డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో శరవేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఖాతాదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. అనధికార లావాదేవీల వల్ల నష్టపోయే వినియోగదారులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా కస్టమర్ బాధ్యత (కస్టమర్ లయబిలిటీ) ఫ్రేమ్వర్క్లో సవరణలను ప్రతిపాదిస్తూ ఆర్బీఐ ముసాయిదా జారీ చేసింది.
ముసాయిదాలోని ప్రధానాంశాలు
మోసపూరిత లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకులు స్పందించే సమయాన్ని భారీగా తగ్గించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న జాప్యాన్ని తగ్గించి నిర్ణీత కాలవ్యవధిలోగా సమస్యను పరిష్కరించేలా నిబంధనలను కఠినతరం చేశారు.
2017లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నిబంధనలు అప్పటి డిజిటల్ వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మారిన టెక్నాలజీ నేపథ్యంలో కొత్త తరహా మోసాలను కూడా ఈ పరిధిలోకి చేర్చారు.
తక్కువ విలువ గల మోసపూరిత లావాదేవీల విషయంలో వినియోగదారులకు వేగంగా నగదు వాపసు అందేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రతిపాదించారు.
భవిష్యత్తులో మోసాలకు సంబంధించి బ్యాంకులు భరించే పరిహారం వాటాను పెంచే దిశగా ఆర్బీఐ యోచిస్తోంది.
ఎందుకు ఈ మార్పు?
గత ఎనిమిదేళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు సైతం సరికొత్త పద్ధతుల్లో ఖాతాదారులను మోసం చేస్తున్నారు. ఫిబ్రవరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రకటించిన విధంగానే ఆర్బీఐ ఈ సమీక్షా ప్రక్రియను చేపట్టింది. ‘2017 నుంచి డిజిటల్ బ్యాంకింగ్ ఎకోసిస్టమ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత సవరణలు వినియోగదారుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పారదర్శకంగా మారుస్తాయి’ అని ఆర్బీఐ ప్రతినిధి తెలిపారు.
ఈ కొత్త మార్గదర్శకాలపై వాటాదారులు, ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను ఏప్రిల్ 6, 2026 లోపు సమర్పించాలని ఆర్బీఐ కోరింది. కొత్త ఆదేశాలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ పరిహార ఏర్పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా నిబంధనలను మరింత సమీక్షించనున్నారు.
ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష


