అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలపై ట్రంప్ స్పందించారు. మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ ఇక బెదిరించలేదన్న ట్రంప్.. తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇరాన్ తన పట్టు కోల్పోయిందని.. పొరుగు దేశాలకు లొంగిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులతోనే ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు. ఇకపై పొరుగు దేశాలను ఆ దేశం బెదిరింపులకు దిగదంటూ చురకలు అంటించారు.
ఇరాన్.. ఓడిపోయింది. పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. ఇరాన్ ఇక మధ్యప్రాచ్య రౌడీ కాదు. ఇరాన్ నలిగిపోతోంది. పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయబోమని మాట ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్లు జరిపిన నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైంది’’ అంటూ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు. వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ తన పొరుగు దేశాల ముందు ఓడిపోవడం ఇదే మొదటిసారి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో అందరినీ భయపెట్టిన ఇరాన్.. ఇప్పుడు మధ్యప్రాచ్య పరాజితగా మారిందని ట్రంప్ ఎద్దేవా చేశారు.
కాగా, ఉద్రిక్తతలను తగ్గించేలా.. పొరుగు దేశాలను తమ సోదరులుగా అభివర్ణించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. దాడులు చేసినందుకు క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే. తమపై దాడులు జరిగితే తప్ప, పొరుగు దేశాలపై క్షిపణులు ప్రయోగించవద్దని తమ సాయుధ దళాలకు ఆదేశాలిచ్చామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాన్పై ఇవాళ మరింత తీవ్రమైన దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలను కూడా ఈసారి ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పినప్పటికీ, గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దుబాయ్, అబుదాబిలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తాత్కాలికంగా సేవలను నిలిపివేసింది.


