గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండు లక్షల మంది వలస
మూసివేసిన విమానాశ్రయాలు
ఆందోళన చెందుతున్న వలస కార్మిక కుటుంబాలు
జగిత్యాలక్రైం: గల్ఫ్ దేశాలైన ఖతర్, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబిలోని అమెరికా సైనిక స్థావరా లే టార్గెట్గా ఇరాన్ శనివారం మిసైల్ రాకెట్లతో మెరుపుదాడులు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఉమ్మడి కరీంనగర్ నుంచి వలసవెళ్లిన సుమారు రెండులక్షల మంది భయం గుప్పిట్లో వణుకుతున్నారు. అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమై కార్మి కులను క్యాంప్ కార్యాలయాలకు తరలించాయి. ఖతర్లో 15 నిమిషాలకోసారి బాంబుల వర్షం కురుస్తున్నట్లు అక్కడి నుంచి కార్మికులు చెబుతున్నారు. బహ్రెయిన్లోనూ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి దాడులు జరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలను అప్రమత్తం చేసి పనులు నిలిపివేసి కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దుబాయ్లోని మరీన వద్ద మిసైల్ దా డిని అక్కడి ప్రభుత్వం అడ్డుకుని గాలిలోనే పేల్చేసింది. పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసవెళ్లిన వారి ఇక్కడి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దాడుల నేపథ్యంలో ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
విమానాశ్రయాల మూసివేత
ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్దేశాలు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచే విమానాశ్రయాలు మూసివేశాయి. ఖతర్, బహ్రెయిన్లోని ప్రధాన ఎయిర్పోర్టులను మూసివేయడంతోపాటు, విమాన రాకపోకలను రద్దు చేశారు.
మెరుపుదాడులు చేస్తున్నారు
దోహఖతర్లో వైమానిక స్థా వరాలను టార్గెట్గా చేసుకు ని ఇరాన్ శనివారం మధ్యాహ్నం నుంచి మెరుపుదాడులు చేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం అప్రమత్తమై కార్మికులందరినీ పనులు రద్దు చేసి క్యాంప్లకు తరలించింది. మెరుపుదాడులతో తెలంగాణ కార్మికులంతా భయంభయంగా గడుపుతున్నాం.
– జీవన్రెడ్డి, దోహఖతర్
విమానాశ్రయాలు మూసివేశారు
దుబాయ్లో ఇరాన్ దాడులు చేస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం కొన్ని క్షిపణిలను గాలిలోనే పేల్చివేసింది. మరికొన్ని క్షిపణిలు పేలడంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. దుబాయ్లోని ప్రధాన విమానాశ్రయాలను ప్రభుత్వం ముందస్తుగా మూసివేసింది.
– ముకేశ్, దుబాయ్
కార్మికుల్లో ఆందోళన
దాడులు జరుగుతుండడంతో తెలంగాణ కార్మికులమంతా ఆందోళన చెందుతున్నాం. ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం ధీటుగా క్షిపణులను గాలిలో పేల్చేస్తూ ప్రమాదం జరగకుండా చర్యలు చేపడుతోంది.
– గంగాధర్, దుబాయ్


