ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశీయ గ్యాస్ సిలిండర్ల బుకింగ్కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఒక సిలిండర్ డెలివరీ తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడానికి 15 రోజుల గడువు ఉండేది. ఇకపై ఈ వ్యవధిని 21 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మరో సిలిండర్ డెలివరీకి కనీసం 21 రోజుల విరామం ఉండాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధన అమలుకు గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్వేర్ను వెంటనే అప్డేట్ చేశారు. అయితే బుకింగ్ విధానం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా భవిష్యత్తులోనూ 21 రోజుల గడువు పూర్తైన తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునే విధానాన్ని అమలు చేయాలనే విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.
ఏడాదికి 15 సిలిండర్ల కొనుగోలుకు అనుమతి
దేశీయ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై చమురు సంస్థలు ఇప్పటికే కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి. వాటి ప్రకారం ప్రతి వినియోగదారు సంవత్సరానికి గరిష్టంగా 12 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే పొందగలరు. అదనంగా మూడు సబ్సిడీ రహిత సిలిండర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఏడాదిలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక్క గ్యాస్ కనెక్షన్పై మొత్తం 15 సిలిండర్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది.
24 గంటల్లో సిలిండర్ డెలివరీ
వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుకింగ్ చేసిన తర్వాత 24 గంటలలోపు సిలిండర్ డెలివరీ చేయాలని చమురు కంపెనీలు ఏజెన్సీలకు సూచించాయి. ఈ నిబంధన వల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలగనుంది.
21 రోజుల తర్వాతే రెండో సిలిండర్ డెలివరీ
కొత్త నిబంధన ప్రకారం మొదటి సిలిండర్ అందుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే రెండో సిలిండర్ డెలివరీ ఇవ్వబడుతుంది. దీనిని ఏజెన్సీల సాఫ్ట్వేర్లో లాక్ చేశారు. అయితే సిలిండర్ల కొరత ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లిపారు. ఇక సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ వారం బాట్లింగ్ ప్లాంట్లు ఆదివారాల్లో కూడా పనిచేయనున్నట్లు సమాచారం.
గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో భారతదేశంలో డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీలు) సిలిండర్ ధరలు మార్చి 7 నుంచి రూ.60 పెరిగాయి. ఈ పెంపు ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తించదు. వారికి రూ.300 సబ్సిడీ కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో రూ.913, ముంబైలో రూ.912.50, కోల్కతాలో రూ.939, చెన్నైలొ రూ.928.50, బెంగళూరులో రూ.915.50, హైదరాబాద్లో రూ.965లుగా ఉన్నాయి.


