జెరూసలేం: జనాలను, జలవనరులను నాశనంచేసే యుద్ధం కారణంగా దేశాల ఖజానాలు వేగంగా ఖాళీ అవుతుంటాయి. ఇప్పుడు ఇరాన్పై బాంబులేస్తూ యుద్ధంలో మునిగిపోయిన ఇజ్రాయెల్ ఆర్థిక కోణంలో వారానికి దాదాపు రూ.27 వేల కోట్లు నష్టపోతోందని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనావేసింది. ఇకనైనా ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని లేదంటే ఆర్థికఊబిలో కూరుకుపోతామని ఆర్థికశాఖ హెచ్చరించింది.
ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షెయీ క్లాపర్కు ఆర్థికశాఖ డైరెక్టర్ జనరల్ ఇలాన్ రోమ్ ఒక లేఖ రాశారు. భద్రతకోణంలో రక్షణాత్మక చర్యలు అవసరమేగానీ ఆర్థిక స్వావలంభన పైనా దృష్టిసారించాలని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యాసంస్థలు, వ్యాపారసముదాయాలు, పని ప్రదేశాలను మూసేయడంతో వ్యాపారం తగ్గిపోయి ఆర్థికవ్యవస్థ దెబ్బతింటోంది. ఇకనైనా కఠిన ఆంక్షలను పాక్షికంగా సడలించాలి. రెడ్ లెవల్ అలర్ట్ను ఆరెంజ్ స్థాయికి తగ్గించాలి’’ అని ఆయన లేఖలో సూచించారు
కాగా, ఇరాన్పై దాడి కోసం అమెరికా అక్షరాల 779 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.6,900 కోట్లు) ఖర్చు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ట్రంప్ ప్రకటించినట్లుగా ఇరాన్పై దాడులు నాలుగు లేదా ఐదు వారాలు అంతకంటే ఎక్కువ సమయం పడితే లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం..క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు (ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటివి) పనిచేయడానికి రోజుకు దాదాపు 6.5 మిలియన్లు (రూ.58 కోట్లు) ఖర్చయ్యాయి. అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ అమెరికా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా రెండు యుద్ధ విమానాలను మొహరించింది.
దీంతో పాటు విమానాలను తిరిగి తెచ్చుకోవడం, నేవి నౌకలను మోహరించడం, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు సైనికుల నిత్యవసరాలు, యుద్ధసామాగ్రి, యుద్ధంలో వినియోగించేందుకు ట్యాంకర్లు ఇతర వాహనాలకోసం వినియోగించే ఇంధనంతో పాటు వ్యవహారాల కోసం దాదాపు 630 మిలియన్ డాలర్లు (రూ.5,556 కోట్లు) ఖర్చైంది.


