మహిళల శబరిమల..! ఆటుకాల్‌ భగవతి | Attukal Bhagavathi Temple: Shuts out men for one day | Sakshi
Sakshi News home page

మహిళల శబరిమల..! ఆటుకాల్‌ భగవతి

Mar 5 2026 2:21 PM | Updated on Mar 5 2026 2:27 PM

Attukal Bhagavathi Temple: Shuts out men for one day

కేరళ పేరు వినగానే మన తెలుగువారికి భక్తితో అయ్యప్పస్వామి గుర్తుకొస్తారు శబరిమల యాత్ర మనకి గొప్ప అనుభూతినిస్తుంది. శబరివాసుడు అయ్యప్పస్వామి దర్శనం ఇంచుమించుగా పురుషులకి మాత్రమే అయితే స్త్రీలకి మాత్రమే ఏటా ఒకసారి పొంగలి సమర్పించే దేవాలయం ఆటుకాల్‌ భగవతి క్షేత్రం. ఈ క్షేత్రం కేరళ రాజధాని తిరువనంతపురం నగరంలో ఉంది. 

ఏటా ఫిబ్రవరి, మార్చినెలలలో ఆటుకాల్‌ భగవతికి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి పొంగలి సమర్పిస్తారు. కేరళ రాష్ట్రం నలుమూలల నుండి అలాగే దేశ విదేశాలలో ఉండే మలయాళీ స్త్రీలు లక్షలలో భగవతికి పొంగాల (పొంగలి) సమర్పించడానికి వస్తారు. ఆరోజు కేరళ రాష్ట్ర రాజధాని స్త్రీలతో నిండిపోతుంది. పొంగాల సమర్పించడానికి పొయ్యి, వంట దినుసులు మాన్తా కోసం వంటచెరకు సిద్ధం చేసుకుంటారు. లక్షలాది మంది స్త్రీలు ఒకచోట చేరి దేవికి ప్రసాదం వండడం గిన్నెస్‌ బుక్‌ రికార్డు. ప్రతి ఏటా ఆ రికార్డు తిరగ రాయడం భగవతి శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో కేవలం స్త్రీలు మాత్రమే పాల్గొనాలి. 

పురుషులకి ప్రాధాన్యత లేదు. స్త్రీలు తమ జీవిత ఐశ్వర్యం కొరకు కుటుంబ అభివృద్ధి కోసం ఆటుకాల్‌ భగవతికి పొంగాల సమర్పించుకుంటారు. పొంగాల స్త్రీలు నగరం వీధులలోను రోడ్డు మీద ఇంటి అరుగు మీదా చేసుకుంటారు. ఇంకా చె΄్పాలంటే... ఇందులో పాల్గొనేవాళ్ళు అందరు భగవతి స్వరూపంగా భావించి ఎంతో భక్తి, గౌరవం చూపుతారు. స్త్రీలు స్నానం చేయడానికి, బట్టలు మార్చడానికి అన్ని సౌకర్యాలు జాతిమతం;పేదా గొప్పా భేదం లేకుండా చూసుకుంటారు. 

ఇన్నిలక్షలమంది స్త్రీలు ఒకచోట చేరినా, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగడం గొప్పవిశేషం. స్త్రీలు కొత్త వస్త్రాలు ధరించి కొత్త మట్టి కుండ, కర్రలు మూడు ఇటుకలు, పాలు, బియ్యం, బెల్లం వంటివి తెచ్చుకుని తాము కూర్చునే చిన్నస్థలాన్ని శుభ్రం చేసుకుంటారు. అంతకుముందు పారిశుధ్య కార్మికులు నగర వీధులు అంతటా శుభ్రం చేస్తారు. ఇక్కడ జరిగే ఒక అద్భుతం ముహూర్త సమయానికి చిరుజల్లులు పడి ఆ ప్రదేశం అంతా పవిత్రంగా మారడం. ఇది ప్రతి యేటా కనిపించే సత్యం. దేవి చైతన్యానికి నిదర్శనం. 

అందరూ ముందుగా ఇటుకలు పేర్చి కొత్త మట్టికుండలో పాలు, బెల్లం, బియ్యం ΄ోసి సిద్ధంగా ఉంచాలి. ఆటుకాల్‌ భగవతి ముందు పూజారి పొయ్యి వెలిగించి పొంగాల వండటం ప్రారంభిస్తారు. ఆ పొయ్యి నుండి దీపాన్ని వెలిగించి పూజారులు నాలుగువైపులా తిరుగుతూ తీర్థంతో సంప్రోక్షణ చేస్తారు. 

స్త్రీలు తాము సిద్ధం చేసిన పొయ్యిలో తాము తెచ్చిన దీపంతోనే అగ్ని వెలిగిస్తారు. స్త్రీలు, వారి వెంట వచ్చిన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవతిని ప్రార్థిస్తారు. భగవతికి సమర్పించిన పొంగాల ఎంతగా పొంగి పొయ్యిలోకి పొర్లుతుందో అంతగా తమ జీవితాలలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.

ప్రతి సంవత్సరం మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హైదరాబాద్‌ నగరాల నుంచి రైలు తిరువనంతపురం నగరానికి వెళ్తోంది. ఇంకా కేరళలోని ఎర్నాకులం తిరువనంతపురం చేరడానికి విమాన మార్గం ఉంది.
(ఈ యేడు ఫిబ్రవరి 23న మొదలైన ఆటుకాల్‌ పొంగాల్‌ ఉత్సవాలు మార్చి 4 వరకు జరిగాయి).
– ఇ.ఎస్‌. మాధవన్, విశాఖపట్నం 

(చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement