ఇరాన్‌పై ట్రంప్‌ ప్లానేంటి.. ఇరాక్‌ పరిస్థితి వస్తుందా? | Khamenei death Have USA Achieved their goals Or Iran unbreakable | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై ట్రంప్‌ ప్లానేంటి.. ఇరాక్‌ పరిస్థితి వస్తుందా?

Mar 2 2026 1:25 PM | Updated on Mar 2 2026 1:29 PM

Khamenei death Have USA Achieved their goals Or Iran unbreakable

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని టార్గెట్‌ చేసి అమెరికా, ఇజ్రాయెల్‌.. అగ్రనేతను మట్టుబెట్టాయి. ప్రత్యర్థి దాడిలో ఖమేనీ అత్యంత సులువుగా హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతాయా?. ఇజ్రాయెల్‌, అమెరికా లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి ఇరాన్‌ ప్రాక్సీ గ్రూపుల సంగతేంటి?. ఖమేనీ మృతిపై పగ తీర్చుకునేందుకు ఇరాన్‌ ఎలాంటి ప్లాన్‌ చేస్తోంది. భవిష్యత్‌లో అమెరికా ఎదుర్కొవాల్సిన పరిస్థితులేంటి?. 2003 నాటి ఇరాక్‌ యుద్దం ఏం చెబుతోంది? అని సంగతులు తెలియాల్సిందే..  

సుప్రీం లీడర్‌ ఖమేనీ దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్‌ను శాసించిన అగ్రనాయకుడు. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(86) మరణించడంతో, ఆయన వారసుడిగా.. ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ (మత పెద్దల మండలి) అయతుల్లా అలీ ఖమేనీని ఎంపిక చేసింది. తదుపరి 30 ఏళ్లలో ఖమేనీ పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పోలీసులు, మీడియా, మతపరమైన ఉన్నత వర్గాలతో సహా, తనకు విధేయులైన వారి నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలలో తన పట్ల భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఖమేనీ వ్యక్తిత్వ ఆరాధనను ప్రోత్సహించారు. రాజకీయ అణచివేత, ప్రత్యర్థుల అక్రమ అరెస్టులూ జరిగాయి. ఆయన చాలా అరుదుగా విదేశాలకు వెళ్లేవారు. ఖమేనీ తన భార్య, ఆరుగురు పిల్లలు, మనవరాళ్లు, మనవళ్లతో కలిసి సెంట్రల్ టెహ్రాన్‌లోని ఒక నివాస సముదాయంలో చాలా నిరాడంబరంగా జీవించేవారని రిపోర్టులున్నాయి.

1999లో విద్యార్థుల నిరసనలు ఆయన అధికారానికి ముప్పుగా మారినప్పటికీ, వాటిని అణచివేయగలిగారు. ఒక దశాబ్దం తర్వాత, అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కొందరు తిరుగుబాటు చేయడంతో, వారిపై పెప్పర్ స్ప్రే వాడటం, కొట్టడం, కాల్పులు జరపడం వంటివి జరిగాయి. 2019లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిరసనలు మిన్నంటినప్పుడు, చట్టవిరుద్ధమైన ప్రదర్శనలను అడ్డుకోవడానికి ఖమేనీ రోజులు తరబడి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. మహిళా విద్యపై గత పాలకులు విధించిన అడ్డంకులను ఖమేనీ తొలగించారు. కానీ, ఆయనకు లింగ సమానత్వంపై ఏమాత్రం నమ్మకం లేదు. హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మహిళలను అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఏకాంత కారాగారంలో ఉంచారు. వారికి మద్దతు ఇచ్చిన వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఒక మానవ హక్కుల న్యాయవాదికి 38 ఏళ్ల జైలు శిక్ష, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు.

అమెరికాతో వివాదాలు
అమెరికాపై సెప్టెంబర్ 11 (2001) దాడుల తర్వాత, అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాన్‌ను విమర్శించారు. ఖమేనీ వాషింగ్టన్‌తో అటు రాజీ పడకుండా, ఇటు నేరుగా యుద్ధానికి దిగకుండా చాలా జాగ్రత్తగా విదేశీ విధానం అమలుచేశారు. అమెరికాతో అత్యంత ఘర్షణ వాతావరణం నెలకొన్న అంశం అణ్వాయుధాలు. ఇరవై ఏళ్ల కిందట ఖమేనీ.. అణ్వాయుధాలు ఇస్లాంకు వ్యతిరేకమని ప్రకటిస్తూ, వాటి అభివృద్ధిని నిషేధిస్తూ ఒక ‘ఫత్వా’ జారీ చేశారు. కానీ, ఆయన పాలనలో ఇరాన్ రహస్యంగా అణు ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలు బలంగా నమ్మాయి.

2018లో ట్రంప్ అణు ఒప్పందం నుంచి వైదొలిగి, ఇరాన్‌ను కొత్త ఒప్పందానికి తీసుకువచ్చేందుకు ఆంక్షలు విధించారు. రెండు సంవత్సరాల తర్వాత, సుప్రీం లీడర్‌కు అత్యంత సన్నిహితుడైన టాప్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసీం సులేమానీని ఇరాక్‌లో హతమార్చాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, రష్యా, చైనాలతో మరింత సన్నిహితంగా మెలిగారు. అలాగే, జూన్ 2025లో ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి నిల్వలు, అగ్రశ్రేణి సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినప్పుడు, ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ నగరాలపైకి క్షిపణుల వర్షం కురిపించింది.

ఈ యుద్ధంలో అమెరికా కూడా చేరి, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై దాడులు చేసినప్పుడు, ఖమేనీ లొంగిపోబోనని శపథం చేశారు. అనంతరం, ఇరాన్ తన అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందానికి అంగీకరించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు. కానీ, ఖమేనీ యురేనియం శుద్ధిని ఆపడానికి నిరాకరించారు. దీంతో, ట్రంప్ ఆ ప్రాంతంలో అమెరికా సైనిక బలాన్ని పెంచాలని ఆదేశించారు. అనంతం, దాడుల్లో ఖమేనీ సహా కీలక నేతలు మృతి చెందారు.

ట్రంప్‌ ప్లానేంటి? 
ఆత్మరక్షణ కోసమే ఇరాన్‌పై దాడులు చేస్తున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి. అయితే ఇరాన్ మిలిటరీ బలాన్ని యూఎస్, ఇజ్రాయెల్‌తో పోలిస్తే అది పోటీనే కాదు. అలాంటప్పుడు ఇది ఆత్మరక్షణ ఎలా అవుతుందనేది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇరాన్ మొత్తం ప్రపంచానికే ముప్పు అని తన వీడియో సందేశంలో ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు ఖమేనీ మృతితో ట్రంప్‌ ఏం చేస్తారు. అక్కడి కొత్త ప్రభుత్వం దిశగా ప్లాన్‌ చేస్తారా? కొత్త నాయకుడిని ఏర్పాటు చేస్తారా?. అయితే, ఇరాన్‌లో నాయకత్వ మార్పు అకస్మాత్తుగా జరిగే అవకాశం లేదు. ఇరాన్‌ వ్యవస్థ కూలిపోవడం కష్టమే. మతపెద్దలు, IRGC (Islamic Revolutionary Guard Corps) ముందుగానే contingency plans సిద్ధం చేసుకోవడం వల్ల, నాయకత్వం మారినా వ్యవస్థ కొనసాగుతుంది. ఇరాన్‌ వ్యవస్థ వ్యక్తి ఆధారంగా కాకుండా, సంస్థాగతంగా నిర్మించబడింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. 

ఇరాన్‌ ఏం చేయనుంది?.
ఖమేనీ మృతి పట్ల ఇరాన్‌ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌, అరబ్‌ దేశాలను టార్గెట్‌ చేసింది. అమెరికాను సైతం హెచ్చరించింది. ప్రతి దాడులు చేస్తామని.. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చింది. అందులో భాగంగానే ఇరాన్‌.. ఇప్పటికే సౌదీ అరేబియా, దుబాయ్‌, ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌ దేశాలపై దాడులు చేస్తోంది. ఇరాన్‌తోడు తాజాగా హెచ్‌బొల్లా దళాలు కూడా రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నాయి. దీంతో​, ఇరాన్‌కు మద్దతు పెరిగి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది.

ఇరాన్‌ ప్రాక్సీ నెట్‌వర్క్‌లు
ఇరాక్‌లోని మిలీషాలు, యెమెన్‌లోని హౌతీలు వంటి గ్రూపులు బలహీనపడినప్పటికీ ఇంకా చురుకుగా ఉన్నాయి. వీటి ప్రధాన పాత్ర.. అమెరికా బేస్‌లు, ఇజ్రాయెల్‌ లక్ష్యాలు, గల్ఫ్‌ ప్రాంతంలో అస్థిరత సృష్టించడం. హౌతీలు గతంలో కూడా రెడ్ సీ షిప్పింగ్ మార్గాలను దాడి చేశారు, ఇది ప్రపంచ వాణిజ్యానికి పెద్ద సవాలుగా మారింది. మరోసారి ఇలాంటి దాడులు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లనుంది.

2003 ఇరాక్‌ యుద్ధం (Operation Iraqi Freedom)
2003 మార్చి 20న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నేతృత్వంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, పోలాండ్ వంటి దేశాలు ఇరాక్‌పై దాడి చేశాయి. ఇరాక్‌ వద్ద Weapons of Mass Destruction (WMDs) ఉన్నాయని, అలాగే అల్-ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తోంది అనే ఆరోపణలతో దాడులు చేశాయి. కేవలం మూడు వారాల్లోనే అమెరికా నేతృత్వంలోని బలగాలు బగ్దాద్‌లోకి ప్రవేశించి, సద్దాం హుస్సేన్‌ 30 ఏళ్ల పాలనను ముగించాయి. ఏప్రిల్ 2003లో బగ్దాద్‌లోని సద్దాం విగ్రహాన్ని కూల్చడం యుద్ధానికి ప్రతీకగా నిలిచింది. దీంతో, సద్దాం హుస్సేన్‌ పాలన ముగిసింది. యుద్ధం తర్వాత ఇరాక్‌లో సెక్టారియన్ హింస, ఉగ్రవాదం, ISIS ఉద్భవం వంటి సమస్యలు పెరిగాయి. 2003–2011 మధ్య US బలగాలు ఇరాక్‌లో ఉండి, చివరికి వెనక్కి వెళ్లాయి. అయితే, ఇలాంటి పరిస్థితులు ఇరాన్‌లో ఉండకపోవచ్చు.

ఇరాక్‌ vs ఇరాన్‌ పోలిక
ఇరాక్‌ (2003): వ్యక్తి ఆధారిత పాలన (సద్దాం హుస్సేన్‌). నాయకుడిని తొలగించగానే వ్యవస్థ కూలిపోయింది.
ఇరాన్‌ (ప్రస్తుత వ్యవస్థ): వ్యక్తి ఆధారంగా కాకుండా, మతపెద్దల సంస్థాగత వ్యవస్థ. ఒక నాయకుడు లేకపోయినా, Assembly of Experts, Guardian Council, IRGC వంటి సంస్థలు పాలన కొనసాగిస్తాయి. అందువల్ల, ఇరాన్‌ను ఇరాక్‌లా త్వరగా కూల్చడం కష్టమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement