ఇండియాలోని ఇజ్రాయెల్‌లో నిశ్శబ్దం | Story On Silence in Kasol Afte West Asia War | Sakshi
Sakshi News home page

ఇండియాలోని ఇజ్రాయెల్‌లో నిశ్శబ్దం

Mar 7 2026 6:46 PM | Updated on Mar 7 2026 7:04 PM

Story On Silence in Kasol Afte West Asia War

హిబ్రూ–ప్రభావిత కేఫ్‌ సంస్కృతి సహా పలు ఇతర లక్షణాల కారణంగా మన దేశంలోని హిమాలయ ప్రాంత గ్రామమైన కసోల్‌ ను  ‘మినీ ఇజ్రాయెల్‌‘ గా పేర్కొంటారు.  ఈ ప్రాంతం తొలిసారి ఈ పర్యాటక సీజలో అసాధారణ నిశ్శబ్ద వాతావరణాన్ని చవిచూస్తోంది. చాలా కాలంగా ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే సందర్శకులపై  ఆధారపడిన స్థానిక వ్యాపారాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.

సుందరమైన పార్వతి లోయలో  ఉన్న కసోల్,  కల్గా , పుల్గా వంటి సమీప గ్రామాలు సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ బ్యాక్‌ప్యాకర్లకు ఇష్టమైన స్టాప్‌లుగా నిలుస్తూన్నాయి.  చెక్క ఇళ్ళు, ఆపిల్‌ తోటలు, ప్రశాంతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామాలు ఇజ్రాయెల్‌ ప్రయాణికులకు ఉపకరించే
ప్రత్యేక పర్యాటక సంస్కృతికి నిలయాలుగా మారాయి.

ఇక్కడి చాలా కేఫ్‌లు ఇజ్రాయెల్‌ శైలిలో రూపొందిన వంటకాలను అందిస్తాయి  అతిథులకు ఇంట్లో ఉన్నట్లు అనిపించేలా హోమ్‌స్టేలు తరచుగా తమ మెనూలను హిబ్రూలో ముద్రిస్తాయి. అయితే, ఈ సంవత్సరం, సందర్శకుల రాక కనిపించక సందడి తగ్గిపోయింది. ‘‘అంతర్జాతీయ బ్యాక్‌ప్యాకర్లకు బాగా ప్రసిద్ధి చెందిన జిప్సీ హౌస్‌ కేఫ్‌ – హోమ్‌స్టే దగ్గర ఆ తేడా కనిపిస్తోందని సిబ్బంది అంటున్నారు. ‘సీజన్‌ ఇప్పుడే ప్రారంభమైంది కానీ డిమాండ్‌ లో తరుగుదల స్పష్టంగా ఉంది‘ అని ఒక ఉద్యోగి అన్నారు. ‘సాధారణంగా ప్రతి సీజన్ లో మాకు 50 నుంచి 100 మంది ఇజ్రాయెల్‌ పర్యాటకులు వస్తారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు  ఒక్కరు కూడా రాలేదు అని చెప్పారు.

ఈ పరిస్థితికి కారణం ప్రస్తుతం ఇజ్రాయెల్‌ – ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే అని  వీరు అంటున్నారు, యుద్ధం  ప్రయాణ సౌకర్యాలకు అంతరాయం కలిగించింది. అదే ధరమ్‌కోట్‌  కసోల్‌ వంటి బ్యాక్‌ ప్యాకింగ్‌ కేంద్రాలను ప్రభావితం చేసిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఇక్కడితో ఆగకపోవచ్చునని విదేశీ పర్యాటకులకు కీలక ప్రవేశద్వారాలుగా ఉంటున్న మనాలి, సిమ్లా వంటి టాప్‌ హిల్‌ స్టేషన్స్ ను కూడా ప్రభావితం చేయవచ్చునని అంచాన వేస్తున్నారు. స్థానిక ఆపరేటర్ల ప్రకారం, సాధారణంగా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు  పార్వతి లోయలో ఇజ్రాయెల్‌ ప్రయాణికులకు ఫుల్‌ సీజన్‌. ‘ప్రతి సంవత్సరం 10,000 కంటే ఎక్కువ మంది ఇజ్రాయెల్‌ బ్యాక్‌ప్యాకర్లు కసోల్‌ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు  అని ఓ ట్రావెల్‌ సంస్థ ప్రతినిధి అన్నారు. ‘ఈసారి, ఈ సంఖ్యలు వందల్లోనే ఉండవచ్చు’’ అన్నారాయన. ఈ మార్పు బుకింగ్‌ విధానాలలో కూడా కనిపిస్తుందని ట్రావెల్‌ ఏజెంట్లు అంటున్నారు.

‘ఇజ్రాయెల్‌ పర్యాటకులు సాధారణంగా తమ బసలను 20–30 రోజుల ముందుగానే బుక్‌ చేసుకుని మార్చి నాటికి రావడం ప్రారంభిస్తారు‘ అని విదేశీ సందర్శకులతో పనిచేసే ట్రావెల్‌ ఏజెంట్‌ రంజిత్‌ రాణా అంటున్నారు.  ‘‘ఈ సంవత్సరం దాదాపుగా ఏ మాత్రం బుకింగ్‌లు లేవు. ఫిబ్రవరిలో వచ్చిన వారు కూడా ముందుగానే వెనుదిరిగారు.’’ అని చెప్పారాయన.

హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన పర్యాటక డేటా ప్రకారం, కాంగ్రా జిల్లా  సిమ్లా జిల్లా తర్వాత పార్వతి లోయను కలిగి ఉన్న కులు జిల్లా  విదేశీ పర్యాటకుల రాకపోకలలో రాష్ట్రంలోని మొదటి మూడు జిల్లాల్లో ఒకటి.  అందువల్ల అంతర్జాతీయ పర్యాటకుల రాకలో తేడా వస్తే అది స్థానిక జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎయిర్‌ కనెక్టివిటీ కూడా ఈ పరిస్థితిలో కీలక పాత్ర పోషించింది. టెల్‌ అవీవ్, న్యూఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమానాలను నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా, కానీ ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ మార్గం తాత్కాలికంగా మూతబడింది. 

అలాగే  చాలా కాలంగా భారతదేశానికి వెళ్లే ఇజ్రాయెల్‌ ప్రయాణికులకు దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. టెల్‌ అవీవ్‌ నుంచి దుబాయ్‌కు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి...తో  చాలా మంది పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement