊరేగిస్తారు.
దేశంలోనే 3వ అతి పెద్ద బ్రహ్మరథం
స్వామివారి బ్రహ్మ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 130 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మరథం తయారు చేశారు. రథంపై సుమారు 256 శిల్పకళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీశుడి బ్రహ్మరథం.
ఏ రోజు ఏ ఉత్సవం?
గత నెల 27వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం గావించారు. 28న శ్రీవారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ నెల 4వ తేదీన బ్రహ్మ గరుడసేవ, 5న శేషవాహనం, 6న పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, 7న మోహినీ ఉత్సవం, 8న ప్రజాగరుడసేవ, 9వ తేదీన గజవాహనం, 10న బ్రహ్మ రథోత్సవం, 11న అశ్వవాహనం, 12న తీర్థవాది ఉత్సవం చివరగా 13వ తేదీన జరిగే పుష్పయాగోత్సవంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
– చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి
పక్షం రోజుల బ్రహ్మోత్సవాలు
15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరిగేది కదిరిలో మాత్రమే. ఇంకెక్కడా జరగవు. ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం కూడా ఇంకెక్కడా ఉండదు. ప్రతినెలా స్వాతినక్షత్రం రోజు మూల విరాట్కు అభిషేకం చేస్తాం. ఆ సమయంలో స్వామివారికి చెమట పట్టడాన్ని గమనించవచ్చు.
– నరసింహాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు, కదిరి


