వాషింగ్టన్: మిడిల్ ఈస్ట్లో యుద్ధ జ్వాలలు మిన్నంటుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా చేపట్టిన మెరుపు దాడుల్లో ఇరాన్కు చెందిన 48 మంది అగ్రశ్రేణి నేతలు ఒకేసారి హతమయ్యారని ట్రంప్ పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్.. ఈ ఆపరేషన్ ఊహించిన దానికంటే వేగంగా, అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ దాడులు ఆ దేశ నాయకత్వాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయయన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నూతన నాయకత్వం తమతో చర్చలకు సిద్ధమనే సంకేతాలు పంపిందని ట్రంప్ పేర్కొన్నారు.
గతంలోనే చర్చలకు రావాల్సింది పోయి మొండిగా వ్యవహరించిన ఇరాన్.. ఇప్పుడు దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని అమెరికా బలగాలు నామరూపాల్లేకుండా చేశాయని అన్నారు. ఇరాన్కు చెందిన తొమ్మిది భారీ యుద్ధనౌకలను సముద్రంలో ముంచివేశామని, ఆ దేశ నావికాదళ ప్రధాన కార్యాలయాన్ని కూడా దాదాపుగా ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన నౌకలను కూడా త్వరలోనే నామరూపాలు లేకండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు.. ఇరాన్ గుండెకాయ లాంటి టెహ్రాన్ నగరంపై తమ దాడులు కొనసాగుతాయని, రానున్న రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, మొసాద్ అధిపతితో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ ఉగ్రవాద పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు పునరుద్ఘాటించారు. తమ పోరాటానికి అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ అందిస్తున్న సహకారానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా భారీగా పెరుగుతోంది. ఇరాన్ జరిపిన ఎదురు దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా, టెల్ అవీవ్, బీట్ షెమెష్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పౌరులు కూడా మరణించారు. కాగా ప్రాంతీయ దౌత్యవేత్తలు శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి యుద్ధ విరమణను గట్టిగా కోరుతున్నారు. ఇరాన్ కూడా ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆయన సంకేతాలిచ్చారు.
ఇది కూడా చదవండి: వైమానిక దాడి.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు నెజాద్ మృతి


