చమురు సలసల..  మార్కెట్‌ విలవిల! | Sensex and Nifty as West Asia crisis escalates, crude prices surge | Sakshi
Sakshi News home page

చమురు సలసల..  మార్కెట్‌ విలవిల!

Mar 7 2026 4:30 AM | Updated on Mar 7 2026 7:06 AM

Sensex and Nifty as West Asia crisis escalates, crude prices surge

సెన్సెక్స్‌ 1,097 పాయింట్లు పతనం 

నిఫ్టీ 315 పాయింట్లు డౌన్‌ 

ప్రైవేట్‌ బ్యాంకులు రివర్స్‌.. డిఫెన్స్‌ అప్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ భయాలు, ముడిచమురు ధరల సెగ కలగలసి మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లను పడగొట్టాయి. దీంతో సెన్సెక్స్‌ 79,000 పాయింట్ల స్థాయిని కోల్పోగా.. నిఫ్టీ 24,500 పాయింట్ల దిగువన స్థిరపడింది.  

ముంబై: ముడిచమురు ధరలు మండుతుండటంతో దిగుమతుల బిల్లు పెరగడంతోపాటు.. రూపాయి బలహీనపడనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. ఫలితంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆపై యూరోపియన్‌ మార్కెట్ల క్షీణతతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. 

వెరసి సెన్సెక్స్‌ 1,097 పాయింట్లు పతనమై 78,919 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 315 పాయింట్లు కోల్పోయి 24,450 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్ల (ఫ్యూచర్స్‌) నష్టాలు, క్రూడ్‌ భగభగలు సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో మిడ్‌సెషన్‌ నుంచీ మార్కెట్లు మరింత నీరసించాయి. చివరి సెషన్‌లో సెన్సెక్స్‌ 78,812 వద్ద, నిఫ్టీ 24,416 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.

బ్యాంకులు బోర్లా: ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులుసహా రియల్టీ ఇండెక్స్‌ 2 శాతం క్షీణించింది. ఆటో 1 శాతం నీరసించగా.. కెమికల్స్, ఐటీ నామమాత్రంగా బలపడ్డాయి. ప్రయివేట్‌ బ్యాంకులలో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఆర్‌బీఎల్, ఇండస్‌ఇండ్, కొటక్‌ 3–1.5 శాతం మధ్య నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకులలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, బీవోబీ, కెనరా, మహారాష్ట్ర, ఐవోబీ 3–1.5 శాతం మధ్య డీలాపడ్డాయి.   అయితే బీఈఎల్, ఆర్‌ఐఎల్, ఓఎన్‌జీసీ 2.5–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి.  

షేర్లపై చమురు ఎఫెక్ట్‌: చమురు సెగ ప్రభావంతో ఇంధన మార్కెటింగ్‌ దిగ్గజాలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ 3–1.7% మధ్య నీరసించాయి. 
→ పెయింట్ల విభాగంలో ఇండిగో, కన్సాయ్‌ నెరోలాక్, అక్సో నోబెల్‌ 3.4–2.5 శాతం మధ్య పతనమయ్యాయి.  
→ ఏటీఎఫ్‌ భయాలతో విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ 2.4 శాతం నష్టపోయింది. 
→ ముడిసరుకుల ధరల ఆందోళనతో టైర్ల కంపెనీలలో టీవీఎస్‌ శ్రీచక్ర, అపోలో, ఎంఆర్‌ఎఫ్‌ 3–1 శాతం మధ్య క్షీణించాయి.

డిఫెన్స్‌ సేఫ్‌..: యుద్ధ భయాల నేపథ్యంలో రక్షణ రంగ షేర్లు.. భారత్‌ డైనమిక్స్‌(బీడీఎల్‌), గార్డెన్‌ రీచ్, మజ్గావ్‌ డాక్, పారస్‌ డిఫెన్స్, స్పేస్‌ టెక్నాలజీస్, ఎంటార్‌ టెక్, హెచ్‌ఏఎల్, డేటా ప్యాటర్న్స్, కొచిన్‌ షిప్, మిధానీ 6–3.3% మధ్య జంప్‌చేసింది. వెరసి ఎన్‌ఎస్‌ఈ డిఫెన్స్‌ ఇండెక్స్‌ 2.8% ఎగసింది. 

కారణాలివీ...: పశ్చిమాసియాలో దాడులతో చమురు, గ్యాస్‌ సరఫరాలకు విఘాతం కలగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతోంది. క్రూడ్‌  మంటతో వాణిజ్య లోటు పెరగడంతోపాటు, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయనున్నట్లు నిపుణులు తెలిపారు. దేశీ కరెన్సీ మరింత బలహీనపడనున్నట్లు పేర్కొన్నారు. ఇది ఆర్‌బీఐ పరపతి విధానాలను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నట్లు వివరించారు. చమురు ధరలు పలు రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలున్నట్లు  పేర్కొన్నారు.

12 శాతం జంప్‌ చేసిన క్రూడ్‌
రాత్రి 11.30 సమయంలో  న్యూయార్క్‌లో నైమెక్స్‌ చమురు 14% జంప్‌చేసి 92.5 డాలర్లకు చేరింది. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 11 శాతం ఎగసి 94.5 డాలర్లను దాటింది. ఇవి మరింత బలపడితే ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై సోమవారం(9న) కనిపించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క యూఎస్‌ ఇండెక్సులు సైతం 1 శాతం పైగా క్షీణించి ట్రేడవుతున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement