ఖాట్మండు : హిమాలయ దేశం నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని శాసిస్తున్న హేమాహేమీలను కాదని, ప్రజలు నవతరం వైపు మొగ్గు చూపుతున్నారు. 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాజీ మేయర్, మాజీ రాపర్ బాలేంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. తాజా ఫలితాల సరళిని చూస్తే బాలెన్ షా నేపాల్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
గత ఏడాది సెప్టెంబరులో ‘జెన్-జీ’ (Gen Z) యువత చేపట్టిన భారీ ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా, పార్లమెంటు రద్దయిన విషయం తెలిసిందే. ఆ అల్లకల్లోలం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్, మావోయిస్టు సెంటర్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆర్ఎస్పీకి వరంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖాట్మండులో ఆర్ఎస్పీ మద్దతుదారులు ‘గంట (పార్టీ గుర్తు) మోగిస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.
మొత్తం 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాల్లో ఆర్ఎస్పీ ఇప్పటికే 20 స్థానాలను కైవసం చేసుకోగా, మరో 98 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. స్వయంగా బాలేంద్ర షా తన ప్రత్యర్థి, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై ఆయన సొంత గడ్డ అయిన ఝాపా-5 నియోజకవర్గంలో 15 వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఉండటం విశేషం. మరోవైపు, ఆర్ఎస్పీ అధ్యక్షుడు రబీ లామిచానే చిత్వాన్-2 స్థానం నుంచి 54,402 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు.
నేపాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. సరిహద్దు దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని భారత్ ఆకాంక్షిస్తోంది. న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. నేపాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.
నేపాల్ ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 9వ తేదీ నాటికి ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాలతో పాటు, మిగిలిన 110 స్థానాలను దామాషా పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అవినీతి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్లో బాలెన్ షా రాకతో ఒక కొత్త శకం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన పాటలతో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన బాలెన్, ఇప్పుడు దేశ గమనాన్ని ఎలా మారుస్తారనేది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: యువకుని హత్యతో రణరంగం.. వాహనాల దహనం, రాస్తారోకో


