వాష్టింగన్: అమెరికా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనలో ఇరాన్ హస్తం ఉందేమోనని ఎఫ్బీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశాయి.
ఆస్టిన్ నగరానికి చెందిన బార్ బయట అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేవలం 59సెకన్లలో నిందితుణ్ని హతమార్చారు. అయితే, ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధం ఉందా అనే దానిపై ఫెడరల్ దర్యాప్తు ప్రారంభమైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడి అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో, ఈ కాల్పులు ప్రతీకార దాడిగా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్బీఐ ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా పరిగణించి, దాడి చేసిన వ్యక్తి నేపథ్యం, అతని సంబంధాలు, అంతర్జాతీయ లింకులు అన్నింటినీ పరిశీలిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.


