భారత్‌కు ఇంధన సవాలు | Arvind Panagariya Warns West Asia Conflicts Threaten India Energy Security | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఇంధన సవాలు

Mar 7 2026 11:47 AM | Updated on Mar 7 2026 12:17 PM

Arvind Panagariya Warns West Asia Conflicts Threaten India Energy Security

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం భారతదేశ ఇంధన భద్రతకు పెను సవాలుగా మారాయని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్న ఆయన భారత ఆర్థిక గమనం, రాష్ట్రాల పురోగతిపై తన విశ్లేషణను పంచుకున్నారు.

అంచనాలను మించి ఆర్థిక వృద్ధి

ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని పనగారియా స్పష్టం చేశారు. ‘2025-26తో ముగిసిన మూడేళ్ల కాలంలో భారత వాస్తవ జీడీపీ సగటున 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పాదక రంగం ఏకంగా 11.2 శాతం సగటు వృద్ధితో దూసుకుపోతోంది. ఇది పారిశ్రామికాభివృద్ధిలో ఒక సానుకూల సంకేతం’ అని ఆయన విశ్లేషించారు.

అమెరికా వాణిజ్య విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లను భారత్ చాకచక్యంగా అవకాశాలుగా మలుచుకుందని ప్రశంసించారు. ఇటీవల కొన్ని దేశాలతో భారత్‌ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ వాణిజ్య పరిధి పెరుగుతుందన్నారు.

తక్షణమే దృష్టి సారించాల్సిన అంశాలు

దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన ప్రధానాంశాలను పనగారియా సూచించారు.

  • దిగుమతి సుంకాలు, నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను హేతుబద్ధీకరించడం.

  • 1956 నాటి యూజీసీ చట్టం స్థానంలో పార్లమెంటు పరిశీలనలో ఉన్న కొత్త చట్టాన్ని తీసుకురావడం.

  • 2013 నాటి ఎల్ఏఆర్ఆర్ చట్టాన్ని సవరించి భూసేకరణ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడం.

రాష్ట్రాలకు సూచనలు

‘విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌) నష్టాల వల్ల రాష్ట్రల ఖజానా ఖాళీ అవుతోంది. రాబోయే 5-7 ఏళ్లలో వీటిని క్రమ పద్ధతిలో ప్రైవేటీకరించాలి. కార్మిక సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత వంటి అంశాల్లో సరళీకృత విధానాలను అవలంబించాలి. పట్టణ భూ విపణిని వ్యాపార అనుకూలంగా మార్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారికి అనువైన వాతావరణం కల్పించాలి. భారతదేశం తన యువ శక్తిని, విస్తారమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారుతుంది’ అని అరవింద్ పనగారియా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అమెరికాలో పెరిగిన నిరుద్యోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement