ఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ టార్గెట్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పొరుగు అరబ్ దేశాలకు ఎటువంటి నష్టం కలగలేదన్నారు.
ఇరాన్ చేపట్టిన సైనిక దాడులు చాలా జాగ్రత్తగా.. కేవలం అమెరికా లక్ష్యాలను మాత్రమే గురిచూసి చేసినవని ఆయన తెలిపారు. ఈ దాడుల వల్ల పొరుగున ఉన్న ఏ ఒక్క అరబ్ దేశానికి కూడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలగలేదని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్లో ప్రసంగిస్తూ.. ఇరాన్ చర్యలను సమర్థించుకున్నారు.
అలాగే, ఏఎన్ఐతో మాట్లాడుతూ.. చివరి బుల్లెట్ వరకు ప్రతిఘటించడం తప్ప.. మరో మార్గం లేదన్నారు. ఇరాన్ ప్రస్తుతం పూర్తి యుద్ధ స్థితిని ఎదుర్కొంటోందని ఖతీబ్జాదే నొక్కి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడికి, దురాక్రమణకు మేము గురవుతున్నాము. వారు ఇరాన్కు భారీ నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. నా తోటి పౌరులు అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న కార్పెట్ బాంబింగ్లతో నిరంతరం దాడులకు గురవుతున్నారు. టెహ్రాన్ నిరంతర దాడుల నీడలో ఉంది.
ఇది ఇరాన్ పౌరుల వీరోచిత యుద్ధం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. అలాగే, ఒక దేశాధినేతను అమెరికా హత్య చేసిందని ఆరోపిస్తూ, ఇది ప్రపంచ దౌత్య సంబంధాలకు ముప్పు అంటూ ఆయన హెచ్చరించారు.


