న్యూయార్క్: హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో ముడి చమురు మాత్రమే కాకుండా ఇతర వస్తూత్పత్తుల సరఫరా సైతం స్తంభించిపోయింది. సముద్రమార్గంలో నౌకలతోపాటు గగనతలంలో కార్గో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఇతర వస్తువుల సరఫరా గొలుసులు తెగిపోయి పలు దేశాల్లో ఆయా వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది.
భారత్లో తయారైన ఫార్మాసూటికల్స్, ఆసియా దేశాల్లో తయారైన సెమీకండక్టర్లు, బ్యాటరీలు, పశ్చిమాసియా దేశాల్లో తయారైన రసాయనాల వంటి చమురు ఉత్పత్తులు హర్మూజ్ జలసంధి గుండానే ఇతర దేశాలకు సరఫరా చేయాల్సి ఉంది. జలసంధి గుండా వెళ్లే నౌకలను తగలబెడతామని ఇరాన్ అల్టిమేటమ్ జారీచేయడంతో సరకు రవాణా గొలుసు తెగినట్లయింది. హార్మూజ్ దాకా రాలేక 3,200 నౌకలు పర్షియన్ గల్ఫ్లోనే ఆగిపోయాయి. యూఏఈ, ఒమన్ వద్ద మ రో 500 నౌకలు వేచిచూస్తున్నాయి. ఇంకొన్ని సుదీర్ఘ మార్గమైన ఆఫ్రికా దక్షిణ కొన గుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి.
‘ఆఫ్రికా చుట్టూ తిరిగిరావడం వల్ల ప్రయాణ ఖర్చులు ఎక్కువై చివరకు ఆయా దేశాల్లో సరకుల ధరలు ప్రియమవుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో అదే జలసంధి గుండా నౌకలు వెళ్లాలంటే.. యుద్ధానికి తెరతీసిన అమెరికానే స్వయంగా తన యుద్ధ విమానాలను రక్షణగా పంపించి జాగ్రత్తగా నౌకలను ఆవలి వైపునకు దాటించాలి’ అని సియాకస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్యాట్రిక్ పెన్ఫీల్డ్ విశ్లేషించారు. ‘మొత్తం ప్రపంచ వాయుమార్గ రవాణాలో పశ్చిమాసియాలో రవాణా కేవలం ఒక శాతమే ఉంటుంది. కానీ విలువ పరంగా చూస్తే యావత్ ప్రపంచ వాణిజ్యంలో 35 శాతం ఉంటుంది. ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల రవాణా ఎక్కువ’ అని ఆయన అన్నారు.


