బంగారం.. దొంగల విహారం
జిల్లాలో బంగారం చోరీ కేసులు
కరీంనగర్క్రైం: బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. ఇదే సమయంలో సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తోంది. బంగారం విలువ పెరిగిన కొద్దీ దొంగతనాలు పెరుగుతున్నాయి. నగరం, గ్రామం అనే తేడా లేకుండా చోరీలు జరుగుతున్నాయి. తా ళం వేసి ఉన్న నివాసాలు, ఆలయాలు, మహిళలు, వృద్ధులే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. పొ ద్దంతా పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ మాయ మాటలు చెప్పి నిలువునా దోచేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా బంగారంతో ఉడాయిస్తున్నారు. మరికొందరు పొద్దంతా రెక్కీ చేస్తూ.. తాళం వేసిఉన్న నివాసాల్లో రాత్రిళ్లు చోరీకి పాల్పడుతున్నారు.
నిఘా పెరగడంతో రూటుమార్చి
బంగారం చోరీలపై పోలీసులు నిఘా పెంచుతుండగా దొంగలు రూటు మార్చుతున్నారు. టెక్నాలజీ, మానవ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని చోరీలకు దిగుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి మహిళల మెడలోంచి బంగారు గొలుసులను క్షణాల్లో తెంపుకుని మాయమవుతున్నారు. పాలిష్ పేరుతో నగలు శుభ్రపరుస్తామని మహిళలను నమ్మించి చోరీలకు దిగుతున్నారు. నగరంలోని కట్టరాంపూర్, తిమ్మాపూర్, రామడుగు, మానకొండూర్, గన్నేరువరం, జమ్మికుంటతో పాటు వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పగటిపూట రెక్కి చేసి, రాత్రి దొంగతనాలు చేసిన ఘటనలపై కేసులు నమోదు అయ్యాయి.
ఫిబ్రవరి 24న కరీంనగర్ పరిధిలోని రేకుర్తిలో ఒంటరిగా ఉన్న ఓ మహిళ వద్దకు ఇద్దరు మహిళలు వెళ్లారు. తాము అమ్మవారి భక్తులమని, విజయవాడ కనకదుర్గమ్మకు ఆభరణాలు చేయిస్తామని, తమవంతు సాయం చేయాలని కోరారు. ఇంట్లోకి వెళ్లిన సదరు మహిళ కొంత నగదు తెచ్చి ఇచ్చింది. ‘నీకు నరదిష్టి ఉంది’ అని ఆమెను మాటల్లోకి దింపి మత్తు కలిపిన బొట్టు పెట్టారు. స్పృహ కోల్పోగానే ఇంట్లోకి వెళ్లి ఐదు తులాల బంగారం, రూ.30వేలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. తేరుకున్న సదరు మహిళ లబోదిబోమంటూ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సంవత్సరం కేసులు
2024 158
2025 184
నగర పరిధిలోని శివనగర్లో ఉన్న విజేత మనోహర హెవెన్స్ అపార్ట్మెంట్లోని రెండు ఫ్లాట్లలో సుమారు రూ.35 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బోయవాడలో బంగారు నగలకు పాలిష్ వేస్తామంటూ ఓ మహిళను మాటల్లో పెట్టి, ఇంట్లోకి వెళ్లి నగలు పట్టుకొని పరారవగా వన్టౌన్లో కేసు నమోదైంది.


