న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 31 మధ్య ముగిసిపోయే ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ (ఈవో) వ్యవధిని ఆటోమేటిక్గా ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఇందుకోసం కాంపోజిషన్ ఫీజు ఉండదని పేర్కొంది.
సాధారణంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) స్కీము కింద దేశీ సంస్థలు సుంకాల రహితంగా మెషిన్లను దిగుమతి చేసుకోవచ్చు. అయితే, దానికి ప్రతిగా నిర్దిష్ట వ్యవధిలో ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. అమెరికా టారిఫ్లతో సతమతమవుతుండగా ఇటు పశ్చిమాసియాలో సంక్షోభం కూడా తోడు కావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎగుమతిదారులు ఈ విషయంలో వెసులుబాటునివ్వాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.
పోర్టుల్లో వెసులుబాటు..
ఎగుమతి సంస్థలకు మద్దతుగా నిల్చేలా కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, జలమార్గాల శాఖ నిర్ణయాలు తీసుకుంది. స్టోరేజి అద్దెలు, నౌకలను మార్చుకోవడానికి సంబంధించిన చార్జీలు మొదలైన వాటిని తగ్గించాలని లేదా మినహాయింపునివ్వాలని యూజర్ల నుంచి వచ్చే అభ్యర్ధనలను పరిస్థితిని బట్టి పరిగణనలోకి తీసుకోవాలని పోర్టులకు సూచించింది. పశ్చిమాసియా నుంచి వచ్చే పెరిషబుల్ కార్గో (ఎక్కువ కాలం నిల్వ ఉండని ఉత్పత్తుల)కి ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది.
అలాగే పోర్టుల్లో సమస్యలేవైనా తలెత్తితే సంప్రదించేందుకు నిర్దిష్టంగా నోడల్ ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం సూచించింది. ఆ అధికారి సదరు సమస్యలను ఆయా విభాగాల దృష్టికి తీసుకెళ్లి 24–72 గంటల్లోగా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) ప్రకారం పోర్ట్ చైర్పర్సన్లు తరచుగా షిప్పింగ్ లైన్స్, ఎగుమతిదారులు, కస్టమ్స్, టర్మినల్ ఆపరేటర్లు మొదలైన వర్గాలతో సమావేశమై, పరిస్థితులను సమీక్షిస్తూ ఉండాలని తెలిపింది.


