అనంతపురం: కష్టపడి చదివి అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందారు. అంతకుమించి శ్రమించి విజయవంతంగా కోర్సు పూర్తి చేసి తల్లిదండ్రుల సమక్షంలో పట్టా, మెడల్స్ అందుకుని మురిసిపోయారు.
ప్రభుత్వ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో శుక్రవారం 2020 బ్యాచ్ వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం ‘ఉత్సర్గ–26’ పేరిట అట్టహాసంగా నిర్వహించారు.
వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు పట్టాలు, బంగారు పతకాలు అందుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తమ పిల్లలు డాక్టర్లుగా కొత్త జీవితంలోకి అడుగిడుతున్న వేళ తల్లిదండ్రులు వారిని చూసి మురిసిపోయారు.
కళాశాలను విడిచి వెళ్తున్న వేళ విద్యార్థులంతా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో తల్లిదండ్రులు, బంధువులతో ఫొటోలు,సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు.


