50 యుద్ధ విమానాలతో దాడి చేశామన్న ఇజ్రాయెల్
అది సైనిక మిలిటరీ కమాండ్ సెంటరని వెల్లడి
పశి్చమాసియాలో ఏడో రోజూ నిప్పుల వాన
భారీగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు
తీవ్రస్థాయిలో ఇరాన్ ప్రతి దాడులు
తీవ్రత మరింత పెంచుతాం: ట్రంప్
ఇరాన్తో ఎలాంటి ఒప్పందాలూ ఉండవ్
బేషరతుగా లొంగిపోవాల్సిందేనన్న అధ్యక్షుడు
తగ్గేదే లేదు.. భూతల దాడులకూ సిద్ధం: ఇరాన్
దుబాయ్/బీరూట్: పశ్చిమాసియాలో కల్లోల తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఏడో రోజైన శుక్రవారం కూడా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భారీ స్థాయిలో దాడులు కొనసాగించాయి. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను ప్రధానంగా లక్ష్యం చేసుకున్నాయి. ఇరాన్వ్యాప్తంగా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. దాడుల తీవ్రతను ఇకపై మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఘాటు హెచ్చరికలు చేశారు.
ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలూ, చర్చలూ ఉండబోవని స్పష్టం చేశారు. ‘‘బేషరతుగా లొంగిపోవాలి. వారి ముందున్న మార్గం అదొక్కటే’’అంటూ కుండబద్దలు కొట్టారు. ఇరాన్ మాత్రం ఏ మాత్రమూ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పేర్కొంది. భూతల దాడులకు కూడా తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు.
రాజధాని టెహ్రాన్ నడి»ొడ్డున దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీకి చెందిన రహస్య భూగర్భ బంకర్ను బాంబు దాడులతో తుత్తునియలు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ‘‘రహస్య భేటీలతో పాటు యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయం, పర్యవేక్షణ తదితరాల కోసం ఖమేనీ ఈ బంకర్ను ఏర్పాటు చేసుకున్నారు. 50 యుద్ధ విమానాలతో దానిపై విరుచుకుపడ్డాం. నామరూపాల్లేకుండా ధ్వంసం చేసేశాం’’అని ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ పేర్కొంది.
ఖమేనీ హత్యానంతరం ఆ బంకర్ సీనియర్ కమాండర్లకు బేస్గా ఉపయోగపడుతున్నట్టు సమాచారం. గురువారం రాత్రంతా గుక్కతిప్పుకోకుండా జరిగిన దాడులతో టెహ్రాన్ అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా భారీగా దుమ్ము, పొగ ఆకాశాన్నంటుతూ కని్పస్తున్నాయి. కీలకమైన క్షిపణి నిల్వ కేంద్రాలున్న కెర్మెన్షాపైనా తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున అమెరికా బీ–2 స్టెల్త్ బాంబర్ విమానాలు ఒక్కోటీ 2,000 పౌండ్ల బరువుండే పెనెట్రేటర్ బాంబులను డజన్ల కొద్దీ జారవిడిచాయి! అనంతరం ఉదయం వేళ టెహ్రాన్లో పలుచోట్ల భారీ పేలుళ్లు వణికించాయి. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,300 దాటినట్టు ప్రభుత్వం పేర్కొంది.
జీసీసీ భవనంపై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైనా దాడులను ఇరాన్ ముమ్మరంగా కొనసాగించింది. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో ప్రజలు భారీ సంఖ్యలో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఖతర్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, అజర్బైజాన్ తదితర దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో పశి్చమాసియా దేశాల నుంచి ఇప్పటిదాకా 20 వేల మంది అమెరికన్లు స్వదేశానికి చేరుకున్నారు.
యూఏఈలోని అల్ దాఫ్రా, కువైట్లోని అల్ సలేం వైమానిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దోహాలోని గల్ఫ్ సహకార సమాఖ్య (జీసీసీ) తాలూకు యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ భవనంపైనా దాడికి దిగింది! ఇరాన్ ప్రయోగించిన 9 బాలిస్టిక్ క్షిపణులతో పాటు 109 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాక్లోని కుర్దిస్తాన్లో అమెరికాకు చెందిన ఒక చమురు క్షేత్రంపైనా ఇరాన్ దాడి చేసింది. దాంతో అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. కుర్దు తెగ ఇజ్రాయెల్, అమెరికాలకు దన్నుగా యుద్ధానికి దిగితే ఇరాక్లోని కుర్దిస్తాన్పై భారీ స్థాయిలో విరుచుకుపడతానని ఇరాన్ హెచ్చరించింది.
లెబనాన్పై తీవ్ర దాడులు
లెబనాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం దాడుల తీవ్రతను బాగా పెంచింది. దేశంలో ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 123కు చేరినట్టు సమాచారం. రాజధాని బీరూట్, శివారు ప్రాంతాలను గాజా తరహాలో నేలమట్టం చేసేస్తామని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ హెచ్చరించారు. దాంతో ఆ ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా 83 వేల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే సరిహద్దులు దాటి లెబనాన్లోకి చొచ్చుకెళ్లింది. అంతర్జాతీయ సమాజం తమను ఆదుకోవాలని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం విజ్ఞప్తి చేశారు. ఖతర్, దోహ తదితర గల్ఫ్ దేశాలు కూడా తమపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి.
ఇరాన్కు కావాల్సింది... ఓ మంచి నాయకుడు: ట్రంప్
ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ఒక మంచి నాయకుడు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్టు చెప్పారు. ‘‘ఇరాన్కు మంచి భవిష్యత్తుంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేస్తాం. ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తాం’’అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’తరహాలో ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం! మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెర దించేందుకు పలు దేశాలు ప్రయతి్నస్తున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.
వైట్హౌస్ నుంచి... హాలీవుడ్ తరహా ట్రైలర్!
ఇరాన్ ఆయుధాగారం ఖాళీ అయిందని వెల్లడి
ఇరాన్ ఆయుధ నిల్వలు దాదాపుగా నిండుకుంటున్నాయని అమెరికా అభిప్రాయపడింది. అందుకే రెండు రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు బాగా తగ్గుముఖం పట్టినట్టు చెప్పుకొచి్చంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గాయని వైట్హౌస్ పేర్కొంది. ఇందుకు సంబంధించి అసాధారణ రీతిలో హాలీవుడ్ తరహా ట్రైలర్ను విడుదల చేయడం విశేషం! యుద్ధ ఫుటేజీని హాలీవుడ్ యాక్షన్ సినిమాల క్లిప్పింగులతో కలగలిపి దాన్ని రూపొందించారు.
హార్మూజ్లో నౌకపై దాడి!
ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో మూతబడ్డ హార్మూజ్ జలసంధి వద్ద ఓ నౌకపై శుక్రవారం దాడి జరిగినట్టు సమాచారం. బ్రిటన్ సముద్ర వర్తక కార్యకలాపాల కేంద్రం ఈ మేరకు వెల్లడించింది. అయితే నౌక వివరాలు, దాడి తీవ్రత వంటి వివరాలేవీ తెలియరాలేదు. ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయతి్నంచే ప్రతి నౌకకూ నిప్పు పెడతామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే.


