ఇరాన్ టార్గెట్గా ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. యూఎస్ డ్రోన్లు, క్షిపణులు.. ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు, దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై మెరుపు దాడులు చేస్తోంది. పరస్పర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతి చెందగా.. భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడులతో కొన్ని గల్ఫ్ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్పై కొన్ని గల్ఫ్ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించిన తర్వాత.. ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సహా ఐదు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి డ్రోన్లు, క్షిపణి దాడులు జరిపింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్, అబుదాబి), అలాగే సౌదీ అరేబియా లక్ష్యంగా మారాయి. ఈ దాడులు అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులకు ప్రతీకారంగా జరిగాయి. గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్.. కనీసం 380 క్షిపణులు, 1,480 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. ఆ దేశాలలో కనీసం 13 మంది మరణించారని అధికారిక ప్రకటనల ప్రకారం తెలిసింది. ఆదివారం కువైట్లో ఇరాన్ డ్రోన్ దాడి ప్రధాన ఆర్మీ స్థావరం నుండి 10 మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఒక పౌర ఓడరేవులోని ఆపరేషన్ సెంటర్ను తాకింది. ఈ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు.
మరోవైపు.. ఇరాన్ దాడులు గల్ప్ ప్రాంతాన్ని అస్థిరం చేస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలు నేరుగా లక్ష్యంగా మారాయి. ఇది చమురు సరఫరా, అంతర్జాతీయ భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికాపై గల్ఫ్ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్పై దాడులకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నాయి. దాడులపై తమకు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ సన్నద్ధతకు తమకు తగినంత సమయం అమెరికా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం, దాడుల విషయంలో ఇజ్రాయెల్ ప్లాన్ ప్రకారం ఎంతో భద్రతతో ఉందని ఆరోపిస్తున్నాయి. అమెరికా సైన్యం కూడా తమకు రక్షణ ఇవ్వలేదని చెబుతున్నాయి.
కాగా, గల్ఫ్ దేశాల అసహనంపై తాజాగా వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందించారు. ఈ సందర్బంగా కెల్లీ..‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఆయుధాలను ప్రయోగించే లేదా ఉత్పత్తి దేశాలను అణచివేస్తుంది. ఈ కార్యక్రమం వల్లే ఇరాన్ ప్రతీకార బాలిస్టిక్ క్షిపణి దాడులు 90 శాతం తగ్గాయి. అధ్యక్షుడు ట్రంప్ మా ప్రాంతీయ భాగస్వాములందరితో సన్నిహిత సంబంధంలో ఉన్నారు. ఉగ్రవాద ఇరాన్ పాలన, పొరుగు దేశాలపై చేసిన దాడులను అధ్యక్షుడు ట్రంప్ పర్యవేక్షిస్తున్నారు. మా మిత్రదేశాలకు ఈ ముప్పును తొలగించడం ఎంత అవసరమో అని చర్యలు తీసుకుంటున్నారు’ అని క్లారిటీ ఇచ్చారు.


