తొలి మహిళా తవిల్‌ కళాకారిణి..! ఏ ఆర్‌ రెహమాన్‌ సైతం.. | Meet Thavil Artiste, 18-Year-Old Amrutha Varshini Becomes India’s First Female Thavil Virtuoso, Know About Her In Telugu | Sakshi
Sakshi News home page

తొలి మహిళా తవిల్‌ కళాకారిణి..! ఏ ఆర్‌ రెహమాన్‌ సైతం..

Mar 5 2026 12:54 PM | Updated on Mar 5 2026 1:13 PM

Meet thavil artiste Amirthavarshini Manishankar

సంగీతంలో పెర్కషన్‌ వాయిద్యాలు వాయించడం అంత సులభం కాదు. చాలామటుకు వాటిని మగవాళ్లే వాయిస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే పెర్కషన్‌ కళాకారులుగా మగవాళ్లే ఉంటారు ఎందుకంటే వాటిలో కొన్ని వాయిద్యాలు అత్యంత బరువుతో ఉంటాయి. పైగా వాయించాలంటే అపారమైన ఓపిక, శారీరక నొప్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాటిలో అత్యంత కష్టతరమైన వాయిద్యం తవిల్‌..అలాంటి వాయిద్యాన్ని అద్భుతంగా ఆలపిస్తూ..గుర్తింపు తెచ్చుకుంటోంది ఓ మహిళా కళాకారిణి. అంతేగాదు ఈ తవిల్‌ వాయిద్యాన్ని ఆలపిస్తున్న తొలి మహిళా కళాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. ఎవరామె అంటే..

ఆ అమ్మాయే ఆరు తరాల సంగీతకారుల కుటుంబం నుంచి వచ్చిన అమృతవర్షిణి మణిశంకర్‌. తమిళనాడులోని తిరువూరు, మన్నార్‌గుడికి చెందిన ఆమె, తండ్రి నాగస్వరం కళాకారుడు ఎపి మణిశంకర్‌ కాగా, తల్లి జయంతి శంకర్ వయోలిన్‌ విద్వాంసురాలు. ఎనిమిదేళ్ల వయసు నుంచే తవిల్‌ నేర్చుకుంటూ తరతరాల నాటి సంప్రదాయాన్ని ధిక్కరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మహిళలు అరుదుగా అభ్యసించే వాయిద్యాన్ని ఆమె అలవోకగా వాయిస్తుంది. 

ఇంతవరకు మహిళా తవిల్‌ కళాకారులు ఎవ్వరూ లేరని చెప్పిన తల్లిదండ్రుల మాటలు ఆమెలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని పెంచాయట. ఆ నేపథ్యంలోనే ఈ వాయిద్యాన్ని వాయించడం పట్టుదలతో నేర్చుకుంది అమృతవర్షిణి. ఆమె కోవిలూర్ కె.జి. కళ్యాణ సుందరం ఆధ్వర్యంలో ఈ వాయిద్యాన్ని వాయించడంలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఆధునాతన శిక్షణను తీసుకుంటోంది. 

ఇందులో మరింత రాణించేలా తవిల్ కళాకారుడు తంజావూరు టి.ఆర్. గోవిందరాజన్ వద్ద సలహాలు సూచనలు తీసుకుంటూ తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటోంది. ఇక అమృత వర్షిణి గురువు సలహాల మేరకు ఈ వాయిద్యాన్ని నేలపై ఉంచడానికి బదులు తన ఒడిలో ఉంచి వాయించడం ప్రారంభించింది. దాదాపు 60 కిలోలు బరవు ఉండే వాయిద్యం ఎక్కువసేపు వాయించడానికి అపారమైన ఓర్పు అవసరం. 

ఎందుకంటే భుజం, కాళ్లలో నొప్పి అధికమవుతుంది. పైగా వేళ్లు రక్తస్రావం అవుతాయి కూడా. అవన్నీ నయం అవడానికే సుమారు పది రోజులు పడుతుంది. కచేరికి ముందు నా వేళ్ల చుట్టూ టేప్‌ చుట్టి..ధ్వనిని ఉత్పత్తి చేసే క్యాప్‌లను తొడిగేందుకు జిగురు రాసుకోవాల్సి ఉంటుందట. అయితే ఇప్పుడు ఆధునిక ఆడియో వ్యవస్థల కారణంగా కాస్త ప్రదర్శన సులభతరం అయ్యిందని, శారీరక ఒత్తిడి కూడా తగ్గిందని అంటోంది.

బహిరంగ ప్రదర్శనలివ్వడం అప్పటి నుంచే..
పదకొడేళ్ల ప్రాయం నుంచి అమృతవర్షిణి బహిరంగ ప్రదర్శనలివ్వడం ప్రారంభించింది. తొలి ప్రదర్శన హరిధ్వర్మంగళంలోని అరుల్మిగు ముత్తుమైరామ్మన్ ఆలయంలో జరిగింది. 2020లో తమిళనాడు విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీ (వాయిద్య విభాగం)లో మూడవ స్థానం దక్కించుకుంది. 2022లో మళ్ళీ పాల్గొన్నప్పుడు బ్యానర్‌పై తన చిత్రాన్ని చూసుకుని మురిసిపోయానంటోంది. 

 

ప్రస్తుతం ఆమె సంగీత కచేరీల నిమిత్తమే టూర్‌లకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఈ వారాంతంలో బెంగళూరులో జరిగే మహీంద్రా పెర్కషన్ ఫెస్టివల్‌లో ప్రదర్శించే ‘ఉమెన్ హూ డ్రమ్’ అనే పూర్తి మహిళల పెర్కషన్ బృందంలో భాగం కానుంది. ఇది పూర్తిగా మహిళా సంగీత కళాకారులతో కూడిన బృందం. 

ప్రముఖ సంగీత విద్యాంసుడి నుంచి పిలుపు..
అన్నింటికంటే అత్యంత విశేషమైనది “రెహమాన్ సర్ 'వండర్మెంట్ టూర్' కచేరీలో అమృతవర్షిణిని వాయించమని కోరడం. అదే తనకు తొలిసారి అని ప్రేక్షకుల ముందు సోలోగా ప్రదర్శన ఇవ్వడం అంటూ తనకు ఆ అవకాశం ఎలా వచ్చిందో గుర్తుచేసుకుంది  18 ఏళ్ల అమృతవర్షిణి. గత అక్టోబర్‌లో రెహమాన్ సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో అవ్వడం ప్రారంభించినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించిందట. 

కొంతకాలం తర్వాత, ఆయన మేనేజర్ ఫోన్ చేసి ఫిబ్రవరిలో రెండు రోజులు చెన్నైలో ఉండి కచేరీలో పాల్గొనాలని చెప్పడం ఎప్పటికీ మర్చిపోను అని భావోద్వేగం చెప్పుకొచ్చింది. మహిళలు వాయించలేని సంగీత పరికరాన్ని వాయించడం సాధన చేయడమే గాక..అందులో రాణిస్తూ..ఏకంగా ప్రముఖ సంగీత విద్వాంసుల నుంచి పిలుపు అందుకోవడం మాములు విషయం కాదు కదా..!. ఇది నిజంగా మహిళా సాధికారతకు, ఆమె అజేయమైన శక్తికి నిర్వచనం కూడా. 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement