west asian countries
-
డర్టీ బాంబు వేసేనా?
పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ములపొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తోంది! అంతేగాక, ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు వాటికి గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తీవ్ర రేడియేషన్ ముప్పు సాంప్రదాయిక బాంబులతో భవనాలు తదితరాలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్ల. రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబు (రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్–ఆర్డీడీ) పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుíÙతమవుతాయి. సాగు భూములు ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదముంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియోషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకుమించిన భారమే అవుతుంది. లాస్ ఏంజెలిస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహాతీతమే! తయారీ సులభమా? అవుననే చెప్పాలి. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే సీసియం–137, స్మోక్ డిటెక్టర్లో వాడే అమేరిసియం–241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్–60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. ‘‘దీనితో అణు బాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితే వస్తే కచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఒకరన్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీలంకలో ఇంధన మంటలు
కొలంబో: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఆదివారం ఇంధన ధరలను 25 శాతం మేర పెంచింది. ఈ పెంపు వారంలో రెండోసారి కాగా, మార్చి ఒకటో తేదీ తర్వాత మూడోసారి కావడం గమనార్హం. నూతన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, కనీసం 20 శాతం మేర ఇంధన వినియోగం తగ్గుతుందని అంచనాలున్నాయి. ఆటో డీజిల్ లీటరు ధర ప్రస్తుతమున్న రూ.303 నుంచి 26.1 శాతం మేర పెరిగి రూ.382కు చేరుకుంది. సూపర్ డీజిల్ రూ.353 నుంచి రూ.443కు, కిరోసిన్ రూ.195 నుంచి 30.8 శాతం మేర పెరిగి రూ.255కు, అదేవిధంగా, పెట్రోల్ 25.6 శాతం మేర పెరిగి రూ.398కి చేరుకుంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దేశం 2022నాటి ఆర్థిక సంక్షోభాన్ని మరోసారి చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1948లో స్వాతంత్య్రం పొందాక మొట్ట మొదటిసారిగా శ్రీలంక అప్పులు చెల్లించలేని స్థితిలో సార్వభౌమ డిఫాల్టర్గా ప్రకటించారు. ఇంధన ధరలు పెరిగిన కారణంగా 90 శాతం మేర బస్సులను తిప్పే పరిస్థితులు లేవని ప్రైవేట్ బస్సు సంస్థల నిర్వాహకులు ప్రకటించారు. ‘డీజిల్ ధరల్లో గతంలో ఎన్నడూ ఇంతభారీగా పెరగలేదు. ఇందుకు తగ్గట్లుగా కనీసం 15 శాతమైన ఛార్జీలను పెంచకుండా బస్సులను నడపలేం’అని ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం అధ్యక్షుడు విజయరత్నే చెప్పారు. దేశంలోని బస్సు సర్వీసులను 65–75 శాతం మేర ప్రైవేట్ సంస్థలే నడుపుతున్నాయి. పెట్రోల్ ధర రూ.400 వరకు పెరిగితే ఆటోల్లో ఎవరు ప్రయాణిస్తారంటూ ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. పెంచిన ఇంధన ధరలతో పన్నుల రూపంలో ప్రభుత్వమే లాభపడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం 5–8 శాతం వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, లీటరు పెట్రోలుపై రూ.100, డీజిల్పై రూ.20 వరకు సబ్సిడీ ఇస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.2 వేల కోట్ల మేర భారం పడుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇంధన ధరలను పెంచకుంటే మరింత భారం మోయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రజలు విద్యుత్ శక్తితో అవసరాలు తీర్చుకోవాలని, ఇంధన వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే ఇంధన రేషనింగ్ అమలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ సాయంతో వారానికి బైక్లకు 5 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, బస్సులకైతే 60 లీటర్ల ఇంధనాన్ని మాత్రమే అందిస్తోంది.ఇంధన ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కూడా ప్రకటించింది. -
డీగో గార్సియా పైఇరాన్ దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం శనివారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. రోజంతా ఇరు వర్గాలూ తీవ్రస్థాయిలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. హిందూ మహాసముద్రంలో మారుమూలన ఉన్న డీగో గార్సియా దీవిలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ అనూహ్యంగా దాడులకు దిగింది. వాటిపైకి రెండు క్షిపణులను ప్రయోగించి అగ్ర రాజ్యానికి ఒక్కసారిగా షాకిచి్చంది! ఒక క్షిపణి మార్గమధ్యంలోనే కుప్పకూలగా మరోదాన్ని ఎస్ఎం–3 ఇంటర్సెప్టర్తో అడ్డుకున్నట్టు అమెరికా పేర్కొంది. తమ క్షిపణుల గరిష్ట సామర్థ్యం 2,000 కి.మీ. మాత్రమేనని ఇరాన్ ఇప్పటిదాకా చెబుతూ రావడం తెలిసిందే. అలాంటిది తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉన్న డీగో దీవిపైకి క్షిపణులు ప్రయోగించగలగడం తీవ్ర కలకలం రేపింది! డీగో గార్సియా అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం. యూఎస్ బాంబర్ యుద్ధ విమానాలు ఆ దీవిని వాడుకునేందుకు బ్రిటన్ అంగీకరించిన మర్నాడే దానిపై ఇరాన్ దాడికి ప్రయతి్నంచడం విశేషం. మరోవైపు ఇరాన్లోని ప్రధాన అణు శుద్ధి కేంద్రమైన నతాంజ్పై ఇజ్రాయెల్ మరోసారి భారీగా క్షిపణి, బాంబుల వర్షం కురిపించింది. అక్కడి నిర్మాణాలను భారీగా నష్టపరిచినట్టు ప్రకటించింది. వచ్చేవారం ఇరాన్పై దాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్పై మరింతగా విరుచుకుపడతామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. ‘‘ఇరాన్పై దాడుల ద్వారా ఆశించిన లక్ష్యాలన్నింటినీ దాదాపుగా చేరుకున్నాం. ఆ దేశ వైమానిక, నావిక, క్షిపణి వ్యవస్థలన్నింటినీ నేలమట్టం చేసేశాం. కనుక దానిపై సైనిక చర్య తీవ్రతను క్రమంగా తగ్గించే యోచన ఉంది’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే కాల్పుల విరమణకు మాత్రం అమెరికా సిద్ధంగా లేదంటూ మెలిక పెట్టారు! ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజాగా పోస్టులు పెట్టారు. అయితే యుద్ధానికి పూర్తిస్థాయిలో, శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టడం మినహా మరే చర్యలూ ఆమోదయోగ్యం కాబోవంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కుండబద్దలు కొట్టారు. టెహ్రాన్ ఉక్కిరిబిక్కిరి శనివారం ఇజ్రాయెల్ శర పరంపరగా చేసిన దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అల్లాడిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా మంటలు, పొగ కని్పంచాయి. దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాలపైనా భారీ స్థాయిలో దాడులు కొనసాగాయి. నతాంజ్ అణు కేంద్రంపై తాజా దాడుల తర్వాత రేడియేషన్ లీకేజీ నమోదు కాలేదని ఇరాన్కు చెందిన మిజాన్ వార్తా సంస్థ పేర్కొంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ నతాంజ్పై ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే పలుమార్లు దాడులు జరిపాయి. మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. రాజధాని బీరూట్లో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్లో దాడుల మధ్యే ప్రజలు ఈదుల్ ఫితర్ జరుపుకున్నారు. ఇరాన్ ముమ్మర దాడులు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ముమ్మరంగా ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, చమురు వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ వందలాదిగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాల్లో భారీగా జనం బంకర్లకేసి పరుగులు తీశారు. క్షిపణి శకలాలు పడి టెల్ అవీవ్లో ఒక కిండర్గార్టెన్ స్కూలు ధ్వంసమైంది. అయితే ఎవరూ గాయపడలేదు. తమ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపైకి దూసుకొచ్చిన 20కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో నిఘా విభాగం ప్రధాన కార్యాలయం డ్రోన్ దాడిలో దెబ్బతింది. ఈ ఘటనలో ఒక అధికారి కూడా మరణించినట్టు ఇరాక్ ధ్రువీకరించింది. డీగో దీవిపై ఇరాన్ దాడి యత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. అది అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య అంటూ నిరసించింది. వాణిజ్య నౌకలపై, గల్ఫ్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ దాడులను యూఏఈ, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఆ్రస్టేలియాతో సహా 22 దేశాలు తీవ్రంగా ఖండించాయి. వీటికి తక్షణం తెర దించడమే గాక హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని సంయుక్త ప్రకటనలో కోరాయి. నతాంజ్ అణు కేంద్రంపై దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ మండిపడింది. ఖర్గ్లో నౌకపై ఇజ్రాయెల్ దాడి అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇరాన్కు ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై గురి పెట్టింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణి ఖర్గ్ దీవిలో ఒక నౌకను తాకింది. అయితే దాడి సమయంలో సదరు నౌక ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ ఇరాన్లోని బుషెహర్ విమానాశ్రయంలో ప్రయాణికుల టరి్మనల్ భవనం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో భారీగా దెబ్బతింది. ఖర్గ్పై దాడులకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.ఇజ్రాయెల్పైకి అది ప్రయోగించిన ఒక క్షిపణి జెరూసలేంలోని చారిత్రక అల్ అక్సా మసీదుకు అతి సమీపంలో పడింది.డీగోపై దాడికి స్పేస్ టెక్నాలజీ దన్ను! తమ క్షిపణుల గరిష్ట రేంజ్ 2,000 కి.మీ. మాత్రమేనని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ఇరాన్, తాజాగా అందుకు రెట్టింపు దూరంలో ఉన్న డీగో దీవిపై దాడి చేయడం తీవ్ర కలకలానికే దారితీసింది. ఇందుకు వీలుగా తమ క్షిపణుల రేంజ్ను పెంచుకునేందుకు సీమోర్గ్ స్పేస్ రాకెట్ టెక్నాలజీని ఇరాన్ వాడుకున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. కాకపోతే ఆశించిన స్థాయిలో కచ్చితత్వాన్ని సాధించడంలో మాత్రం ఇరాన్ విఫలమైందని అభిప్రాయపడింది. -
చమురు భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా గల్ఫ్ ఇంధన క్షేత్రాలు, నిల్వలపై దాడులకు తెరతీయడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం జంప్చేసి 117 డాలర్లకు చేరింది. దేశీయంగా ఎంసీఎక్స్లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ రూ. 74 పెరిగి రూ. 9,067ను తాకింది. యూఎస్ నైమెక్స్లోనూ లైట్ స్వీట్ చమురు పీపా 1.6 శాతం బలపడి 97 డాలర్లకు చేరింది. హార్మూజ్ మూసివేతకుతోడు.. ఖతార్లోని గ్యాస్ సౌకర్యాలు, కువైట్లోని చమురు రిఫైనరీలు దాడులకు గురికావడం తదితర అంశాలు ఇంధన సరఫరాలను దెబ్బతీయనున్న ఆందోళనలు ధరలను ఎగదోస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో భారత్ చమురు బాస్కెట్ 145 డాలర్లను అధిగమించనున్నట్లు వెలువడిన అంచనాలు దేశీయంగా ఇంధన రంగ దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలకు దారి చూపాయి. -
క్రూడ్ బాంబ్.. మార్కెట్ క్రాష్
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో దలాల్ స్ట్రీట్లో అన్ని రంగాల షేర్లు దగ్ధమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ క్షేత్రాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం పేకమేడలా కూలిపోయింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ తారస్థాయికి చేరుకోవడం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం తదితర అంశాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 2,497 పాయింట్లు(3.26%) క్షీణించి 74,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 776 పాయింట్లు కుప్పకూలి 23,002 వద్ద నిలిచింది. 2024 జూన్ 24 తర్వాత ఇరు సూచీలకిదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ మూడు శాతానికిపైగా పతనంతో ఒక్కరోజే రూ.12.87 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.426 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఆసియా మార్కెట్లు 3%, యూరప్ మార్కెట్లు 2.50% పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అమ్మకాల సునామీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 2,753 పాయింట్లు క్షీణించి 73 వేల స్థాయి దిగువన 73,951 వద్ద, నిఫ్టీ 848 పాయింట్లు పతనమై 22,930 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. → బీఎస్ఈ ఇండెక్సుల్లో ఆటో 4.07%, రియల్టీ 3.79%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 3.66% పతనయమ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్లు వరుసగా 3.34%, 2.77% పడ్డాయి. సెన్సెక్స్లో 30 షేర్లూ నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్(5.6%), బజాజ్ ఫైనాన్స్(5.4%), ఎంఅండ్ఎం(5.2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(5.1%), ఎల్అండ్టీ (4.7%) అత్యధికంగా నష్టపోయాయి.పతనానికి ‘పంచ’ కారణాలు → భగ్గుమన్న చమురు ధరలు: ఇరాన్ దాడులు తీవ్రం చేయడంతో గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ పూర్తి గా స్తంభించిపోయింది. దీంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర మళ్లీ 119 డాలర్ల స్థాయికి తాకింది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. → విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు: యుద్ధ భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ వారంలో కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో మొత్తం రూ.24 వేల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలు విక్రయించారు. గురువారం ఒక్క రోజే రూ.7,558 కోట్లు అమ్మకాలకు పాల్పడ్డారు. గడిచిన 14 రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. → ఫెడ్ వడ్డీరేట్లు యథాతథం: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంశాలను కారణాలుగా చూపుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు.→ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్ల అమ్మకాలు: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాత్కాలిక ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామాతో బ్యాంకు షేరు ఇంట్రాడేలో బ్యాంక్ షేర్లు 8.7 శాతం మేర పతనమయ్యాయి. అధిక వెయిటేజీ కలిగిన స్టాక్ కావడంతో సూచీలపై ఆ ప్రభావం కనిపించింది.→ లాభాల స్వీకరణ: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా... దేశీ సూచీలు గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ మొత్తం 2,140 పాయింట్లు(2.87%) ఎగసింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరగడం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. -
ఇంధన వనరులపై దాడులా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కీలక ఇంధన వనరులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘ప్రపంచమంతటినీ ఎంతగానో కలతకు గురి చేసే అంశమిది. ఇప్పటికే ఒడిదొడుకుల్లో ఉన్న అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను ఈ దాడులు మరింతగా దెబ్బ తీస్తాయి’’అంటూ ఆందోళన వెలిబుచ్చింది. ఇరాన్లోని సౌత్ పార్స్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడి, ప్రతీకారంగా ఖతర్లోని ఎల్ఎన్జీ క్షేత్రం రస్ లఫాన్తో పాటు సౌదీ అరేబియాలో అతి పెద్ద చమురు క్షేత్రమైన ఆరాంకోపైనా ఇరాన్ దాడులు కలకలం రేపడం తెలిసిందే. ఇవి భారత్ను తీవ్రంగా కలచివేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. పౌర సదుపాయాలు, ఇంధన వనరులపై దాడులు కూడదని భారత్ ముందునుంచీ చెబుతూనే వస్తోందని గుర్తు చేశారు. వాటికి తక్షణం తెర దించాలని గురువారం మీడియా సమావేశంలో ఆయన సూచించారు. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో 40 శాతానికి పైగా ఖతర్ నుంచి వస్తుండటం తెలిసిందే. దాడులు గర్హనీయం: మోదీ పశ్చిమాసియా తాజా పరిణామా లపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చా రు. ఈ విషయమై పలువురు దేశాధినేతలతో ఆయన వేర్వేరుగా సంభాషించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను గురించి వారితో లోతుగా చర్చించారు. ఇంధన వ్యవస్థలపై దాడులు తీవ్రంగా గర్హనీయమన్నారు. ఉద్రిక్తతలకు తక్షణం తెర దించి శాంతి, సుస్థిరత పాదుగొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హార్మూజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయాన్ని తక్షణం పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వీటన్నింటికీ దౌత్యం, మధ్యవర్తిత్వమే మార్గాలని స్పష్టం చేశారు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు భారత్ అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. అధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టుల్లో ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా విషయమై ఆందోళనలతో వారంతా ఏకీభవించినట్టు తెలిపారు. ‘‘అబ్దుల్లా–2, తారిఖ్తో చర్చల సందర్భంగా జోర్డాన్, ఒమన్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపా. ఇంధన వనరులపై దాడులను ఖండించా’’అని తెలిపారు. గత ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒమన్, జోర్డాన్ అధినేతలతో మోదీ సంభాషించడం ఇది రెండోసారి.పాక్ నైజమే అంత: భారత్న్యూఢిల్లీ: అణ్వాయుధాల వ్యాప్తికి, అధునాతన క్షిపణి వ్యవస్థల విస్తరణకు పాకిస్తాన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందంటూ ఒక నివేదికలో అమెరికా నిఘా వర్గాలు వెలిబుచ్చిన ఆందోళనతో భారత్ ఏకీభవించింది. ‘‘ఇలాంటి వేషాలు పాక్కు కొత్త కాదు. ఆ దేశం నైజమే అంత’’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ గురువారం ఎద్దేవా చేశారు. ‘‘ప్రపంచానికి పాక్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అమెరికా నివేదిక ఆ వాస్తవాన్ని మరోసారి అందరి ముందూ ఉంచంది’’ అని అభిప్రాయపడ్డారు. -
రస్ లఫాన్ క్షేత్రంపై ఇరాన్ దాడులు!
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను నానాటికీ పెను ప్రమాదంలోకి నెడుతోంది. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై చేసిన ఇజ్రాయెల్ దాడి తీవ్ర విపరిణామాలకు దారి తీస్తోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ గురువారం గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలన్నింటికీ నిప్పు పెట్టే ప్రయత్నం చేసింది! ఖతర్, సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి సహా పలుచోట్ల చమురు, సహజవాయు క్షేత్రాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెను కల్లోలం చెలరేగింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎల్ఎన్జీ క్షేత్రమైన ఖతర్లోని రస్ లఫాన్ ఇరాన్ దాడుల్లో భారీగా దెబ్బ తిన్నది. అక్కడి ఉత్పత్తి కేంద్రాల్లో 17 శాతం మేరకు బుగ్గిపాలైనట్టు ఖతర్ ప్రకటించింది. ‘‘ఇది అంచనాలకు అందనంతటి భారీ నష్టమిది! దీన్నుంచి కోలుకునేందుకు కనీసం మూడు నుంచి ఐదేళ్ల సమయం, రూ.2.4 లక్షల కోట్ల (26 బిలియన్ డాలర్ల) నిధులు అవసరం!’’ అని ఖతర్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కాబి పేర్కొన్నారు! భారత ఎల్ఎన్జీ అవసరాలను సగానికి సగం రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. దాంతో ఈ దాడి ప్రభావం మనపై తీవ్రంగా ఉండనుంది!! సౌదీ అరేబియాలో ఎర్రసముద్ర తీరంలో రేవు పట్టణం యన్బులో ఉన్న సమ్రెఫ్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది. అరాంకోలో భాగమైన ఆ క్షేత్రంలో భారీగా మంటలు చెలరేగాయి. నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్టు సౌదీ రక్షణ శాఖ పేర్కొంది. ‘‘ఇరాన్ తీరుతో విసిగిపోయాం. మా ఓపికకూ హద్దుంటుంది! పరిస్థితి చేయి దాటితే ఇరాన్పై యుద్ధంలోకి మేమూ ప్రవేశించాల్సి వస్తుంది’’ అంటూ సౌదీ రాకుమారుడు, విదేశాంగ మంత్రి ఫైసల్బిన్ ఫర్హాన్ అల్ సౌద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘తిరుగులేని ఆయుధ సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత సౌదీ, దాని భాగస్వామ్య దేశాల సొంతం. అవసరమైతే వాటిని ఇరాన్పై ప్రయోగించేందుకు ఏమాత్రమూ వెనకడబోమని గుర్తుంచుకుంటే మంచిది’’ అని హితవు పలికారు. ఇరాన్ డ్రోన్లు కువైట్లో కూడా అల్ అహ్మదీ, మైనా అబ్దుల్లా చమురు క్షేత్రాలకు, యూఏఈ, అబుదాబిల్లోనూ పలు సహజవాయు కేంద్రాలకు నష్టం కలిగించాయి. తమ ఇంధన వ్యవస్థలపై దాడులకు దిగి ఇజ్రాయెల్ దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసిందని ఇరాన్ ఐఆర్జీసీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘‘నిజానికి పొరుగు దేశాల ఇంధన క్షేత్రాలపై దాడులు చేసే యోచనే మాకు లేదు. కానీ మా ఇంధన వ్యవస్థలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో యుద్ధం మరో స్థాయికి చేరింది. అందుకే గల్ఫ్ దేశాల ఇంధన వ్యవస్థలపై మేమూ దాడులకు దిగాం. మా ఇంధన వ్యవస్థలపై మరోసారి దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని సదరు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి తీరతాం’’ అంటూ హెచ్చరించింది! రస్ లఫాన్పై దాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దానిపై మళ్లీ దాడికి దిగితే కనీవినీ ఎరగని స్థాయి దాడులతో సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రాన్ని పూర్తిగా బుగ్గిపాలు చేసేస్తామని ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయబోదని అధ్యక్షుడు హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తూ 12 అరబ్, ఇస్లామిక్ దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ‘‘దాడులను ఇరాన్ తక్షణం మాను కోవాలి. లేదంటే స్వీయరక్షణ చేసుకునే హక్కు గల్ఫ్ దేశాలకు ఉంటుంది’’ అని హెచ్చరించాయి. నౌకలు, ఇంధన వ్యవస్థలపై ఇరాన్ దాడులను జపాన్తో పాటు పలు యూరప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. రస్ లఫాన్పై దాడికి నిరసనగా ఇరాన్ దౌత్య కార్యాలయంలోని అధికారులంతా 24 గంటల్లోపు దేశం వీడాలని ఖతర్ ఆదేశించింది. తాజా పరిణామాలో చమురు ధరలు మరింతగా భగ్గుమన్నాయి. గురువారం బ్యారెల్ ధర 119 డాలర్ల దాకా ఎగబాకింది! ఇరాన్ జలాంతర్గాములు ఖతం! ఇరాన్ జలాంతర్గాములన్నింటినీ ధ్వంసం చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఆ దేశం వద్ద ఉన్న 11 జలాంతర్గాములనూ బుగ్గిపాలు చేసినట్టు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇరాన్ పౌర, సైనిక నేతలందరినీ లక్ష్యం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పడవలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్ భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలపై 5,000 పౌండ్ల బరువైన భారీ బాంబులు వేసినట్టు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించారు. మరోవైపు, కాస్పియన్ సముద్రంలో పలు ఇరాన్ లక్ష్యాలపై తొలిసారి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఒక నౌకాశ్రయం, పలు నౌకలు, కమాండ్ సెంటర్పై క్షిపణుల వర్షం కురిపించినట్టు వెల్లడించింది. అంతేగాక టెహ్రాన్తో సహా ఇరాన్వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల పరంపర గురువారం కూడా తీవ్రస్థాయిలో కొనసాగింది. కొన్ని వందల లక్ష్యాలను క్షిపణులు, బాంబులతో ధ్వంసం చేసినట్టు ఇరు దేశాలు ప్రకటించాఇయి. ఇజ్రాయెల్పైనా దాడులు ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ గురువారం ఎడాపెడా దాడులకు దిగింది. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీశారు. చాలాచోట్ల భవనాలు భారీగా దెబ్బ తిన్నాయి. ఉత్తర ఇజ్రాయెల్లో కీలకమైన విద్యుత్ గ్రిడ్ బాగా క్షిపణి దాడుల్లో దెబ్బ తిన్నట్టు ఇంధన మంత్రి ఎలీ కోహెన్ చెప్పారు. హైఫియా నగరంలో చమురు రిఫైనరీకి కూడా దాడుల్లో నష్టం జరిగింది. అక్కడినుంచి భారీగా పొగ వెలువడుతున్న దృశ్యాలను ఇజ్రాయెల్ మీడియా ప్రసారం చేసింది. లెబనాన్లో 1,000 దాటిన మృతులు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ దేశంలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 1,000, నిర్వాసితుల సంఖ్య 10 లక్షలు దాటినట్టు ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. లెబనాన్లో 500 మందికి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. పొంచి ఉన్న ఇంటర్నెట్ సంక్షోభం సముద్ర ఇంటర్నెట్ కేబుళ్లను ఇరాన్ కత్తిరిస్తుందా?ఇప్పటికే పశి్చమాసియాలో అమెరికా మిత్రదేశాలపై మిస్సైళ్లతో దాడిచేస్తున్న ఇరాన్ ఇకపై హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న సముద్రగర్భ ఇంటర్నెట్ భారీ కేబుళ్లను కత్తిరిస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఆయా కేబుళ్లపై ఆధారపడిన దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. నిజంగానే ఇరాన్ కేబుళ్ల కత్తిరింపు పర్వానికి తెరలేపితే మళ్లీ కేబుళ్ల పునరుద్ధరణకు వారాలు లేదా నెలల సమయం పడుతుందని అంతర్జాతీయ కేబుల్ నెట్వర్క్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ డిజిటల్ గుండెకు ఈ సముద్రకేబుళ్లను కవాటాలుగా చెప్పొచ్చు. పలు దేశాల బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, మెయిళ్లు, కృత్రిమమేధ సేవలు, వీడియో కాల్స్కు సంబంధించిన డేటా మొత్తం ఈ కేబుళ్ల ద్వారానే బదిలీ అవుతోంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ఇంటర్నెట్ వారధులుగా ఈ సముద్ర కేబుళ్లు ఖ్యాతిగాంచాయి. హార్మూజ్, ఎర్ర సముద్రం గుండా దాదాపు 17 భారీ ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఏఏఈ–1, ఫాల్కన్, ‘గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కేబుల్ సిస్టమ్’, ‘టాటా–టీజీఎన్ గల్ఫ్ కేబుల్’వంటి పలు కేబుళ్లు పర్షియన్ గల్ఫ్ జలాల గుండా వెళ్తున్నాయి. ఇవన్నీ భారత విదేశీ డేటా కనెక్షన్లకు కీలకం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో పెద్ద డేటా సెంటర్లను నెలకొల్పేందుకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఇక్కడి డేటా సెంటర్లను విదేశాల్లోని వినియోగదారులు, మార్కెట్లతో అనుసంధానించి గల్ఫ్దేశాలను భవిష్యత్లో ఏఐ కేంద్రాలుగా మార్చాలని ఆశిస్తున్నాయి. వీటికి ఇవే కేబుళ్లు ప్రాణాధారం. ఇప్పుడు ఈ కేబుళ్లను ఇరాన్ సముద్ర మందుపాతరలతో నాశనంచేస్తే వెంటనే పునరుద్ధరించడం కష్టం. కొత్త కేబుళ్లు అమర్చేందుకు ప్రత్యేక నౌకలు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అవి రావడం దాదాపు అసాధ్యం. దీంతో పునరుద్ధరణ పనులు ఆగిపోయి వారాలు లేదా నెలల తరబడి ఈ మార్గంలో డిజిటల్ లావాదేవీలు, డేటా బదిలీ ఆగిపోయే ప్రమాదముందని కేబుల్ సేవాలరంగ సంస్థ ‘టెలీజియోగ్రఫీ’లో నిపుణుడు అలాన్ మౌల్దీన్ చెప్పారు. ఇరాన్పై యుద్ధం కోసం... రూ.18.5 లక్షల కోట్లుపెంటగాన్ అభ్యర్థన వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధం నిమిత్తం ఏకంగా మరో రూ.18.5 లక్షల కోట్ల (200 బిలియన్ డాలర్ల) అదనపు నిధులు కావాలని అమెరికా అంచనా వేసింది! వాటిని విడుదల చేయాల్సిందిగా కాంగ్రెస్ను పెంటగాన్ అభ్యరి్థంచింది. ఈ మేరకు వైట్హౌస్కు ఇప్పటికే లేఖ పంపినట్టు వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించింది. దీనిపై మీడియా ప్రశ్నలకు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నేరుగా బదులివ్వలేదు. దుష్ట నిర్మూలనకు నిధులు కావాల్సిందేనంటూ సరిపెట్టారు. ఇంత భారీ నిధులకు కాంగ్రెస్ ఆమోదం అనుమానమే.దీనిపై ట్రంప్ సర్కారుకు చట్టసభ నుంచి పలు ప్రశ్నలు ఎదురవడం ఖాయమని భావిస్తున్నారు. యూఏఈ నుంచి ‘యాపిల్’ ఔట్?పశి్చమాసియా ఉద్రిక్తతల కారణంగా దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ల నిల్వ కేంద్రాన్ని యూఏఈ నుంచి తరలిస్తోంది. యాపిల్కు భారత్లో భారీ ఐఫోన్ తయారీ కేంద్రమున్న విషయం తెలిసిందే. వాటిని అమెరికాకు రవాణా చేసే క్రమంలో దుబాయ్ అతి పెద్ద నిల్వ కేంద్రంగా ఉపయోగపడుతోంది.గల్ఫ్కు భారత యుద్ధనౌకలు హార్మూజ్ను దాటేందుకు ఎదురుచూస్తున్న తన నౌకల రక్షణ నిమిత్తం భారత్ మరిన్ని యుద్ధ నౌకలను గల్ఫ్ తీరానికి తరలిస్తోంది. నావికాదళం ఇప్పటికే ఆరుకు పైగా యుద్ధ నౌకలను మోహరించినట్టు తెలుస్తోంది. హార్మూజ్ వద్ద 22 భారత నౌకలు చిక్కుబడి ఉండటం తెలిసిందే. వీటిలో సగానికి పైగా చమురు, ఎల్పీజీ నిల్వలతో కూడినవే.అమెరికా విమానం కూల్చివేత! ఇరాన్ గురువా రం అమెరికా ఎఫ్–35 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు తెలుస్తోంది! ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ అగ్ర రాజ్య ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు, ఇరాన్పై అణ్వస్త్ర దాడికి అమెరికా యోచన చేస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
ఇంధన కేంద్రాలే టార్గెట్
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో చమురు, సహజ వాయువు కేంద్రాలే యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతున్నప్పటికీ ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం బుధవారం 19వ రోజుకు చేరుకుంది. ఇరాన్లో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రమైన ‘సౌత్ ఫార్స్’పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడికి దిగింది. ఇక్కడ నిత్యం 100 మిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఇజ్రాయెల్ దాడిలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైతం గల్ఫ్ అరబ్ దేశాల్లోని ఇంధన కేంద్రాలపై విరుచుకుపడింది. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు అధికంగా ఉన్న తూర్పు ప్రావిన్స్పై భారీగా క్షిపణులు ప్రయోగించింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈపైనా క్షిపణులు, డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపించింది. ఆయా దేశాల్లో ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలను, పెట్రోకెమికల్ కేంద్రాలను ధ్వంసం చేయడం తథ్యమని హెచ్చరించింది. వాటి శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. అక్కడ పనిచేస్తున్న కారి్మకులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. పశ్చిమాసియా తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 108 డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 40 శాతం పెరిగింది. పెట్రో ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరలు పెరుగుతున్న కొద్దీ అమెరికాపై ఒత్తిడి పెరగడం తథ్యమని, తద్వారా యుద్ధం నుంచి అమెరికా సైన్యం నుంచి విరమించుకొనే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్లో రైల్వే స్టేషన్పై దాడి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో రైల్వే స్టేషన్పై ఇరాన్ సైన్యం దాడికి పాల్పడింది. దాంతో దేశవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయాయి. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదు. పౌర మౌలిక సదుపాయాలను నేరుగా టార్గెట్ చేయడం సంచలనాత్మకంగా మారింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దౌత్య కార్యాయాలపైనా ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను సౌదీ అరేబియా సైన్యం కూలి్చవేసింది. ఇక్కడ అమెరికా ఎంబీసీతోపాటు ఇతర దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. రియాద్లో బుధవారం సాయంత్రం భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీసై రెండో రోజు బుధవారం కూడా దాడి జరిగింది. ఇరాక్లోని అమెరికా స్థావరాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లో స్వీడన్ పౌరుడికి ఉరి ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్లోని లారెస్తాన్ కౌంటీలో ఉన్న కోర్టు సముదాయంపై భారీ దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మరణించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో ఇప్పటిదాకా 1,300 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్కు గూఢచారిగా పని చేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. ఇరాన్లోని కీలక ప్రాంతాల సమాచారాన్ని మొస్సాద్కు చేరవేస్తున్నాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. అతడు స్వీడన్ జాతీయుడని తెలిసింది. తమ పౌరుడికి ఉరిశిక్ష విధించడాన్ని స్వీడన్ విదేశాంగ శాఖ ఖండించింది. లెబనాన్లో హెజ్»ొల్లా మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. బుధవారం రాజధాని బీరూట్లో అపార్టుమెంట్లపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో పది మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ కార్యకలాపాల కోసం హెజ్»ొల్లా పెద్ద ఎత్తున ధనం నిల్వ చేసుకున్న అపార్ట్మెంట్ను నేలమట్టం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 5 వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులు హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ మిస్సైల్ కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం 5 వేల పౌండ్ల(2,268 కిలోలు) బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ యాంటీ–షిప్ క్రూయిజ్ మిస్సైళ్లు విదేశీ నౌకలకు ముప్పుగా మారాయని, అందుకే శక్తివంతమైన బాంబులు ప్రయోగించినట్లు స్పష్టంచేసింది. ఇరాన్ మంత్రి ఖతీబ్ మృతి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించారు. మంగళవారం రాత్రి దాడుల్లో అతడు హతమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తారంటూ పేర్కొన్నారు. ఖతీబ్ మరణాన్ని ఇరాన్ అధికారిక టీవీ చానల్ సైతం ధ్రువీకరించింది. ఇది దారుణ హత్యాకాండ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సమీపంలో ఇద్దరు మరణించారు. మంగళవారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత అధికారులు అలీ లారిజానీ, ఘోలమ్ రెజా సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. లారిజానీ మృతిపట్ల ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) రగిలిపోతోంది. సెంట్రల్ ఇజ్రాయెల్పై బహుళ వార్హెడ్లతో కూడిన క్షిపణులు ప్రయోగించింది. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక అక్కడి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన తర్వాత ఇప్పటిదాకా 2.6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని భారత విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని వేర్వేరు నగరాల్లోని విమానాశ్రయాల నుంచి భారతీయుల తరలింపు కోసం 70 విమానాలు నడుస్తున్నట్లు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి(గల్ఫ్) అసీమ్ ఆర్.మహాజన్ చెప్పారు. యూఏఈ పరిధి నుంచి భారతీయులను రప్పించడంపై యూఏఈ అధ్యక్షుడు షేక్మొహమ్మెద్ బిన్ జయేద్ అల్ నహ్యాల్లో ప్రధాని మోదీ మంగళవారం టెలిఫోన్ సంభాషణ జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ వెల్లడించారు. యుద్ధం మొదలయ్యాక ఇరునేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి.చిక్కుకున్న లక్షల టన్నుల చమురు, ఎల్పీజీ న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా లక్షల టన్నుల మేర ముడిచమురు సహా పలు రకాల సరుకులు భారత్కు రాకుండా పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లో నౌకల్లో చిక్కుకుపోయాయి. ఈ వివరాలను భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా బుధవారం వెల్లడించారు. ‘‘16.7 లక్షల టన్నుల ముడిచమురు, 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, దాదాపు 2 లక్షల టన్నుల ద్రవరూప సహజవాయువు 22 భారతీయ జెండా ఉన్న సరుకు రవాణా నౌకల్లో ఉండిపోయాయి. ఈ నౌకలన్నీ పర్షియన్ గల్ఫ్ నుంచి హార్మూజ్ గుండా భారత్కు రావాల్సి ఉంది. యుద్ధం కారణంగా ప్రయాణం మొదలుపెట్టలేక గల్ఫ్లోనే ఉండిపోయాయి. 22 నౌకల్లోని 611 మంది భారతీయ నావికులు క్షేమంగానే ఉన్నారు. అన్ని దేశాలకు సంబంధించి దాదాపు 500 నౌకలు పర్షియన్ గల్ప్లో ఆగిపోయాయి. వీటిల్లో 108 చమురు, 166 చమురు ఉత్పత్తులు, 104 రసాయన ఉత్పత్తుల ట్యాంకర్లు, 52 రసాయన ట్యాంకర్లు, 53 ఇతర రకాల నౌకలు, కొన్ని డ్రెడ్జర్లు, ఖాళీ నౌకలు ఉన్నాయి’’అని సిన్హా పేర్కొన్నారు. -
యుద్ధమంటే...
యుద్ధమంటే... పరిగెడుతున్న రైలు హఠాత్తుగా పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోవడం; నడుస్తూ నడుస్తూ ఉన్న దారి అకస్మాత్తుగా మూసుకోవడం; ఏళ్ల తరబడిగా సాఫీగా సాగుతున్న జనజీవితం రోజుల వ్యవధిలో సంక్షోభాల ఊబిలోకి దిగబడిపోవడం; యుద్ధ మంటే గతంతో ఒక్కసారిగా లంకె తెగిపోయి భవిష్యత్తు అంధకారబంధురమైపోవడం! మనిషి ఎక్కువకాలం శాంతికి దగ్గరగానూ, యుద్ధానికి దూరంగానూ ఉంటూ వివేకాన్ని చాటుకునేవాడే; కానీ ఏ దుర్ఘడియలోనో ఆ వివేకం నుంచి జారిపోయి విధ్వంసం వైపు అడుగు వేస్తాడు. మానవ స్వభావంలోని వక్రత అదే; మనిషిని పట్టి పీడించే శాపమూ అదే! యుద్ధంలో విజితులూ, విజేతలూ ఉండరనీ, చివరికి అందరూ పరాజితులే అవుతా రనీ అతనికి తెలియదా, తెలుసు! రెండువైపులా చచ్చినవాళ్ళ కోసం ఏడ్చే బంధువుల దుఃఖం ఒక్కలానే ఉంటుందనీ తెలుసు. కానీ ఉన్మాదం... ఉన్మాదం... తాజా పశ్చిమాసియా యుద్ధంలో పిల్లలతో సహా ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోయారు. అమెరికా చేరికతో అది మినీ ప్రపంచ యుద్ధంగా మారింది ఆర్థిక, వాణిజ్య సంబంధాలూ, వలసలూ, రవాణా సదుపాయాలూ, శాస్త్రసాంకేతికవృద్ధీ దేశాలను దగ్గరగా ముడివేసి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన దశలో... మంచైనా, చెడైనా త్రుటిలో ప్రపంచస్థాయి నందుకుంటాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు కుగ్రామ దశను కూడా దాటి నేరుగా వంటింట్లోకి అడుగుపెట్టి సాధారణ గృహిణులలో కూడా అలజడీ, ఆందోళనా రేపుతున్నాయి. సహజవాయు లభ్యతకు అంత రాయం ఏర్పడి, వంటగ్యాస్ సరఫరా మందగించడంతో హాహాకారాలు చెలరేగు తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితిని ఊహించుకుని కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వాలు అభయమిస్తున్నా పరిస్థితి వాటి చేయి కూడా దాటిపోతే ఏమిటి గతన్న ప్రశ్న గుండెల్ని గునపంలా గుచ్చుతోంది. చిన్నా, పెద్దా హోటళ్ళు మూతపడి సిబ్బంది వీథిన పడుతున్నారు. వాటిపై ఆధారపడే జనాలు తిండికి కటకటలాడే దుఃస్థితి భయపెడుతోంది. కొరతను అడ్డుపెట్టుకుని పెరిగిపోయే వంట గ్యాస్ ధరలు జనాల జేబులను కొల్లగొట్టి మరిన్ని కష్టాలలోకి నెట్టే ప్రమాదమూ తలెత్తింది. అలాగని, వెనకటి కట్టెల అడితీలు, బొగ్గుల దుకాణాల రోజులకు వెళ్ళ గలమా, కాలాన్ని వెనక్కి తిప్పగలమా, ఇన్నేళ్ళ గతినీ ప్రగతినీ కొన్ని రోజుల్లోనే యుద్ధం తుడిచిపెడితే ఏమిటి చేయడం?! ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. యుద్ధమంటే చావుబతుకులు చెట్టపట్టాలు వేసుకుని ఏకకాలంలో చేసే విలయ తాండవం. చావుకీ, బతుక్కీ తేడా కనిపించని నిర్లిప్తక్షణం. ప్రియకౌగిలికీ, మృత్యు ఆలింగనానికీ మధ్య నిత్యసంచారం. లియో తొలుస్తాయ్ ‘వార్ అండ్ పీస్’ అనే తన ఐతిహాసిక నవలలో యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఎడతెగని పెనుగులాటను మహాద్భుతంగా కళ్ళకు కడతాడు. ఆపైన రామాయణ, మహాభారతాల ఉదాహరణాలూ మన ముందు ఉన్నాయి. ‘తపస్సుతో ఇంద్రియాలను జయించిన నీ మీద ఆ ఇంద్రియాలే పగబట్టాయా, సీత పట్ల కామాన్ని జయించలేక ఈ యుద్ధమెందుకు కొనితెచ్చుకున్నావు; భర్తా, కొడుకూ, బంధువులూ చచ్చిన తర్వాత జీవచ్ఛవంలా ఎలా బతక’నంటూ రావణుడి మీదపడి మండోదరి గుండెలవిసేలా రోదిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా అంతే! యుద్ధప్రారంభంలో పురుషుడు చూపిన శౌర్యప్రతాపాలు యుద్ధాంతంలో స్త్రీల శోకవిహ్వ లత ముందు నీరుగారిపోతాయి. మహాభారత కథకుడు ‘స్త్రీపర్వం’ పేరిట తల్లుల శోకా నికి ఒక ప్రత్యేక పర్వరూపమే ఇస్తాడు; అందులో, నూరుగురు కొడుకుల్ని కోల్పోయి కడుపుకోత పడుతున్న గాంధారిని నాయిక స్థానంలో ప్రతిష్ఠిస్తాడు. దుఃఖవివశ అయిన ఆమె ముందుకు రావడానికి అంతటి భీముడూ వణికిపోతాడు. ‘తల్లీ! నీ కొడుకుల్ని చంపించిన పాపాత్ముణ్ణి నేనే! నన్ను శపించు!! ’ అంటూ ధర్మరాజు చేతులు జోడిస్తాడు. తల్లి మనసుతో అతణ్ణి మన్నిస్తూనే, పాండవపక్షానికి చెందిన అభిమన్యుడి మరణానికి సైతం భోరున విలపించిన గాంధారిని యావత్ సృష్టిలోని మాతృత్వానికి ప్రతీకగా మలచిన ఆ ఘట్టం ప్రపంచ సాహిత్యంలోనే నిరుపమానం. అయినా యుద్ధం కలిగించే మోహ, దాహాల ముందు మనిషి ఓడిపోతూనే ఉన్నాడు; ఆత్మవిధ్వంసాన్ని కొని తెచ్చుకుంటూనే ఉన్నాడు; నేటి పశ్చిమాసియా యుద్ధం రేపు ఎన్ని శోకపర్వాలకు రూపుదిద్దబోతోందో! ఈ అగ్నిగుండం ఎప్పటికి ఆరనుందో!! -
అణ్వస్త్రాలతో సర్వత్రా కలవరం!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఘర్షణలు ప్రపంచాన్ని మరోసారి అణ్వస్త్ర యుద్ధం ముంగిట నిలిపాయి. అణు శక్తి సదుపాయాలపై దాడులు జరిగిన సూచనలు ఇంతవరకు అయితే ఏవీ లేవని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) పేర్కొంది. అయితే, ఈ ప్రాంతీయ యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగానికి అవ కాశం హెచ్చుగానే ఉంది. ఇరాన్, ఇజ్రా యెల్తో పాటు సైనిక దాడులను ఎదు ర్కొంటున్న ఆ ప్రాంతంలోని అనేక ఇతర దేశాల్లో అణు విద్యుదు త్పాదన కేంద్రాలున్నాయి. అణు పరిశోధనా రియాక్టర్లతో పాటు, అణు ఇంధన స్టోరేజి సదుపాయాలున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నాలుగు అణు రియాక్టర్లున్నాయి. జోర్డాన్, సిరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియాలు ఏదో ఒక రూపేణా అణుశక్తిని వినియోగించుకుంటున్నాయి. ‘ఫిసైల్’పై చర్చలు ముగియక ముందే..!ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి ఆలంబనగా నిలుస్తు న్నట్లు అనుమానిస్తున్న సదుపాయాలపై ఇజ్రాయెల్–అమెరికా 2025 జూన్లో వైమానిక దాడులకు దిగినపుడు కూడా ఇదే రకమైన ఆందోళనలు పొడసూపాయి. రష్యా–ఉక్రెయిన్ వంటి ఇతర అణ్వా యుధ ప్రయోగావకాశ ఘర్షణలు గత ఏడాది కూడా గుబులు రేపాయి. బులెటిన్ ఆఫ్ ఆటమిక్ సైంటిస్ట్స్ అనే బృందం అణు వినాశనం సంభవించగల సమయానికి సంబంధించిన అంచనా లను వెల్లడిస్తూ ఉంటుంది. ఇరాన్ శుద్ధి చేసినట్లుగా భావిస్తున్న 400కు పైగా కిలోల యురేనియంను దృష్టిలో పెట్టుకుని, 2026 జనవరిలో ఓ రోజు అర్ధరాత్రికి 85 సెకన్ల ముందు అది ఆ అవకా శాన్ని సవరించింది. శుద్ధి చేసిన యురేనియంలో 60 శాతం ఫిసైల్ యురేనియం 235 ఐసోటోప్ ఉంది. అంటే, దాన్ని మరింత శుద్ధి చేయనవసరం లేకుండానే ఆ యురేనియంతో పెక్కు అణ్వా యుధాలు తయారు చేయవచ్చు. ఈ ఫిసైల్ పదార్థ వాడకం గురించి ఓ పక్క చర్చలు కొనసాగుతూండగానే ఇరాన్పై ఇటీవల అమె రికా–ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. గత ఏడాదే ముంచుకొచ్చిన ముప్పు!ఇరాన్లో అణుశక్తి మౌలిక వసతులు విస్తృతంగానే ఉన్నాయి. అది పైకి ప్రకటించిన సదుపాయాలే 13 నడుస్తున్నాయి. టెహ్రాన్ రిసెర్చ్ రియాక్టర్, ప్రాసెస్ రిసెర్చ్ ఫెసిలిటీ, మోలిబ్డెనమ్ అయోడిన్ అండ్ జినాన్ (ఎం.ఐ.ఎక్స్.) రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, జబార్ ఐబిన్ హయన్ మల్టీపర్పస్ ల్యాబొరేటరీస్, మినియేచర్ న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్, లైట్ వాటర్ సబ్–క్రిటికల్ రియాక్టర్, హెవీ వాటర్ జీరో పవర్ రియాక్టర్, 10 మెగావాట్ల ఇస్పహాన్ రిసెర్చ్ రియాక్టర్, కరాజ్ వాటర్ స్టోరేజి ఫెసిలిటీ, బుషెహర్ అణు విద్యు దుత్పాదన కేంద్రానికి చెందిన నాలుగు యూనిట్లు, కరున్ న్యూక్లి యర్ పవర్ ప్లాంట్ వంటివి ఆ కోవలోకి వస్తాయి. గత ఏడాది జూన్లో జరిగిన దాడుల్లో ఫోర్డౌ వంటి కొన్ని సదుపాయాలు దెబ్బ తిన్నాయి. కోర్ రియాక్టర్లు చెక్కు చెదరకపోవడంతో అణు ధార్మికత లీక్ అవలేదు. సంరక్షణ చర్యలకు వీలుగా ఇరాన్ ఆ తర్వాత నూతన ఇస్పహాన్ అణు ఇంధన శుద్ధి కేంద్రం గురించి ఐఏఈఏకి తెలియ జేసింది. కానీ, ఆ కేంద్రం తనిఖీ ప్రక్రియ ఇంకా మొదలు కానేలేదు. తాజా విడత దాడుల్లో ఇస్పహాన్ లేదా మరి ఏ ఇతర అణు శక్తి సదుపాయమైనా దెబ్బతిన్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. గడువు తీరిన ‘తగ్గింపు ఒడంబడిక’ మరొకవైపు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం వంటి అంత ర్జాతీయ ఒడంబడికల వల్ల సాధించిన పురోగతి ఏమీ కనిపించడం లేదు. పైగా, కొన్ని దేశాలు తమ అణ్వాయుధాలకు సాంకేతిక పరంగా మరింతగా పదును పెట్టుకుంటున్నాయి. ఈ స్థితిలో కొత్త అణ్వాయుధ పోటీ మొదలైనా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇటువంటి వాటిలో కడపటి ఒప్పందంగా చెప్పదగిన, అమెరికా–రష్యాల మధ్య నున్న నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒడంబడిక (న్యూ స్టార్ట్) గడువు 2026 ఫిబ్రవరి 5తో ముగిసింది. ఇన్నాళ్లూ (1971 నుంచి) ఆ ఒడంబడిక ఆ రెండు దేశాల అణ్వాయుధ శక్తులను పరి మితం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ రెండు దేశాలూ తమ వద్ద ఉంచుకోదగిన వ్యూహాత్మక అణ్వాయుధాల సంఖ్యకు సంబంధించి ఎటు వంటి పరిమితికీ చట్టబద్ధంగా కట్టుబడి ఉండనవ సరం లేదు. ‘పరిమితం’తో ఒరిగేదేమీ లేదు!అసలు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలవడంతోనే పరిమిత అణుయుద్ధ భావన తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అది చర్చకు వస్తోంది. పూర్తి స్థాయిలో ప్రపంచ అణు యుద్ధానికి పురికొల్పకుండా, తమ నిర్దిష్ట సైనిక లేదా రాజ కీయ లక్ష్యాల సాధనకు పరిమితమైన రీతిలో అణ్వాయుధాలను ఉపయోగించుకుని యుద్ధం చేయడం గురించిన ఆలోచన 1980ల నుంచి ఉంది. వ్యూహాత్మక, రక్షణ నిపుణులు అడపాదడపా దానిపై చర్చిస్తూనే ఉన్నారు. పరిమిత అణు యుద్ధంలో పాల్గొనే దేశాలు తాము ప్రయోగించే అణ్వాయుధాల సంఖ్యలో, అవి విడు దల చేయగల శక్తిలో, లక్ష్యాలను ఎంచుకోవడంలో కొంత నిగ్రహాన్ని పాటిస్తాయన్నమాట. సిద్ధాంతపరంగా దాన్ని ‘పరిమిత’ యుద్ధంగానే పరిగణించవచ్చునేమో కానీ, అణ్వాయుధాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించగలదు. దౌత్యం ఒక్కటే నివారణ మార్గం!ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఆందోళనదాయకంగా ఉంది. అణు ధార్మికత విడుదలకు గల అవకాశాన్ని ఐఏఈఏ తోసిపుచ్చలేదు. పెద్ద నగరాలను మించిన విస్తృత ప్రాంతాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవలసి ఉంటుంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదన్నదే (మొదట్లో అనుకున్నట్లుగా) అమె రికా, దాని మిత్రపక్షాల లక్ష్యమైతే, ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో గ్రాసి చెప్పినట్లుగా, రెండు పక్షాలూ దౌత్యానికీ, చర్చ లకూ తప్పనిసరిగా తిరిగి ఉపక్రమించాలి. అణు జ్వాల రేగకుండా నివారించేందుకు అదొక్కటే నివారణ మార్గం. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం హోటల్ రంగాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల దిగుమతికి ఆటంకాలు ఎదురవుతుండటంతో దేశంలో వాణిజ్యావసరాలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గృహావసరాలకు, అత్యవసర సేవలు అందించే ఆస్పత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. మరోవైపు ఈ నెల 7వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. కేంద్రం ఆంక్షల నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20 శాతం హోటళ్లు మూతపడినట్లు తెలుస్తోంది. చిన్న, మధ్య తరగతి హోటళ్లు, మెస్లు, హాస్టళ్లపై సైతం దీని ప్రభావం పడుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లోనూ సమస్య తలెత్తుతున్నట్టు సమాచారం. వీరికి హోటళ్లే ఆధారం తెలంగాణలో 1.49 కోట్ల గృహ వినియోగదారులు ఉండగా, నెలకు కోటికి పైగా సిలిండర్లు వినియోగమవుతున్నాయి. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా, వినియోగం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేలకు పైగా మీడియం స్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా, చిన్న హోటళ్లు భారీ ఎత్తున ఉన్నాయి. మెస్లు, చిన్న చిన్న రోడ్డుపక్క హోటళ్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక స్టార్ హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు రోజుకు ఒక సిలిండర్, పెద్దవి 3–5 వినియోగిస్తాయి. వినియోగదారులను బట్టి రెస్టారెంట్లు, బార్లలో కూడా రోజుకు ఐదుకు తక్కువ కాకుండా సిలిండర్ల వినియోగం ఉంటుంది. అదే స్టార్ హోటళ్లు రోజుకు 25 సిలిండర్లకు పైగా వినియోగిస్తాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం వంటి నగరపాలక సంస్థలతో పాటు జిల్లా కేంద్రాలు, మునిసిపాలిటీలు, మండల కేంద్రాలలోని హోటళ్లలో కూడా గ్యాస్ సిలిండర్ల వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు హోటల్ ఆహారమే ఆధారం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే హోటళ్లు మూత పడడమే కాకుండా లక్షలాది మంది ఉపాధికి గండి పడుతుంది. 60–65 శాతం ఎల్పీజీ దిగుమతి భారత్ 60–65 శాతం ఎల్పీజీ కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి సరఫరా ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. 2025లో ఎల్పీజీ వినియోగం 31 మిలియన్ టన్నులకు చేరగా, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి కేవలం 12–13 మిలియన్ టన్నులకే పరిమితమవడంతో సమస్య మరింత ఉధృతమైంది. ప్రత్యామ్నాయాల అన్వేషణలో హోటల్ రంగం తాజా పరిస్థితులతో ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు హోటల్ రంగం మొగ్గు చూపుతోంది. ఎలక్ట్రిక్ స్టవ్లు, బయోగ్యాస్ వంటి ఆప్షన్లు పరిశీలిస్తున్నప్పటికీ, అవి ఖర్చుతో కూడుకున్నవే గాక తక్షణ పరిష్కారానికి వీలుకానివనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వంటగదుల్లో విద్యుత్ వినియోగం పెంచే ఆలోచనలో హోటళ్ల యజమానులు ఉన్నారు. హైదరాబాద్లో పుష్కలంగా నిల్వలు యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో సాధారణ రోజుల కంటే ఇప్పుడు గృహ వినియోగం బుకింగ్ల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సిలిండర్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వినియోగదారులు అనవసరంగా భయాందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: భారత్ గ్యాస్ వంట గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఆందోళన చెందుతుండడంతో గ్యాస్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్..ఎల్పీజీ వినియోగదారులు ఆందోళన చెందవద్దంటూ సంక్షిప్త సందేశాలు పంపుతోంది. ‘ఇంధన సరఫరాలో కొరత ఉందని సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే, ఆధార రహితమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. ఇంధనాన్ని సమర్థవంతంగా, అవసరానికి అనుగుణంగా వినియోగించడం మంచిది’ అని బీపీసీఎల్ ఆంగ్లంలో ఎస్ఎంఎస్లు పంపించింది. అయితే గృహ వినియోగదారులు ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత మరోసారి బుక్ చేయాలంటే ఇప్పటివరకు ఉన్న 21 రోజుల గడువును 25 రోజులకు పెంచుతూ ఆయిల్ కంపెనీల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఏజెన్సీలు చెబుతున్నాయి. హోటళ్లు మూతపడే ప్రమాదం: హోటల్స్ అసోసియేషన్ వాణిజ్య ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే హోటల్ రంగం మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకటరెడ్డి, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాల్ తదితరులు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని కలిసి సమస్యను వివరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రి ఢిల్లీకి వెళ్లిన కారణంగా వచ్చిన తర్వాత ఆయన్ను కలుస్తామని వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో హోటళ్లు మూతపడిన దాఖలాలు లేవని, కానీ సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారని ఆయన వివరించారు. -
వంట నూనెలు సలసల!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం సెగ సామాన్యుడి ఇంటిని తాకుతోంది. ఇరాన్– ఇజ్రాయెల్– అమెరికా యుద్ధం మొదలైన తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోయాయి. ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే వంటనూనెలు, పప్పు దినుసు లు, నూనె గింజల ధరలు ఎగబాకాయి. కిరాణా దుకాణం నుంచి క్విక్ కామర్స్ ఆన్లైన్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల ధరలు పెరిగాయి. వంట నూనెల ధరలు గతవారం రోజుల్లోనే లీటరుకు రూ. 15–25 వరకు పెరిగాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఫిబ్రవరి చివరలో హైదరాబాద్లో లీటరు రూ.150కి అటు ఇటుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.170కి చేరింది. వేరుశనగ నూనె కూడా రూ. 180కి పైనే పలుకుతోంది. ఇక సామాన్యులకు అందుబాటులో ఉండే పామాయిల్ ధర లీటరుకు రూ.15 నుంచి రూ. 20 మేర పెరిగింది. మార్కెట్లో నిల్వలు ఉన్నప్పటికీ, ధరలు ఇంకా పెరుగుతాయనే సాకుతో కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి మరీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బేగంబజార్, సికింద్రాబాద్ వంటి హోల్సేల్ మార్కెట్లలో కూడా హోల్సేల్ వ్యాపారులు నూనె ధరలను పెంచి విక్రయిస్తున్నారు. దాంతో రిటైల్ వ్యాపారులు కూడా ధరలను పెంచడంతో ఆ భారం సామాన్యుడిపై పడుతోంది. పెరిగిన పప్పుల ధరలు గల్ఫ్ దేశాల నుంచి రావలసిన పప్పు దినుసుల నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 130–150 మధ్య పలుకుతోంది. వేరుశనగ దిగుబడి తగ్గడం వల్ల వీటి ధరలు కిలో రూ.180 నుంచి రూ.200కి చేరాయి. పెసర పప్పు, మినప్పప్పు ధరలు కూడా ఎగబాకాయి. ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఉత్పత్తి దేశాలతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య సప్లై చైన్ లింక్ తెగిపోవడంతో ధరలను పెంచి విక్రయిస్తున్నట్లు వాణిజ్య వర్గాలు చెపుతున్నాయి. వంట సామగ్రి ధరలు పెరిగాయ్ ఏం యుద్ధమో ఏమో. వంట నూనెలతోపాటు పప్పులు, మిర్చి, వేరుశనగ వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్ రేట్లు పెంచారు. ఈ ధరలతో హోటల్ నడుపుడు ఎట్లనో తెలుస్తలేదు. ధరలు పెరిగితే మేం కూడా టిఫిన్లు, చపాతి, భోజనాల ధరలు పెంచక తప్పదు. ధరలు పెరగకుండా సర్కార్ ప్రయత్నించాలి. –శేషమ్మ, హోటల్ నిర్వాహకురాలు, నాగర్ కర్నూల్ -
భీకరపోరుకు 7 రోజులు
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి తెర తీసి ఏడు రోజులు పూర్తయ్యాయి. తీవ్రస్థాయి దాడులు, ప్రతి దాడులతో వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ ఇరాన్ లక్ష్యం చేసుకోవడంతో పశ్చిమాసియాలోని పలు ఇతర దేశాలు కూడా దాడుల బారిన పడుతున్నాయి. హార్మూజ్ జలసంధి గుండా సరుకు రవాణా పడకేయడంతో చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటిదాకా ఇరాన్లో కనీసం 1,300 మందికి పైగా మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్లో పదుల కొద్దీ మరణాలు సంభవించాయి. ఇరాన్పై దాడులను కనీసం మరో రెండు వారాలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్, నాలుగైదు వారాలు పట్టొచ్చని అమెరికా చెబుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక హెజ్బొల్లా గ్రూపు వంటివాటి రంగప్రవేశంతో రోజులు గడుస్తున్న కొద్దీ యుద్ధం మరింతగా విస్తరిస్తూ వస్తోంది. పశ్చిమాసియా కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా దీర్ఘకాలం పాటు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. వారం రోజుల పాటు యుద్ధం ఎలా సాగిందో చూస్తే... ఒకటో రోజు ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్, ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా ఫిబ్రవరి 28న శనివారం ఇరాన్పై భారీ స్థాయి యుద్ధానికి దిగాయి. బరిలోకి దిగుతూనే ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయడం ద్వారా ఏకంగా కుంభస్థలాన్నే కొట్టాయి! ఆయన నివాస, కార్యాలయ ప్రాంగణంలో అత్యున్నత స్థాయి రక్షణ భేటీ జరుగుతుండగా పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఏకంగా 30కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఖమేనీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవద్దనే ఉద్దేశంతో అత్యంత శక్తిమంతమైన బ్లూ స్పారో క్షిపణిని కూడా ప్రయోగించినట్టు తాజాగా తేలింది! ఖమేనీ భార్య, కోడలుతో పాటు కనీసం 40 మందికి పైగా ఉన్నత స్థాయి నేతలు, సైనిక కమాండర్లు కూడా ఈ దాడిలో మరణించారు. ఆ వెంటనే ఇరాన్ అణు, సైనిక, క్షిపణి లంచ్ ప్యాడ్ వ్యవస్థలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా 100కు పైగా యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ భవనాలు, అధ్యక్ష భవనంతో పాటు రాజధాని టెహ్రాన్వ్యాప్తంగా క్షిపణుల వర్షం కురిసింది. ఓ స్కూలుపై జరిగిన దాడిలో 165 మందికి పైగా విద్యారి్థనులు దుర్మరణం పాలయ్యారు. అనూహ్య దాడి నుంచి తేరుకుని ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై భారీగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతి దాడికి దిగింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యం చేసుకుంటూ యూఏఈ మొదలుకుని దోహా దాకా పలు దేశాలపై దాడులు చేయడంతో పశ్చిమాసియా నిప్పుల కుంపటిగా మారింది. రెండో రోజు ఇరాన్కు చెందిన తొమ్మిది యుద్ధ నౌకలను అమెరికా ముంచేయడంతో యుద్ధం మరింతగా విస్తరించింది. అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దాడులు నేలమట్టం చేశాయి. ఇరాన్వ్యాప్తంగా 100కు పైగా నగరాలపైకి దాడులు విస్తరించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం నమోదయ్యాయి. ఇరాన్ దాడుల్లో అమెరికాకు కూడా గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కువైట్లోని సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు. ఇజ్రాయెల్లోని బేట్ షెమెష్ నగరంలోనూ 9 మంది మృత్యువాత పడ్డారు. మూడో రోజు హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దులపైకి క్షిపణులు ప్రయోగించడంతో యుద్ధం లెబనాన్కు కూడా విస్తరించింది. అక్కడి హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ నిల్వలే లక్ష్యంగా సోమవారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దాంతో ఒక్క బీరూట్లోనే 31 మందికి పైగా మరణించారు. దేశమంతటా మృతుల సంఖ్య 50 దాటింది. గల్ఫ్లోని చమురు క్షేత్రాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంది! డ్రోన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీపై స్వల్పంగా దెబ్బ తింది. దాంతో ఆ క్షేత్రాన్ని సౌదీ మూసేసింది. కువైట్ ఫైటర్ జెట్ జరిపిన ‘ఫ్రెండ్లీ ఫైర్’లో అమెరికా ఏకంగా మూడు యుద్ధవిమానాలను కోల్పోయింది! వాటిలోని పైలట్లు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. వాటిని కూలి్చంది తమ యుద్ధ విమానాలేనని ఇరాన్ చెప్పుకొచ్చింది. నాలుగో రోజు ఇరాన్పై దాడులను అమెరికా తీవ్రతరం చేసింది. సైనిక స్థావరాలు, అణు కేంద్రాలపై బీ–2 బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులను తీవ్రతరం చేసింది. కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటించింది. దానిగుండా ప్రయాణించే నౌకలకు నిప్పు పెడతానని హెచ్చరించింది. అంతటితో ఆగకుండా సౌదీ రాజధాని రియాద్తో పాటు కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో వాటిని మూసేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. దోహా, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్పై కూడా ఇరాన్ పెద్దపెట్టున దాడులు జరిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ భూతల పోరుకు దిగింది! 80 సరిహద్దు గ్రామాల వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించింది.ఐదో రోజు యుద్ధం టర్కీ దాకా విస్తరించింది. ఆ దేశంపైకి ఇరాన్ ఏకంగా ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. భారత్తో సంయుక్త విన్యాసాల్లో పాల్గొని తిరుగుముఖం పట్టిన ఇరాన్కు చెందిన భారీ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనాపై శ్రీలంక తీర సమీపంలో అమెరికా దాడి చేసింది. మార్క్–48 టోర్పెడో ప్రయోగించి దాన్ని ముంచేసింది. నౌకలోని 120 మందిలో 87 మంది మరణించారు. గల్ఫ్లోని తమ స్థావరాలను కాపాడుకునేందుకు పలు యూరప్ దేశాలు కూడా ఆయుధ వ్యవస్థలను మోహరించాయి. ఆరో రోజు టెహ్రాన్ గగనతలంలో ఇరాన్ సుఖోయ్–35 యుద్ధ విమానాన్ని ఇజ్రాయెలీ ఎఫ్–35 ఫైటర్ జెట్ నేలకూల్చింది. ఇరాన్లో 170కి పైగా నగరాలు దాడులకు గురైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,230 దాటింది. తమ యుద్ధ నౌకను ముంచేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై డ్రోన్లు, బోట్లతో దాడికి దిగింది. కువైట్, ఇరాక్ల్లో కూడా మరో రెండు చమురు నౌకలను నష్టపరిచింది. దాడులు అజర్బైజాన్కు కూడా విస్తరించాయి. ఇరాన్ డ్రోన్ల దాడిలో అక్కడి నఖ్చివాన్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. ఏడో రోజు ఇరాన్పై క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగాయి. దక్షిణ ఇరాన్ను అమెరికా, మధ్య, పశ్చిమ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేశాయి. లెబనాన్పై కూడా దాడులను ఇజ్రాయెల్ మరింతగా పెంచింది. టెల్ అవీవ్పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. పశ్చిమాసియా, పరసర ప్రాంతాల్లో ఇప్పటికే 14 దేశాలు యుద్ధంతో ప్రభావితమవుతున్నాయి.ఎన్నెన్ని సమస్యలో! యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు నానా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం దాకా జరిగే హార్మూజ్ జలసంధి మూతబడింది. దాంతో సరఫరా తగ్గి చమురు ధరలు ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత్పైనా అధికంగానే పడుతోంది. తాత్కాలిక ప్రత్యామ్నాయంగా మళ్లీ రష్యా చమురు వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. హార్మూజ్ గుండా భారత్కు వచ్చే పామాయిల్, పప్పులు, ఔషధాల దిగుమతులు ఆగిపోవడంతో వాటి ధరలు పెరిగేలా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమాసియా దేశాలకు మన బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. పశ్చిమాసియా నుంచి సహజ వాయువు సరఫరాలు కూడా పడకేశాయి. దాంతో వాటిపై అధికంగా ఆధారపడే యూరప్, ఆసియా దేశాలు కూడా అల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశ్చిమాసియాలో ఈ వారం రోజుల్లో ఏకంగా 11 వేల విమానాలు రద్దయ్యాయి! ఆ దేశాల్లో లక్షలాదిగా ప్రయాణికులు చిక్కుబడిపోయారు. ఏం జరగనుంది? యుద్ధం కనీసం మరో రెండు వారాలు, అంతకుమించి కొనసాగేలా కనిపిస్తోంది. అయితే రెండు రోజులుగా ఇరాన్ దాడుల తీవ్రత తగ్గినట్టు అమెరికా చెబుతోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గుముఖం పట్టాయంటోంది. నానాటికీ నిండుకుంటున్న ఆయుధ నిల్వలే ఇందుకు కారణం కావచ్చు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను 80 శాతానికి పైగా నాశనం చేసి దాని గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. అమెరికా వద్ద కూడా క్షిపణి నిల్వలు మరో వారం రోజులకు మించి లేవని పెంటగాన్ నివేదిక పేర్కొంది. కానీ తొలి రోజే నాయకున్ని కోల్పోయినా ఇరాన్ మాత్రం మొండిగా పోరాడుతూనే ఉంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్పీజీ ఉత్పత్తి పెంచండి
న్యూఢిల్లీ: పశి్చమాసియాలో సంక్షోభం నేపథ్యలో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని పేర్కొంది. పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్ ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. వాటితో కేవలం ఎల్పీజీని మాత్రమే ఉత్పత్తి చేయాలని తేల్చిచెప్పింది. ఎల్పీజీని దేశీయంగా వంట అవసరాలకు మాత్రమే వాడుకోవాలని వెల్లడించిది. ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 2024–25లో దేశంలో 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉపయోగించారు. ఇందులో 12.8 మిలియన్ టన్నులను దేశీయంగా ఉత్పత్తి చేయగా, మిగతా గ్యాస్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దాదాపు 90 శాతం ఎల్పీజీ గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇరాన్ సహా పశి్చమాసియాలో యుద్ధం కారణంగా చమురు సహా ఎల్పీజీ దిగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
ఖమేనీ బంకర్ ధ్వంసం
దుబాయ్/బీరూట్: పశ్చిమాసియాలో కల్లోల తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఏడో రోజైన శుక్రవారం కూడా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భారీ స్థాయిలో దాడులు కొనసాగించాయి. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను ప్రధానంగా లక్ష్యం చేసుకున్నాయి. ఇరాన్వ్యాప్తంగా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. దాడుల తీవ్రతను ఇకపై మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఘాటు హెచ్చరికలు చేశారు. ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలూ, చర్చలూ ఉండబోవని స్పష్టం చేశారు. ‘‘బేషరతుగా లొంగిపోవాలి. వారి ముందున్న మార్గం అదొక్కటే’’అంటూ కుండబద్దలు కొట్టారు. ఇరాన్ మాత్రం ఏ మాత్రమూ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పేర్కొంది. భూతల దాడులకు కూడా తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. రాజధాని టెహ్రాన్ నడి»ొడ్డున దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీకి చెందిన రహస్య భూగర్భ బంకర్ను బాంబు దాడులతో తుత్తునియలు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ‘‘రహస్య భేటీలతో పాటు యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయం, పర్యవేక్షణ తదితరాల కోసం ఖమేనీ ఈ బంకర్ను ఏర్పాటు చేసుకున్నారు. 50 యుద్ధ విమానాలతో దానిపై విరుచుకుపడ్డాం. నామరూపాల్లేకుండా ధ్వంసం చేసేశాం’’అని ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ పేర్కొంది. ఖమేనీ హత్యానంతరం ఆ బంకర్ సీనియర్ కమాండర్లకు బేస్గా ఉపయోగపడుతున్నట్టు సమాచారం. గురువారం రాత్రంతా గుక్కతిప్పుకోకుండా జరిగిన దాడులతో టెహ్రాన్ అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా భారీగా దుమ్ము, పొగ ఆకాశాన్నంటుతూ కని్పస్తున్నాయి. కీలకమైన క్షిపణి నిల్వ కేంద్రాలున్న కెర్మెన్షాపైనా తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున అమెరికా బీ–2 స్టెల్త్ బాంబర్ విమానాలు ఒక్కోటీ 2,000 పౌండ్ల బరువుండే పెనెట్రేటర్ బాంబులను డజన్ల కొద్దీ జారవిడిచాయి! అనంతరం ఉదయం వేళ టెహ్రాన్లో పలుచోట్ల భారీ పేలుళ్లు వణికించాయి. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,300 దాటినట్టు ప్రభుత్వం పేర్కొంది. జీసీసీ భవనంపై ఇరాన్ దాడి ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైనా దాడులను ఇరాన్ ముమ్మరంగా కొనసాగించింది. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో ప్రజలు భారీ సంఖ్యలో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఖతర్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, అజర్బైజాన్ తదితర దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో పశి్చమాసియా దేశాల నుంచి ఇప్పటిదాకా 20 వేల మంది అమెరికన్లు స్వదేశానికి చేరుకున్నారు. యూఏఈలోని అల్ దాఫ్రా, కువైట్లోని అల్ సలేం వైమానిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దోహాలోని గల్ఫ్ సహకార సమాఖ్య (జీసీసీ) తాలూకు యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ భవనంపైనా దాడికి దిగింది! ఇరాన్ ప్రయోగించిన 9 బాలిస్టిక్ క్షిపణులతో పాటు 109 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాక్లోని కుర్దిస్తాన్లో అమెరికాకు చెందిన ఒక చమురు క్షేత్రంపైనా ఇరాన్ దాడి చేసింది. దాంతో అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. కుర్దు తెగ ఇజ్రాయెల్, అమెరికాలకు దన్నుగా యుద్ధానికి దిగితే ఇరాక్లోని కుర్దిస్తాన్పై భారీ స్థాయిలో విరుచుకుపడతానని ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్పై తీవ్ర దాడులు లెబనాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం దాడుల తీవ్రతను బాగా పెంచింది. దేశంలో ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 123కు చేరినట్టు సమాచారం. రాజధాని బీరూట్, శివారు ప్రాంతాలను గాజా తరహాలో నేలమట్టం చేసేస్తామని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ హెచ్చరించారు. దాంతో ఆ ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా 83 వేల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే సరిహద్దులు దాటి లెబనాన్లోకి చొచ్చుకెళ్లింది. అంతర్జాతీయ సమాజం తమను ఆదుకోవాలని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం విజ్ఞప్తి చేశారు. ఖతర్, దోహ తదితర గల్ఫ్ దేశాలు కూడా తమపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి.ఇరాన్కు కావాల్సింది... ఓ మంచి నాయకుడు: ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ఒక మంచి నాయకుడు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్టు చెప్పారు. ‘‘ఇరాన్కు మంచి భవిష్యత్తుంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేస్తాం. ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తాం’’అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’తరహాలో ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం! మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెర దించేందుకు పలు దేశాలు ప్రయతి్నస్తున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.వైట్హౌస్ నుంచి... హాలీవుడ్ తరహా ట్రైలర్! ఇరాన్ ఆయుధాగారం ఖాళీ అయిందని వెల్లడి ఇరాన్ ఆయుధ నిల్వలు దాదాపుగా నిండుకుంటున్నాయని అమెరికా అభిప్రాయపడింది. అందుకే రెండు రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు బాగా తగ్గుముఖం పట్టినట్టు చెప్పుకొచి్చంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గాయని వైట్హౌస్ పేర్కొంది. ఇందుకు సంబంధించి అసాధారణ రీతిలో హాలీవుడ్ తరహా ట్రైలర్ను విడుదల చేయడం విశేషం! యుద్ధ ఫుటేజీని హాలీవుడ్ యాక్షన్ సినిమాల క్లిప్పింగులతో కలగలిపి దాన్ని రూపొందించారు.హార్మూజ్లో నౌకపై దాడి! ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో మూతబడ్డ హార్మూజ్ జలసంధి వద్ద ఓ నౌకపై శుక్రవారం దాడి జరిగినట్టు సమాచారం. బ్రిటన్ సముద్ర వర్తక కార్యకలాపాల కేంద్రం ఈ మేరకు వెల్లడించింది. అయితే నౌక వివరాలు, దాడి తీవ్రత వంటి వివరాలేవీ తెలియరాలేదు. ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయతి్నంచే ప్రతి నౌకకూ నిప్పు పెడతామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. -
చమురు సలసల.. మార్కెట్ విలవిల!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ భయాలు, ముడిచమురు ధరల సెగ కలగలసి మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దీంతో సెన్సెక్స్ 79,000 పాయింట్ల స్థాయిని కోల్పోగా.. నిఫ్టీ 24,500 పాయింట్ల దిగువన స్థిరపడింది. ముంబై: ముడిచమురు ధరలు మండుతుండటంతో దిగుమతుల బిల్లు పెరగడంతోపాటు.. రూపాయి బలహీనపడనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆపై యూరోపియన్ మార్కెట్ల క్షీణతతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 1,097 పాయింట్లు పతనమై 78,919 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 315 పాయింట్లు కోల్పోయి 24,450 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్ల (ఫ్యూచర్స్) నష్టాలు, క్రూడ్ భగభగలు సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో మిడ్సెషన్ నుంచీ మార్కెట్లు మరింత నీరసించాయి. చివరి సెషన్లో సెన్సెక్స్ 78,812 వద్ద, నిఫ్టీ 24,416 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.బ్యాంకులు బోర్లా: ఎన్ఎస్ఈలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులుసహా రియల్టీ ఇండెక్స్ 2 శాతం క్షీణించింది. ఆటో 1 శాతం నీరసించగా.. కెమికల్స్, ఐటీ నామమాత్రంగా బలపడ్డాయి. ప్రయివేట్ బ్యాంకులలో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఆర్బీఎల్, ఇండస్ఇండ్, కొటక్ 3–1.5 శాతం మధ్య నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, ఎస్బీఐ, బీవోబీ, కెనరా, మహారాష్ట్ర, ఐవోబీ 3–1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే బీఈఎల్, ఆర్ఐఎల్, ఓఎన్జీసీ 2.5–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. షేర్లపై చమురు ఎఫెక్ట్: చమురు సెగ ప్రభావంతో ఇంధన మార్కెటింగ్ దిగ్గజాలు హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ 3–1.7% మధ్య నీరసించాయి. → పెయింట్ల విభాగంలో ఇండిగో, కన్సాయ్ నెరోలాక్, అక్సో నోబెల్ 3.4–2.5 శాతం మధ్య పతనమయ్యాయి. → ఏటీఎఫ్ భయాలతో విమానయాన దిగ్గజం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ 2.4 శాతం నష్టపోయింది. → ముడిసరుకుల ధరల ఆందోళనతో టైర్ల కంపెనీలలో టీవీఎస్ శ్రీచక్ర, అపోలో, ఎంఆర్ఎఫ్ 3–1 శాతం మధ్య క్షీణించాయి.డిఫెన్స్ సేఫ్..: యుద్ధ భయాల నేపథ్యంలో రక్షణ రంగ షేర్లు.. భారత్ డైనమిక్స్(బీడీఎల్), గార్డెన్ రీచ్, మజ్గావ్ డాక్, పారస్ డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్, హెచ్ఏఎల్, డేటా ప్యాటర్న్స్, కొచిన్ షిప్, మిధానీ 6–3.3% మధ్య జంప్చేసింది. వెరసి ఎన్ఎస్ఈ డిఫెన్స్ ఇండెక్స్ 2.8% ఎగసింది. కారణాలివీ...: పశ్చిమాసియాలో దాడులతో చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతం కలగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతోంది. క్రూడ్ మంటతో వాణిజ్య లోటు పెరగడంతోపాటు, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయనున్నట్లు నిపుణులు తెలిపారు. దేశీ కరెన్సీ మరింత బలహీనపడనున్నట్లు పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ పరపతి విధానాలను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నట్లు వివరించారు. చమురు ధరలు పలు రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలున్నట్లు పేర్కొన్నారు.12 శాతం జంప్ చేసిన క్రూడ్రాత్రి 11.30 సమయంలో న్యూయార్క్లో నైమెక్స్ చమురు 14% జంప్చేసి 92.5 డాలర్లకు చేరింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 11 శాతం ఎగసి 94.5 డాలర్లను దాటింది. ఇవి మరింత బలపడితే ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై సోమవారం(9న) కనిపించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క యూఎస్ ఇండెక్సులు సైతం 1 శాతం పైగా క్షీణించి ట్రేడవుతున్నాయి. -
రూపాయి, ఇంధన రేట్లపై పశ్చిమాసియా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నివేదికలో హెచ్చరించింది. పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడంలాంటి అంశాలు కూడా దీనికి తోడైతే రూపాయి మారకం విలువ, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చని ఫిబ్రవరికి సంబంధించిన నెలవారీ ఆర్థిక సమీక్షలో తెలిపింది. అయితే, క్రూడాయిల్ కోసం దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్నప్పటికీ భారత్ వద్ద తగినంత స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు తక్కువ స్థాయిలో కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం మొదలైన సానుకూలాంశాలు, పెరిగే చమురు ధరల ప్రతికూల ప్రభావం నుంచి రక్షణ కల్పించగలవని ఆర్థిక శాఖ తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ పటిష్టమైన వృద్ధి బాటలోనే ముందుకు సాగిందని పేర్కొంది. -
ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా
ఇరాన్పై అమెరికా దాడిచేస్తే బదులుగా ఇరాన్.. సౌదీ, బహ్రెయిన్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలపై బాంబులేస్తోంది. సుదూరంగా ఉన్న భారత్పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు సగటు భారతీయుని గుండెల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి. సముద్రమార్గంలో చమురు కూడలిగా పేరొందిన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడిచమురు మొదలు పలురకాల వస్తూత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారముంది. తొలుత చమురు మంటలు యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడిచమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవరూప సహజవాయువు(ఎల్ఎన్జీ) సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. హార్మూజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. వంటనూనె మరింత ధర.. భారత్ వంటనూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్ ఎక్కువగా ఇండోనేసియా, మలేసియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హార్మూజ్ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని ‘సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడం ఆరంభమైంది. కేంద్రప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం మార్చి రెండో తేదీ ధరలతో పోలిస్తే మార్చి మూడో తేదీన సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ నూనెల రిటైల్ ధరలు ఒకటి నుంచి మూడు రూపాయలు పెరిగాయి. పప్పులూ మరింత ప్రియం.. పప్పుల ధరలు పెరిగే వీలుందని ‘ఆల్ ఇండియా దాల్ మిల్ అసొసియేషన్’అధ్యక్షుడు సురేశ్ అగర్వాల్ చెప్పారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు, మినుములు సహా పలు రకాల పప్పులను దిగుమతిచేసుకుంటోంది. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ అత్తిపండు, బాదం, పిస్తా, ఖర్జూరా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, అప్రికాట్లను దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, అఫ్గాన్ల నుంచి పాక్కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్కు సరుకు రావట్లేదు. సముద్రమార్గంలో వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్రమార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే వీలుంది’’అని ‘ముంబై డ్రై ఫ్రూట్, డేట్ మర్చంట్స్ అసోసియేషన్’అధ్యక్షుడు విజయ్ భూటా చెప్పారు. ఎరువులు, సాగు ఉత్పత్తుల రాక సైతం తగ్గిపోయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాల రాకపోకలు తగ్గడంతో కార్గో రవాణా పరిమాణం కుచించుకుపోయింది. ఇతర దేశాల మీదుగా విమానాలు తిరిగి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు టికెట్ అధిక చార్జీల మోత మోగుతోంది. ప్లాస్టిక్ సైతం.. ముడిచమురు నుంచే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ను తయారుచేస్తారు. ముడిచమురు సరఫరా తగ్గడంతో గత రెండు రోజుల్లోనే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధర 12 శాతం ఎగసింది. దీంతో ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం పైపైకి పోవడం ఖాయంగా కని్పస్తోంది. ఔషధాలదీ అదే బాట... ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్(ఏపీఐ) కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్ఎం) కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్ నుంచి కేఎస్ఎం సరుకు హార్మూజ్ ద్వారానే రావాల్సి ఉంది. ఇవి తగ్గిపోవడంతో భారత్లో సంక్లిష్ట జనరిక్ మందులతోపాటు సైడ్ ఎఫెక్ట్లను తగ్గించే ‘విలువ జోడింపు ఔషధా(వీఏఎం)’ల తయారీ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. వీటికితోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. ఇవన్నీ కలసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధ బీభత్సం
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం నానాటికీ పెరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ గురువారం ఆరో రోజు ఇరాన్ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై పలు దఫాలుగా తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగించింది. పలు గల్ఫ్ దేశాలపైనా మరిన్ని డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇరు పక్షాలూ నౌకలు, నౌకాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. దానికి నిప్పంటుకుని భారీగా మంటలు ఎగసిపడుతున్నట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) తెలిపింది. బుధవారం శ్రీలంక తీర సమీపంలో తమ యుద్ధనౌకపై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసినందుకు ప్రతీకారంగా ఈ చర్యకు దిగినట్టు వెల్లడించింది. తమ యుద్ధ నౌకను ముంచేసినందుకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. ఆ దేశ నౌకలను ఆ స్థాయిలో లక్ష్యం చేసుకుంటామని ప్రకటించిన కాసేపటికే ఐఆర్జీసీ నుంచి దాడి వార్త వెలువడింది. అమెరికా మాత్రం తమ చమురు నౌకపై దాడి జరిగినట్టు ధ్రువీకరించలేదు. అంతేగాక దక్షిణ ఇరాన్లోని కీలకమైన బందర్ అబ్బాస్ నౌకాశ్రయంపై అమెరికా యుద్ధ విమానాలు భారీస్థాయిలో విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. అక్కడ చాలాసేపటిదాకా భారీ స్థాయిలో పేలుళ్లు వినిపించినట్టు స్థానికులను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి. కీలకమైన హార్మూజ్ జలసంధికి బందర్ అబ్బాస్ అతి సమీపంలో ఉంటుంది. హార్మూజ్ను ఇరాన్ ఇక్కడినుంచే నియంత్రిస్తూ ఉంటుంది. మరోవైపు కువైట్లో కూడా ఒక చమురు నౌకపై దాడి జరిగింది. దాంతో అందులోని చమురు సముద్రంలోకి ఒలికిపోతున్నట్టు సమాచారం. ఇది కూడా ఇరాన్ పనేనని భావిస్తున్నారు! ఇరాక్లోని ఖోర్ అలా జుబెయిర్ నౌకాశ్రయం వద్ద బహమాస్కు చెందిన మరో చమురు నౌకపైనా ఇరాన్కు చెందిన బోటు ఆత్మాహుతి దాడికి దిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ గల్ఫ్ ప్రాంతంలో దాడుల బారిన పడ్డ చమురు నౌకల సంఖ్య 9కి చేరింది. గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ డ్రోన్లు! అమెరికా తమ యుద్ధ నౌకను ముంచేసిన కాసేపటికే ఇరాన్ రెచ్చిపోయింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై బుధవారం అర్ధరాత్రి నుంచే దాడులను తీవ్రతరం చేసింది. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో జనం వేలాదిగా బంకర్లలో తలదాచుకుంటున్నారు. పదులకొద్దీ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుని నేల కూలి్చనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. యూఏఈ, ఖతర్తో పాటు దోహాలోని అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ ఎడాపెడా డ్రోన్ దాడులకు దిగింది. ఆరు ఖండాంతర క్షిపణులతో పాటు 125 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యూఏఈ ప్రకటించింది. అబుదాబిలో డ్రోన్ శకలాలు పడి ఆరుగురు గాయపడ్డారు. దాడుల నేపథ్యంలో దోహాలోని అమెరికా రాయబార కార్యాలయం సమీప ప్రాంతాలను ఖతర్ ఖాళీ చేయించింది. దాడుల తీవ్రత దృష్ట్యా దుబాయ్లోని ఎమర్జెన్సీ లాజిస్టిక్స్ హబ్లో కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా గళం విప్పకపోతే యూరప్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది! అంతేగాక తన దాడులను అజర్బైజాన్కూ విస్తరించడం కలకలం రేపుతోంది. నఖి్చవాన్లో విమానాశ్రయంతో పాటు ఓ స్కూలు వద్దా పేలుళ్లు సంభవించాయి. దాంతో ఇరాన్ సరిహద్దుల సమీపంలో గగనతలాన్ని అజర్బైజాన్ మూసేసింది. తమపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు జరిగాయంటూ మండిపడింది. ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికా ఎఫ్–15ఈ యుద్ధ విమానం ఇరాన్లో కుప్పకూలినట్టు వార్తలొచ్చాయి. వాటిని యూఎస్ సెంట్రల్ కమాండ్ మాత్రం ఖండించింది.మెరుగైన విమాన సర్వీసులు పశ్చిమాసియా దేశాల నుంచి ఐదు రోజులుగా దాదాపుగా పడకేసిన విమాన సరీ్వసులు గురువారం పాక్షికంగా కొనసాగాయి. ఒమన్, ఖతర్ తదితర దేశాలు పలు సరీ్వసులను నడిపాయి. దాంతో ఆయా దేశాల్లో చిక్కుబడ్డ యూరప్ తదితర దేశాలకు చెందిన వేలాదిమంది తిరుగు ప్రయాణమయ్యారు. ట్రంప్ రక్తం కళ్లజూస్తాం ఇరాన్ మత నేత అమోలీ యుద్ధ కల్లోలం ఇప్పటికే ఆందోళనలు రేకెత్తిస్తున్న వేళ ఇరాన్ ఉద్రిక్తతలను మరింతగా పెంచే ప్రకటనలకు దిగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇజ్రాయెలీల రక్తం కూడా కళ్లజూడాలంటూ ఇరాన్ మత పెద్ద అయతొల్లా అబ్దొల్లా జావేదీ అమోలీ ఏకంగా ప్రభుత్వ వార్తా చానల్లోనే దేశవాసులకు పిలుపునిచ్చారు! షియా ముస్లిం మత పెద్దల్లో అత్యున్నతమైన అయతొల్లా స్థాయి నేత నోట ఇలాంటి మాటలు రావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.లంక వైపు మరో ఇరాన్ యుద్ధ నౌక కొలంబో: ఇరాన్కు చెందిన మరో యుద్ధ నౌక ఐఆర్ఐఎన్ఎస్ బుషెర్ గురువారం శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఇంజన్ వైఫల్యం కారణంగా లంకను అత్యవసర సాయం కోరి ట్రింకోమలి రేవులో లంగరు వేసింది. నౌకను తమ రేవులోకి అనుమతించి అందులోని 208 మంది సిబ్బందిని ఖాళీ చేయించినట్టు లంక తెలిపింది. ఇరాన్కు చెందిన భారీ యుద్ధనౌక ఐఆర్ఐఎస్ దేనాను బుధవారం లంక తీరానికి సమీపంలో అమెరికా ముంచేయడం తెలిసిందే. అణు కార్యక్రమానికి స్వస్తి! ఇరాన్ కీలక ప్రకటన ?యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అణు కార్యక్రమానికి స్వస్తి పలికేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది! ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్ను ఉటంకిస్తూ అరబిక్ న్యూస్ వార్తా సంస్థ ఈ మేరకు పేర్కొంది. అయితే అణు కార్యక్రమానికి బదులు తమకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని సూచించాలని అమెరికాకు షరతు విధించినట్టు సమాచారం. కానీ తఖ్త్ వ్యాఖ్యలు గతంలో చేసినవేనని ఇరాన్ అధికార వార్తా సంస్థ చెప్పుకొచ్చింది.రంగంలోకి కుర్దు గ్రూపులు! ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లోని కుర్దిష్ గ్రూపులు కూడా యుద్ధ రంగంలోకి ప్రవేశించే సూచనలు కని్పస్తున్నాయి. అమెరికాకు దన్నుగా ఇరాన్పై దాడులకు దిగుతామని పలు గ్రూపులు గురువారం ప్రకటించాయి. అమెరికా అధికారులు కూడా వాటి నేతలు మసూద్ బర్జానీ, బఫేల్ తలాబానీ, ముస్తఫా హిజ్రీ తదితరులతో ఇప్పటికే చర్చలు జరిపారని, దాడులకు కావాల్సిన సాయుధ సంపత్తిని అందజేస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఇరాన్, ఇరాక్ల్లోని కుర్దు సమూహాలు తమకు స్వతంత్ర దేశం కావాలని చిరకాలంగా పోరాడుతూ వస్తున్నాయి. అల్లాడిన ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల దెబ్బకు ఇరాన్ అల్లాడిపోతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి టెహ్రాన్ తదితర నగరాలపైకి నిర్విరామంగా బాంబులు, క్షిపణులు వచ్చిపడుతున్నాయి. 300 పై చిలుకు బాలిస్టిక్ మిసైల్ లాంచర్లను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటిదాకా ఇరాన్పై 5,000కు పైగా భారీ బాంబులు, వెయ్యికి పైగా క్షిపణులు ప్రయోగించినట్టు తెలిపింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి లాంచర్లను అమెరికా; మధ్య, పశ్చిమ ఇరాన్లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నట్టు సమాచారం. దాడులు 175 నగరాలకు విస్తరించినట్టు ఇరాన్ ధ్రువీకరించింది. పౌర సముదాయాలపై కూడా విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారంటూ మండిపడింది. ఇరాన్ సరిహద్దుల్లోని సనందాజ్, సఖెజ్,బుకాన్ తదితర కుర్దు ప్రాబల్య నగరాలపైనా తాజాగా దాడులు జరిగాయి. టెహ్రాన్లోని సైనిక, ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాలు, స్థావరాలపై క్షిపణుల వర్షం కురిసింది. యుద్ధంలో ఇప్పటిదాకా 1,230 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ వెల్లడించింది. లెబనాన్పైనా దాడులను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. బీరూట్తో పాటు పలుచోట్ల హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధాగారాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ట్రిపోలీలోని శరణార్థుల శిబిరంపై జరిగిన దాడుల్లో ఇద్దరు మరణించారు. దాంతో లెబనాన్లో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 70 దాటింది. బీరూట్ దక్షిణ శివార్ల ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. హమాస్ కమాండర్ వసీం అతల్లా అలీని దాడుల్లో మట్టుబెట్టినట్టు ప్రకటించింది. -
ఎగుమతులకు సర్చార్జీల మోత
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశీయంగా ఎగుమతిదారులకు షిప్పింగ్ సర్చార్జ్ల రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులను సాకుగా చూపి షిప్పింగ్ కంపెనీలు అదనంగా డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కువకాలం నిల్వ ఉండని ఉత్పత్తులను మోసుకెళ్లే 40 అడుగుల కంటైనర్లపై అదనంగా రూ. 4,000 మేర కంటింజెన్సీ సర్చార్జీలు ఇవ్వాలంటున్నాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేయడానికి ముందే కొన్ని కన్సైన్మెంట్లు గమ్యస్థానాలకు చేరినప్పటికీ, సరుకును రిలీజ్ చేయాలంటే అదనంగా చెల్లించాల్సిందేనని షిప్పింగ్ కంపెనీలు పట్టుబట్టి కూర్చున్నాయని వివరించారు. ‘ఫిబ్రవరి 28న యుద్ధం మొదలు కావడానికి ముందే పశ్చిమాసియాలోని పోర్టులకు నౌకలు చేరుకున్నాయి. కానీ అధిక సర్చార్జీలు ఇవ్వాలంటూ, షిప్పింగ్ సంస్థలు డెలివరీ చేయడం లేదు. ఈ భారాన్ని ఎవరు భరించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యను కేంద్ర వాణిజ్య శాఖ దృష్టికి తీసుకెళ్లాం‘ అని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. భారత్లో ఇంకా లోడ్ కాని వాటిపై చార్జీలు విధిస్తే అర్థం చేసుకోవచ్చు గానీ ఇప్పటికే గమ్యస్థానాలకు చేరిన వాటిపై కూడా విధించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత ఎగుమతులపై భౌగోళికరాజకీయ పరిణామాల ప్రభావాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంతర్ మంత్రిత్వ శాఖల బృందాన్ని ఏర్పాటు చేసింది. 2024–25 లో పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు 58.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కన్సైన్మెంట్స్ నిలిపివేత .. ఓవైపు అదనపు సర్చార్జీలతోనే సతమతమవుతుంటే మరోవైపు, పశ్చిమాసియా దేశాలకు కన్సైన్మెంట్స్ను తీసుకోవడాన్ని షిప్పింగ్ సంస్థలు నిలిపివేయడం ఎగుమతిదారులకు ఇంకో సమస్యగా మారింది. నౌకలు నిల్చిపోయి కంటైనర్ల కొరత ఏర్పడటంతో సముద్ర మార్గంలో రవాణా వ్యయాలు 50 శాతం ఎగిసినట్లు ఎగుమతిదారులు చెప్పారు. అటు విమానాల ద్వారా రవాణా పెరిగినప్పటికీ ఇది ఖరీదైన వ్యవహారంగా ఉంటోంది. కోల్కతా నుంచి పశ్చిమాసియాకు వెళ్లే కొన్ని ఎయిర్లైన్స్ సరుకు రవాణా చార్జీలను కేజీకి రూ. 175 నుంచి రూ. 425కి పెంచేశాయని సహాయ్ తెలిపారు. ఈ సవాళ్ల వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో దేశీ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి, మన పోటీ సామర్థ్యాలకు ప్రతికూలంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి
కొలంబో: పశ్చిమాసియా యుద్ధజ్వాలలను అమెరికా దక్షిణాసియాకూ వ్యాపింపజేసింది. విశాఖపట్నంలో గత నెలలో అంతర్జాతీయ నావికా విన్యాసాల్లో పాల్గొని స్వదేశానికి బయల్దేరిన ఇరాన్కు చెందిన యుద్ధనౌక ‘ఐఆర్ఐఎస్ దేనా’పై అమెరికా దాడిచేసింది. అమెరికా జలాంతర్గామి నుంచి దూసుకొచ్చిన టోర్పెడో ధాటికి ‘ఐఆర్ఐఎస్ దేనా’యుద్ధనౌక మంగళవారం రాత్రి ముక్కలుచెక్కలై శ్రీలంక సమీప సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 87 మంది నావికాసిబ్బంది జలసమాధి అయ్యారు. పలువురు నావికుల జాడ గల్లంతైంది. నౌక మునిగిపోయాక లైఫ్జాకెట్లతో సముద్రజలాలపై ఈదుతున్న 32 మందిని సమీపంలోని శ్రీలంక నావికాదళాలు రక్షించాయి. గాయపడిన వారిని సమీప నగర ఆస్పత్రిలో చేరి్పంచారు. నౌకపై దాడి చేసింది తామేనని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. దాడి వివరాలను పెంటగాన్లోని రక్షణశాఖ కార్యాలయంలో మీడియాకు మంత్రి హెగ్సెత్ వెల్లడించారు. ‘‘యుద్ధం వేళ హిందూ మహాసముద్ర జలాల్లో శత్రుదేశ యుద్ధనౌక జాడ కనిపెట్టాం. అందుకే టోర్పెడోతో దానిని నాశనంచేశాం. రెండో ప్రపంచయుద్దం తర్వాత శత్రువుల నౌకను జలాంతర్గామితో ధ్వంసంచేయడం ఇదే తొలిసారి’’అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీలంక నైరుతి దిశలో గల్లే నగర సముద్ర తీరం నుంచి 75 కి.మీ.ల దూరంలో సముద్రజలాల్లో నౌక మునిగిపోతోందని, కాపాడాలని శ్రీలంక తీరగస్తీ దళాలకు బుధవారం ఉదయం 5.08 గంటలకు అత్యయిక సందేశం రాగానే వెంటనే శ్రీలంక తమ నావికాదళ నౌకలు, వాయుసేన విమానాలను ఘటనాస్థలికి పంపించింది. యుద్ధనౌకకు చెందిన కొందరు సిబ్బంది లైఫ్ జాకెట్లతో సముద్రజలాలపై కన్పించారు. గాయపడిన వారిని తొలుత శ్రీలంక నేవీ సదరన్ కమాండ్ ప్రధానకార్యాలయంలో చేర్పించారు. తర్వాత గాలె నగరంలోని కరపితియా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. సముద్రజలాల నుంచి 87 మృతదేహాలను లంక నేవీ స్వా«దీనంచేసుకుంది. ‘‘మేం రక్షించిన 32 మందిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో ఏడుగురిని ఐసీయూలో చేర్పించాం. ఇతరులకు చిన్నపాటి గాయాలయ్యాయి’’అని శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి ఎయిర్ వైస్మార్షల్ సంపథ్ థుయకొంతా చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ వివరాలను శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్ పార్లమెంట్లో వెల్లడించారు. ‘‘ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 180 మంది ఉన్నారు. మన బలగాలు అక్కడికి చేరుకునేలోపే నౌక మునిగిపోయింది. గాయపడి ఈదుతున్న నావికులను బలగాలు కాపాడాయి’’అని మంత్రి చెప్పారు. ‘‘ఘటనాస్థలి వాస్తవానికి మా సముద్రజలాల పరిధిలో లేదు. కానీ గాలింపు, సహాయక చర్యలు చేపట్టే దూరం మాత్రం మా పరిధిలోనే ఉంది. అందుకే మేం స్పందించాం’’అని శ్రీలంక నావికాదళ అధికార ప్రతినిధి బుద్ధిక సంపత్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఫిబ్రవరి మూడోవారంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026 వైమానిక విన్యాసాల్లో ఇరాన్కు చెందిన ఈ మౌడ్జ్ తరగతి స్వదేశీ, వేగంగా వెళ్లే తేలికపాటి యుద్ధనౌక సైతం పాల్గొంది. ఐఆర్ఐఎస్ దేనా నౌకలో భారీ స్థాయిలో గన్లతోపాటు భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, యాంటీ–íÙప్ మిస్సైళ్లు, టోర్పెడోలు ఉన్నాయి. దీని మీద హెలికాప్టర్ను ల్యాండ్చేయొచ్చు. దీనికి తోడుగా ఐఆర్ఐఎస్ మక్రాన్ అనే మరో చిన్న నౌక అంతర్జాతీయ జలాల్లో పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించేది. అయితే ఉక్రెయిన్లో జనావాసాలపై దాడులకు ఉపయోగించిన మారణాయుధాలను ఈ నౌకల్లోనే రష్యాకు సరఫరాచేశారన్న ఆరోపణలపై వీటిపై అమెరికా ఆర్థికశాఖ 2023 ఫిబ్రవరిలో ఆంక్షలు విధించింది. ఇరాన్ నౌకలను నాశనంచేయడమే తమ లక్ష్యమని అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ సారథి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వ్యాఖ్యానించారు. -
ఇరాన్పై నిప్పుల వర్షం!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్తో పాటు లెబనాన్పైనా ఇజ్రాయెల్ బుధవారం ఐదో రోజు అక్షరాలా నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్లోని కీలక ప్రభుత్వ వ్యవస్థలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా టెహ్రాన్తో పాటు కోమ్, ఉరి్మయా, కెర్మన్షా తదితర నగరాలపై కూడా రోజంతా పలు దఫాలుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్లోని క్షిపణి నిల్వల కేంద్రంపై క్షిపణుల వర్షం కురిపించింది.టెహ్రాన్ సమీపంలోని నూతన అణు ప్రాజెక్టు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్కు చెందిన వైఏకే–130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతలంలో కూల్చేసినట్టు సైన్యం వెల్లడించింది. దాడుల ధాటికి తాళలేక దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా ఇరాన్ వాయిదా వేసుకుంది! ఇప్పటిదాకా ఇరాన్కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్, నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు. ఇరాన్లో ఇప్పటిదాకా 1,045 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇరాన్ సైనిక సామర్థ్యం బాగా క్షీణించిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి బ్రిగేడియర్ ఎఫీ డెఫ్రిన్ పేర్కొన్నారు. దాంతో దాడుల తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకొచ్చారు. బుధవారం ఇరాన్ కూడా దీటుగా ప్రతి దాడులకు దిగింది. జెరూసలేం తదితర నగరాలపైకి భారీగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతర్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై కూడా దాడులను నిరి్నరోధంగా కొనసాగించింది. దుబాయ్లోని యూఎస్ రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో కార్యాలయం భారీ మంటల్లో చిక్కింది. అయితే సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అక్కడి రస్ అనూరా చమురు శుద్ధి కేంద్రంపై కూడా మళ్లీ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. బహ్రెయిన్లోని యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ వ్యవస్థపైనా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అంతేగాక తన దాడులను టరీ్కకి కూడా విస్తరించింది! ఇరాన్ నుంచి తమ గగనతలంలోకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్టు టర్కీ ప్రకటించింది. తమపై అకారణ దాడికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియా దేశాలు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. పశ్చిమాసియాలోని సైనిక, ఆర్థిక వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేందుకు సన్నద్ధం అవుతున్నామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది! లెబనాన్లో... లెబనాన్పై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ బుధవారం మరింత పెంచింది. ఎడతెరిపి లేకుండా వచి్చపడుతున్న క్షిపణులు, బాంబులతో బీరూట్ దద్దరిల్లిపోతోంది. అరమౌన్, సాదియత్ తదితర నగరాలపైనా దాడులు కొనసాగుతున్నాయి. బలైనట్టు తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామవాసులను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడుల ధాటికి దక్షిణ లెబనాన్లో ఇప్పటికే వేలాది మంది నిర్వాసితులుగా మారారు. బాల్బెక్లో ఓ నివాస సముదాయంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు, సాదియత్లో ఆరుగురు మరణించినట్టు లెబనాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. -
ఇక్కడికొచ్చేదాకా వణికిపోయాం
ఢిల్లీ/ముంబై/చెన్నై/బెంగళూరు: పశ్చిమాసియాలో మూడ్రోజులుగా చిక్కుకుపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయుల్లో కొందరు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ క్షణమొక యుగంలా గడిచిందని, తిరిగొస్తామా అన్న భయంతో గడిపామని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఎయిర్పోర్ట్లకు చేరుకోగానే పశ్చిమాసియాలో తాము అనుభవించిన భయాందోళనలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇప్పటిదాకా నా మనసు స్థిమితపడలేదు. విమానం ఎక్కాక కూడా అదే ఆందోళన. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాతే కుదుటపడ్డా’’అని సునీల్ గుప్తా అనే ప్రయాణికుడు చెప్పారు.‘‘బుక్ చేసిన విమానం రద్దవడంతో నాలుగు రోజులు దుబాయ్లోనే ఉండాల్సి వచి్చంది. దూసుకొస్తున్న క్షిపణులను గగనతల రక్షణవ్యవస్థలు పేల్చేయడం కళ్లారాచూశా. దీంతో భయం ఒక్కసారిగా పెరిగింది. హోటల్ ఖర్చుల ఆర్థికభారం పెనుసమస్యగా మారింది’’ అని దుబాయ్ నుంచి వచి్చన నోయిడా వాసి అరవింద్ చెప్పారు. ‘‘ఇరాన్లో చదువుతున్న నా కూతురు హాస్టల్లో ఉంటోంది. వాళ్లకు సమీపంలో క్షిపణి పడటంతో హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది’’ అని కున్వర్ షకీల్ అహ్మద్ చెప్పారు. ‘‘న్యూయార్క్ నుంచి వస్తూ శనివారం దుబాయ్ చేరుకున్నా. మధ్యాహ్నం గగనతలం మూసేశారు. మమ్మల్ని హోటల్కు తరలించారు. బాంబులు, క్షిపణుల మోత చూసి వణికిపోయా’’ అని శుభా అనే మహిళ చెప్పారు. క్యూల్లో వేల మంది.. ‘‘విమానాలు రద్దయ్యాయని తెలియగానే దుబాయ్ ఎయిర్పోర్టులో చిన్నారులు ఏడుపు మొదలెట్టారు. అప్పటికే ఎయిర్పోర్ట్లో వేలాదిమంది పోగుబడ్డారు. క్యూ వరసల్లో దాదాపు 20,000 మంది నిలబడ్డారు. అందర్నీ తర్వాత వేర్వేరు హోటళ్లకు తరలించారు. స్వదేశానికి తిరిగొచ్చామంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చలువే’’ అని తమిళనాడులోని నాగూర్కు చెందిన సయ్యద్ అలీ చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేరుకున్న భారతీయుల ముఖాల్లో అమితానందం కన్పించింది.‘‘అబూదాబిలో చమురుశుద్ధి కంపెనీలో పనిచేస్తా. భారత్కు వచ్చేందుకు అక్కడి ఎయిర్పోర్టకు రాగానే అలర్ట్ ప్రకటించారు. కిటికీల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు. కింద కూర్చోమన్నారు. క్షిపణి దూసుకొస్తోందని చెప్పగానే ప్రాణం పోయినంత పనైంది. మీకు సమీపంలో క్షిపణి వచ్చిందంటే ఎలా ఉంటుంది?’’అని మంగళూరుకు చెందిన సౌరభ్ చెప్పారు. -
రద్దుల పర్వం
లండన్/దుబాయ్/న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమాసియాలో కమ్మేసిన యుద్ధమేఘాలతో విమాన సరీ్వసులు భారీగా రద్దయ్యాయి. దుబాయ్, అబుదాబి, దోహా ఎయిర్పోర్టులు మూతబడటంతో యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియాలకు విమానాలు ఆగిపోయాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలు, హోటళ్లు, రిసార్టుల్లో చిక్కుకుపోయారు. జర్మనీ నుంచే పశ్చిమాసియాకు వచి్చన 30,000 మంది పర్యాటకులు క్రూయిజ్ నౌకలు, హోటళ్లు, రిసార్ట్లలో చిక్కుకుపోయినట్టు విదేశాంగ మంత్రి జొహాన్ వేడ్ఫుల్ తెలిపారు. తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు చెక్ రిపబ్లిక్ రంగంలోకి దిగింది. సమీప ఈజిప్్ట, జోర్డాన్లకు రెండు విమానాలను పంపించింది. తమ పౌరులను ఈ దేశాలదాకా రప్పించి అక్కడి నుంచి స్వదేశాలకు తీసుకెళ్తామని చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రేజ్ బాబీస్ చెప్పారు. మస్కట్, సలాహ్లకూ విమానాలను పంపారు. విమానాల రాకపోకలు ఆగిపోవడంతో ఇండోనేసియాలోని బాలి పర్యాటక ప్రాంతంలో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అబుదాబిలో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు రోజుకు మూడు గంటలు మాత్రమే ప్రత్యేక అనుమతితో 15 విమానాలను అతికష్టం మీద నడుపుతున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ సోమవారం వెల్లడించింది. సౌదీలో 58,000 మంది ఇండోనేసియన్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారత్లోనూ వందలాది సర్వీసులు రద్దు సోమవారం భారత్లో 357 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఎయిర్పోర్టుల్లో 300కుపైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ‘‘పశ్చిమాసియాలో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. పరిస్థితి మెరుగుపడని కారణంగా సోమవారం ఇండిగో విమానాలు 163, ఎయిర్ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు 110కిపైగా, స్పైస్జెట్ విమానాలు 20, ఆకాశ ఎయిర్ సంస్థ తరఫున నుంచి 8 విమానాలు రద్దయ్యాయి. మొత్తంగా 357 సర్వీసులు నిలిచిపోయాయి. ఉత్తర అమెరికా, యూరప్లకు మాత్రం 20కిపైగా విమానాలు వెళ్లాయి. పశ్చిమాసియా గగనతలం మీదుగా కాకుండా వేరే మార్గంలో విమానాలు నడిచాయి’’అని పౌర విమానయాన శాఖ ‘ఎక్స్’లో పెట్టిన ఒక పోస్టులో పేర్కొంది. -
పశ్చిమాసియా మంటలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూల బాధ్యతారహిత చర్యతో ఒక్కసారిగా పశ్చిమాసియా నిప్పులకొలిమైంది. శనివారం ఉదయం ఒక పథకం ప్రకారం ఇజ్రాయెల్, అమెరికా సైనిక బలగాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక నగరాలు, పట్టణాలపై బాంబులతో, క్షిపణులతో విరుచుకుపడి ఆరంభంలోనే ఇరాన్ మత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతోపాటు ఆయనతో చర్చిస్తున్న కీలకమంత్రులు, రక్షణరంగ బాధ్యులతో సహా దాదాపు 30 మందిని హత మార్చాయి. పర్యవసానంగా యుద్ధం ఆరంభమైన మూడో రోజుకే ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలన్నీ భగ్గున మండుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులతో కోట్లాదిమంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టు కుని ఉన్నారు. మంగళవారం విమాన రాకపోకలు మొదలెడతామని దుబాయ్ అంటు న్నది. సాధ్యాసాధ్యాలపై సంశయాలున్నాయి.సాధారణంగా యుద్ధం తొలి దశలో దేశాధినేతలు, ఇతర కీలక బాధ్యుల జోలికి పోరు. చర్చలకు రప్పించటం, రాజీ తప్ప మరే మార్గమూ లేదన్న అభిప్రాయం కలిగించడం దీని వెనకుండే వ్యూహం. కానీ ట్రంప్, నెతన్యాహూల దుందుడుకుతనం ఆ అవ కాశానికి శాశ్వతంగా తలుపులు మూసింది. అందుకే యుద్ధం ఎడతెగకుండా సాగుతుందన్న అభిప్రాయం బలపడుతోంది. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ ఎప్స్టీన్తో ఉన్న నీతిబాహ్య సంబంధాలు బట్టబయలు కావటం, స్వీయ తప్పిదాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా స్థితికి చేరుకుని సాధారణ ప్రజానీకం దుర్భరమైన స్థితిలో బతుకీడ్వటంవంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ట్రంప్ ఈ దుస్సాహసానికి తెగించారు. అటు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి పదవీభ్రష్టత్వం, జైలు తప్పవని బెంగటిల్లుతున్న నెతన్యాహూ సరిజోడీ అయ్యారు. ఇద్దరికిద్దరూ ప్రపంచాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెట్టారు. అంతక్రితం మాటెలా ఉన్నా పశ్చిమాసియాకు సంబంధించి అమెరికా మూడున్నర దశాబ్దాలుగా కట్టుకథలతో కాలక్షేపం చేస్తోంది. అకారణంగా దాడులకు దిగుతూ, జనహననానికి పాల్పడుతూ తప్పుడు సాకులు వెదుకుతోంది. మొదట ఇరాక్–కువైట్ల మధ్య చిచ్చురగిల్చి, ఆ తర్వాత ఇరాక్ను అదుపు చేయడానికంటూ 1990–91లో ‘ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్’ పేరిట అమెరికా విరుచుకుపడింది. కనీసం అప్పుడు భద్రతా మండలి అనుమతి తీసుకుంది. 35 దేశాలను తోడుతెచ్చుకుంది. అసత్యాలే చెప్పినా దేశ ప్రజలనుద్దేశించి సీనియర్ బుష్ నాలుగు దఫాలు ప్రసంగించారు. కానీ చివరకు అదంతా అమెరికా మాయోపాయం వల్లే జరిగిందని ఆలస్యంగా గ్రహించిన చాలా దేశాలు సీనియర్ బుష్ కుమారుడు జార్జి డబ్ల్యూ బుష్ ఆధ్వర్యంలో సాగిన 2003 నాటి ‘ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్’ యుద్ధానికి మొహం చాటేశాయి. ‘జీవ రసాయన ఆయుధాల’ సాకుతో జరిపిన ఆ యుద్ధానికి బ్రిటన్, పోలెండ్, ఆస్ట్రేలియాలు మాత్రమే సహకరించాయి. భద్రతామండలి ఆమోదం దక్కలేదు. 2015 నాటికి ‘జీవ రసాయన ఆయుధాలు’ కూడా బూటకమని తేలింది. అందుకే కావొచ్చు... ట్రంప్ భద్రతామండలి సంగతలా ఉంచి, కనీసం చట్ట ప్రకారం అమెరికా ప్రతినిధుల సభ అనుమతి సైతం తీసుకోకుండా ఇప్పుడు చిచ్చు రగిల్చారు. ప్రపంచంలో జరిగే ఏ యుద్ధంలోనూ తలదూర్చబోనని హామీ ఇచ్చి ట్రంప్ గద్దెనెక్కారు. తీరా అందుకు విరుద్ధమైన పోకడలుపోతున్నారు. వాస్తవానికి అమెరికా–ఇరాన్లు ఒప్పందానికి చేరువలోవున్నాయని మధ్యవర్తి ఒమన్ ప్రకటించింది. కానీ 24 గంటలు గడవకుండానే ఏకపక్షంగా ట్రంప్ ఈ దుస్సాహసానికి తెగబడ్డారు. ఇరాన్తో స్నేహం నటిస్తూనే సౌదీ ద్రోహం చేసిందనీ, ఖమేనీపై దాడి వెనక దాని పాత్ర ఉన్నదనీ మీడియా కథనం. తమ సైనిక స్థావరాలుంటే ఇరుగుపొరుగు కన్నెత్తి చూడరని చెబుతూ 80వ దశకం నుంచి గల్ఫ్ దేశాలన్నిటా అమెరికా వాటిని నెలకొల్పింది. ఇరాన్ ప్రతీకార దాడులు అదంతా భ్రమగా తేల్చాయి. ఇప్పుడు హోర్మూజ్ జలసంధి మూతబడింది. ట్రంప్– నెతన్యాహూ ద్వయం కదిలించిన ఈ తేనెతుట్టె ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో,ఎంత జన నష్టానికీ, విధ్వంసానికీ కారణమవుతుందో చూడాల్సి ఉంది. -
నిప్పుల వర్షం.. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడిన ఇరాన్
టెహ్రాన్/దుబాయ్/జెరూసలేం: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకుతోడు తమ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య పట్ల ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్తోపాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం కురిపిస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని పలు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్తో పాటు పలు ప్రాంతాలపై దాడులకు దిగింది. డ్రోన్ దాడిలో హోటల్లో స్వల్పంగా మంటలు చెలరేగాయని, వెంటనే ఆర్పేశామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. జెబెల్ అలీ ఓడరేవులోని ఓ బెర్త్లో మంటలు వ్యాపించినట్లు తెలిపింది. ఇరాన్ దాడుల్లో మొత్తం నలుగురు గాయపడినట్లు వెల్లడించింది. వారికి తక్షణమే వైద్య చికిత్స అందించామని పేర్కొంది. యూఏఈలో శనివారం రాత్రంతా సైరన్ల మోత వినిపించింది. పవిత్ర రంజాన్ మాసం కావడంతో జనం రాత్రి మేల్కొనే ఉన్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. అయితే, ఈ దాడిని అబుదాబీ ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించలేదు. దోహాలో డజనుకు పైగా పేలుళ్లు సంభవించాయి. అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే నౌకపైనా ఇరాన్ దాడి చేసింది. శనివారం బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో మృతుల సంఖ 185కు పెరిగినట్టు ఇరాన్ తెలిపింది.ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ధ్వంసం మరోవైపు యూఏఈ సైన్యం ఎదురు దాడికి దిగుతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను నేలమట్టం చేస్తోంది. 165 బాలిస్టిక్ క్షిపణులు, 541 డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ ప్రకటించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తున్నట్లు వెల్లడించింది. దుబాయ్ పేలుళ్లతో దద్దరిల్లింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయం కూడా బాంబు దాడుల్లో దెబ్బ తిన్నాయి. అబుదాబీలో పాఠశాలలను మంగళవారం దాకా మూసివేస్తూ ఆదేశాలిచ్చారు. ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా అంతటా విమానాల రాకపోకలకు తీవర అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో ఎయిర్పోర్టుల్లో జనం పడిగాపులు కాస్తున్నారు. ఇరాన్ దాడుల్లో ఇప్పటిదాకా ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని, 58 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. కువైట్పై ఇరాన్ ఇప్పటివరకు 97 బాలిస్టిక్ క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించింది. ముగ్గురు కువైట్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్కు చెందిన 49 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా నిరీ్వర్యం చేసినట్లు బహ్రెయిన్, ఖతార్ సైతం తెలియజేశాయి. ప్రార్థనా మందిరంపై ఇరాన్ దాడి ఇజ్రాయెల్పై ఇరాన్ వైమానిక దాడులు ఆదివారం సైతం కొనసాగాయి. ముఖ్యంగా సెంట్రల్ ఇజ్రాయెల్, అక్కడి రక్షణ రంగ సంస్థలు తదితరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. డజన్ల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్లో బెయిత్ షెమేశ్లోని ఓ ప్రార్థనా మందిరంపై ఇరాన్ సైన్యం క్షిపణిని ప్రయోగించడంతో కనీసం ఎనిమిది మరణించారు. నాలుగేళ్ల బాలుడు సహా 28 మందికి పైగా గాయపడ్డారు. జెరూసలేంకు 35 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. దీంతో ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో మరణాల సంఖ్య 10కి చేరుకుంది. క్షతగాత్రుల సంఖ్య 120కి చేరింది. అలాగే ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో పదుల సంఖ్యలో నివాస గృహాలు దెబ్బతిన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు ఆగడం లేదు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్ తదితర దేశాల్లోని 27 సైనిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాన్ దాడుల్లో అమెరికా సైన్యానికి ప్రాణనష్టం వాటిల్లుతోంది. ముగ్గురు జవాన్లు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అమెరికా మిలటరీ ప్రకటించింది. మరోవైపు కల్లోలిత పశ్చిమాసియాలోని తమ పౌరులను స్వదేశానికి తరలించడానికి ఇతర దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతీకారం తప్పదు: ఇరాన్ ఖమేనీని పొట్టనపెట్టుకున్న శత్రువులను ప్రాణాలతో విడిచిపెట్టబోమని ఇరాన్ తేలి్చచెప్పింది. శత్రువులు రెడ్ లైన్ దాటేశారని, అందుకు వారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ పార్లమెంటరీ అధికార ప్రతినిధి మొహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ ఆదివారం స్పష్టంచేశారు. ఈసారి కోలుకోలేని విధంగా గట్టిగా దెబ్బకొడతామని, ఖమేనీ మృతికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్లను హెచ్చరించారు. 9 యుద్ధ నౌకల్నిముంచేశాం:ట్రంప్ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ చేసిన హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. తమపై ఎదురుదాడి ఆలోచన వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ప్రతిదాడులకు దిగితే గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో బుద్ధి చెప్తామన్నారు. అమెరికా వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆదివారం 9 ఇరాన్ యుద్ధ నౌకల్ని ముంచేసినట్టు అ«ధ్యక్షుడు వెల్లడించారు. నేవీ ప్రధాన కార్యాలయాన్నీ తీవ్రంగా దెబ్బ తీశామని చెప్పారు.టెహ్రాన్లో పేలుళ్ల మోత అమెరికా–ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్పై దాడులు ఉధృతం చేశాయి. ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. రాజధాని టెహ్రాన్లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. నగరంలో ఎక్కడ చూసినా బాంబుల మోతలే విని్పంచాయి. పేలుళ్ల నుంచి పెద్ద ఎత్తున వెలువడుతున్న పొగలు సుదూరాల దాకా వ్యాపిస్తున్నాయి. ఇరాన్ గుండెకాయపై దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్పై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ తేలి్చచెప్పారు. ఇరాన్లోని పలు ఇతర నగరాలపై కూడా దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. పలు నగరాల్లో భవన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. -
ఇండియా టీచింగ్..వరల్డ్ లెర్నింగ్
దేశీ ఎడ్టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో విదేశాల బాట పడుతున్నాయి. పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలకు విద్యా వ్యాపారాన్ని దూకుడుగా విస్తరిస్తున్నాయి. అప్గ్రాడ్, సింప్లీలెర్న్, బ్రైట్చాన్స్ మొదలైనవి ఈ లిస్టులో ఉన్నాయి. మన ఎడ్టెక్ కంపెనీలు ప్రధానంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియాపై దృష్టి పెడుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, వియత్నాం, థాయ్ల్యాండ్, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్లాంటి మార్కెట్లలో విస్తరిస్తున్నాయి. ఆయా మార్కెట్లలో వినియోగదారుల ప్రొఫైల్ దాదాపు మన దేశం తరహాలోనే ఉండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. థాయ్, వియత్నాంలో అప్గ్రాడ్: టీమ్లీజ్ గణాంకాల ప్రకారం ఆగ్నేయాసియా, ఆఫ్రికా తదితర మార్కెట్లలో 35 ఏళ్ల లోపు వయస్సు గల వారు 2 కోట్ల మంది పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలపై మన సంస్థలు దృష్టి పెడుతున్నాయి. బెంగళూరుకు చెందిన అప్గ్రాడ్ సంస్థ థాయ్ల్యాండ్, వియత్నాంలో కార్యకలాపాలు విస్తరించింది. అలాగే యూఏఈ, మేనా ప్రాంతంలో (మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా) వర్క్ఫోర్స్ శిక్షణకు సంబంధించి వివిధ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే సింప్లీలెర్న్ కంపెనీ వివిధ సంస్థలు, ప్రభుత్వాల భాగస్వామ్యాలతో అమెరికా, బ్రిటన్, పశ్చిమాసియావ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక కిడ్స్ లెర్నింగ్ ప్లాట్ఫాం అయిన బ్రైట్ఛాంప్స్ సంస్థ ఏకంగా 30 పైగా దేశాల్లో విస్తరించింది. యూఏఈ, సౌదీ అరేబియా, వియత్నాం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఆకర్షణీయంగా ఆగ్నేయాసియా: వియత్నాం, థాయ్ల్యాండ్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు వేగంగా డిజిటల్ ఎకానమీలుగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో కెరియర్ పురోగతికి సంబంధించిన కోర్సులను నేర్చుకోవడంపై పెరుగుతున్న ఆసక్తిని అవకాశంగా మల్చుకోవడంపై ఎడ్టెక్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. 2024–25లో అప్గ్రాడ్ ఆదాయంలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా 20–25 శాతంగా నమోదైంది. అటు సింప్లీలెర్న్ అంతర్జాతీయ యూజర్లలో 11 శాతం మంది బ్రిటన్, పశ్చిమాసియాలో ఉన్నారు. ఇక తమ గ్లోబల్ యూజర్లలో 30 శాతం మంది ఆగ్నేయాసియా, దక్షిణాసియా వారు ఉన్నారని బ్రైట్ఛాంప్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా పోటీ: మన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్నప్పటికీ అంతర్జాతీయ దిగ్గజాల నుంచి పోటీ ఎదుర్కొనాల్సి వస్తోంది. యుడెమి, ఎరుడైటస్, యుడాసిటీ, కోర్సెరాలాంటి గ్లోబల్ సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో దూకుడుగా విస్తరిస్తున్నాయి. తమకు విదేశీ మార్కెట్లలో కోర్సెరా, ఎరుడైటస్ నుంచి పోటీ ఉంటోందని అప్గ్రేడ్ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో ఎమెరిటస్, కోర్సెరా, యుడాసిటీలను సింప్లీలెర్న్ ఢీకొంటోంది. మిగతా సంస్థలతో పోలిస్తే తక్కువ వ్యయాలతో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా దేశీ కంపెనీలు.. ఆయా మార్కెట్లలో పటిష్టపడేందుకు ప్రయతి్నస్తున్నాయి. లీడ్ గ్రూప్ ఈ ఏడాది 1,200 పాఠశాలలతో భాగస్వామ్యాలను లక్ష్యంగా పెట్టుకుంది.సాక్షి, బిజినెస్డెస్క్ -
ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం సార్వజనీన విధానంగా మారాలని భారత్ పేర్కొంది. భారత్–అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. ఇందులో అరబ్ లీగ్కు చెందిన 19 సభ్యదేశాల నుంచి మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రారంభం ప్రసంగం చేశారు. గాజా సంక్షోభానికి ముగింపు పలికే సమగ్ర శాంతి పథకం భద్రతా మండలి తీర్మానం 2803కు అనుగుణంగా ఉండటం మేలన్నారు. కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఇటువంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఉమ్మ డి ప్రయోజనాల కోసం శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును బలోపేతం చేసే శక్తులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని జై శంకర్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంతో ఎదురవుతున్న సవాళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన... దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్త సమన్వయ ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చారు. రెండు ప్రాంతాలకు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ముప్పు అన్ని రూపాల్లోనూ ఉన్న ఉగ్రవాదమేనని ఆయన తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలను, ప్రాథమిక దౌత్య సూత్రాలను ఉల్లంఘించే సీమాంతర ఉగ్రవాదం ఏమాత్రం ఆమోదయోగ్యం కానిదని స్పష్టం చేశారు. ఉగ్రవాద బాధిత దేశాలకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని తెలిపారు. ఉగ్రవాదం పీడను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, జీరో టాలరెన్స్ విశ్వజనీన నియమావళిగా ఉండాలని జైశంకర్ అన్నారు.మోదీతో అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీభారత్– అరబ్ లీగ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి వచ్చిన మంతుల్రు అంతకు ముందు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుస్థిర పశ్చిమాసియా కోసం మోదీ చేస్తున్న కృషిని వారి ప్రశంసించారు. ‘అరబ్ ప్రపంచం భారత్ యొక్క విస్తృత పొరుగులో ఒక భాగం. మన మధ్య లోతైన నాగరికత సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధాలు, చిరకాల సోదర బంధాలు ఉన్నాయి. అలాగే శాంతి, ప్రగతి, స్థిరత్వంపై మనకు ఉమ్మడి నిబద్ధత ఉంది’అని మోదీ వారితో పేర్కొన్నారు. -
బందీల విడుదలను స్వాగతిస్తున్నాం: మోదీ
న్యూఢిల్లీ: గాజాలో బందీలుగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు నిజాయితీతో సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న బందీలందరి విడుదలను స్వాగతిస్తున్నాం. వారి స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ బలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది’అని ప్రధాని మోదీ సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు తాము తోడుగా ఉంటామన్నారు. -
సంక్లిష్ట వ్యవహారమిది
షర్మ్ ఎల్ షేక్(ఈజిప్ట్): గాజాలో శాంతి వీచికలు మొదలయ్యాక ఆ శాంతిని శాశ్వతంగా సుస్థిరం చేసేందుకు మొదలైన ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పంలోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో పలువురు యూరప్ దేశాలు, పశి్చమాసియా దేశాల అగ్రనేతల సమక్షంలో శాంతి శిఖరాగ్ర సదస్సులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ సంతకంచేశారు. ఆయనతోపాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసీ, ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అగ్రనేతల సమక్షంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇది చరిత్రాత్మకమైన ఒప్పందం. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు నెరవేరాయి. మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మధ్యవర్తిత్వం విషయంలో ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసి అద్భుతంగా వ్యవహరించారు. మీరు నమ్ముతారో లేదో తెలీదుగానీ అసలు ఈ వివాదం 500 నుంచి మూడువేల సంవత్సరాల నాటిది అని అనుకుంటున్నా. ఇప్పటికి ఓ కొలిక్కి వచి్చంది. ఇంకా ఇందులో ఎంతో సంక్లిష్టత ఉంది. ఈ ఒప్పందం అత్యంత చిక్కుముళ్లతో కూడుకుంది. ఎన్నో నిబంధనలు, షరతులను పొందుపరిచాం. వాస్తవానికి పశ్చిమాసియాలో ఈ యుద్ధం చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చాలా మంది భావించారు. ఇకపై అలాంటిదేమీ ఉండబోదు. నేను గతంలో ఎన్నో సంక్లిష్టమైన సమరాలు, సమస్యలను పరిష్కరించా. ఇది మాత్రం అతిపెద్ద రాకెట్ షిప్లాగా సమస్యాత్మకంగా మారింది. చివరకు పరిష్కరించాం’’ అని ట్రంప్ అన్నారు. తర్వాత నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. తర్వాత నేతలంతా వేరే వేదికపై చేరారు. అక్కడ మళ్లీ ట్రంప్ బ్రిటన్, ఇటలీ, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే తదితర కీలక దేశాల అగ్రనేతలను పొగుడుతూ మాట్లాడారు. భారత్ గొప్పదేశం వెనకాల పలువురు నేతలు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా వాళ్ల సమక్షంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘ భారత్ గొప్పదేశం. నాకు అత్యంత మిత్రదేశం. భారత్ గొప్ప పనులెన్నో చేసింది. ఇకమీదట పాకిస్తాన్, భారత్లు ఇరుగుపొరుగున హాయిలా కలిసిమెలసి ఉంటాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఆ సందర్భంలో షరీఫ్ నవ్వుతూ కనిపించారు. తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ మాట్లాడారు. ‘‘పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికారం ఉండాల్సిందే. వాటిని భవిష్యత్తులో ఏ దేశమూ లాగేసుకోకూడదు. స్వతంత్ర దేశంగా ఎదగాలి’’ అని సిసీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఎవరి కోసం ఈ యుద్ధం?
అకారణ యుద్ధాలతో నిండా మునిగి, ఆర్థికంగా పతనావస్థకు చేరుకున్న అమెరికా, మరోసారి పశ్చిమాసియా రణరంగంలో దూకి తన మూర్ఖత్వాన్ని చాటుకుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘నాకెందుకో నోబెల్ బహుమతి రావటం లేద’ని వగచి 48 గంటలు కాలేదు... తన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంటా బయటా ‘వద్దుగాక వద్ద’ని మొత్తుకుంటున్నా, ఆంక్షలతో బక్కచిక్కిన ఇరాన్పై తన ప్రతాపాన్ని చూపారు. ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ పేరిట శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ కొండప్రాంతాల్లోని భూగర్భంలో వున్న ఫోర్దో, నతాంజ్, ఇసాఫన్ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అమెరికా చెబుతున్నట్టు ఆ స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సివుంది. కానీ ఫోర్దో కేంద్రంపై సోమవారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి దాడి చేశాయన్నది గమనిస్తే తీవ్ర నష్టం కలిగివుండొచ్చనిపిస్తోంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఎన్నడూలేని విధంగా హోర్ముజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ కేబినెట్ నిర్ణయించటం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై పిడుగుపాటే. ఇరాన్పై అమెరికా పగ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అమెరికా రాయబార కార్యాలయంపై దాడిచేసి 52 మంది దౌత్యవేత్తలనూ, పౌరులనూ 444 రోజుల పాటు బందీలుగా చేసిన వైనాన్ని ఆ దేశం మరిచిపోలేకపోతోంది. బందీలను విడిపించ టానికి అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ సైతం విఫలమైంది. ఆ పరాభవంనుంచి కోలుకోలేక ఏదో సాకుతో ఆంక్షలు విధిస్తూనేవుంది. ఆ తర్వాత 1980లో అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను ఇరాన్పైకి ఉసిగొల్పింది. ఎనిమిదేళ్ల ఆ యుద్ధం రెండు దేశాలనూ దెబ్బతీయగా, అమెరికా ఆయుధ విక్రయంతో బాగుపడింది. అటుపై అడపా దడపా ఇజ్రాయెల్తో దాడులు చేయిస్తూనే ఉంది. కొత్త కొత్త ఆంక్షలతో ఇరాన్ను దెబ్బతీస్తూనే ఉంది. తీరికూర్చుని వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, వనరుల కైంకర్యానికి ప్రయత్నించటం అమెరికా విదేశాంగ విధానంలో భాగం. ఇరాన్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జాతీయవాది ప్రధాని మహమ్మద్ మొసాదిని 1953లో బ్రిటన్తో చేతులు కలిపి సైనికకుట్రతో కూల్చిన పాపం అమెరికాదే. అప్పట్లో బ్రిటన్ చేతుల్లోవున్న ఇరాన్ చమురు కంపెనీని జాతీయం చేయటంతో రెండు దేశాలూ ఈ దుస్సాహసానికి ఒడిగట్టాయి. అటుపై తమ కీలు బొమ్మ మహ మ్మద్ రెజా పెహ్లవీని అందలమెక్కించాయి. రెండు దశాబ్దాలు గడవకుండానే అతగాడు పదవీభ్ర ష్టుడయ్యాడు. ఇస్లామిక్ దేశాల్లో అమెరికా జోక్యంతో ఛాందసవాదుల ప్రాబల్యం పెరగటం 1953 నాటి ఇరాన్తో మొదలుపెట్టి ఇటీవలి బంగ్లాదేశ్ వరకూ కనబడుతూనే ఉంది. అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా, లెబనాన్, సోమాలియా, సిరియా వగైరాలన్నీ ఇందుకుదాహరణ. అఫ్గాన్లో తాలిబన్లు మొదలుకొని సిరియాలో ఐఎస్ వరకూ అన్ని ఉగ్రవాద సంస్థల పుట్టుకకూ అమెరికాయే కారణం. డెమాక్రాట్లు మళ్లీ నెగ్గితే అమెరికాను సర్వనాశనం చేస్తారని, మూడో ప్రపంచయుద్ధానికి కారకు లవుతారని అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేసిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆ పెను ముప్పు వైపు అడుగులేశారు. అమెరికన్ కాంగ్రెస్కు మాట మాత్రమైనా చెప్పలేదు. అంతర్జాతీయ చట్టాల్ని లేశమాత్రమైనా గౌరవించలేదు. చివరకు ఏమవుతుందోనన్న చింత అసలే లేదు. యుద్ధాల్ని ప్రారంభించటం తేలిక. వాటి ముగింపు ఎవరి వల్లా కాదు. వ్యక్తుల ఇష్టానిష్టాలకు అది లోబడి ఉండదు. అసలే పశ్చిమాసియా వైరుద్ధ్యాల పుట్ట. పరస్పరం కలహించుకునే దేశాలు అక్కడ డజనుకు పైగా ఉంటాయి. అలాంటిచోట ‘తగుదునమ్మా...’ అంటూ ట్రంప్ వేలెట్టి పెద్ద తప్పు చేశారు. కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సింది... అమెరికన్ పౌరులూ, ప్రపంచ ప్రజానీకం.మూడున్నర దశాబ్దాల ఏలుబడిలో అలీ ఖమేనీకి ఇది పరీక్షా సమయం. దాడులకు లొంగి ట్రంప్తో దౌత్యానికి సిద్ధపడతారా లేక ఇజ్రాయెల్ అంతు చూసేదాకా వదలరా అన్నది తేలటానికి సమయం పడుతుంది. కానీ శక్తిమంతమైన అమెరికాపై ప్రతీకార దాడులకు దిగి భారీ నష్టానికి సిద్ధ పడకపోవచ్చు. అకారణ దాడులపై రౌద్రంగా ప్రకటనలిస్తున్నా ఆచరణ రూపం దాల్చక పోవచ్చు. అటు అమెరికా సైతం ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలపై యుద్ధమే తప్ప ఆ దేశంపై యుద్ధం తమ ఉద్దేశం కాదంటోంది. కానీ ఇజ్రాయెల్, అమెరికాల ఉమ్మడి దురాలోచన ఇరాన్లో నాయకత్వ మార్పు... అమెరికా ప్రాపకంతో నడిచే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల ప్రమేయం లేకుండా సర్వస్వతంత్రంగా, నిటారుగా నిలబడగల్గిన ఇరాన్ను ‘ప్రధాన స్రవంతి’కి మళ్లించటం. ఆ రెండూ మాత్రం నెరవేరే అవకాశం లేనే లేదు. ఇరాన్లో పెట్టుబడులు లేవు గనుక అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. కానీ మనకు ఆ దేశంతో ఆర్థికబంధం ఉంది. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా మధ్య ఆసియా దేశాలతో, అఫ్గాన్తో నేరుగా, చౌకగా వాణిజ్యాన్ని నెరపగలిగే చాబహార్ పోర్టు ఇరాన్లో నిర్మించింది మనమే. కానీ ఆంక్షల కారణంగా అది అరకొరగా ఉంది. ఇరాన్ చౌకగా ఇచ్చే చమురును కూడా ఆ ఆంక్షల పర్యవసానంగానే కాలదన్నుకున్నాం. ఈ యుద్ధం ఉగ్రరూపం దాలిస్తే ఆర్థికంగా మరింత నష్టపోతాం. చైనా, రష్యాల పరిస్థితి కూడా ఇదే. అటు నాటో కూటమి సైతం అయోమయంలో పడింది. అందుకే ఈ మతిమాలిన యుద్ధం చాలించమని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైనా ఉంది. -
చిక్కడు.. దొరకడు!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. దాడులు, ప్రతిదాడులకు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా సైతం అడుగుపెట్టడం అగి్నకి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇజ్రాయెల్తోపాటు అమెరికాపై కత్తులు నూరుతున్న అసలు కథానాయకుడు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనేది టాప్ సీక్రెట్గా మారింది. దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ సైతం అన్నారు. చావుకు భయపడే మనిషి కాదు ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచి్చతంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ గురించి తెలియదని అంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం ఉప్పందకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. అమెరికా దాడుల తర్వాత బంకర్లోకి.. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్లోని ఓ కాంపౌండ్లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీ కమాండర్లు, అధికారులతో ప్రతివారం సమావేశమవుతారు. ప్రజలతో మాట్లాడాలన్నా ఇక్కడే. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదని సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. శత్రువులకు తన ఆచూకీ చిక్కకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. శత్రువుల చేతికి చిక్కితే మరణాన్ని చేతులారా ఆహ్వానించినట్లేనని ఖమేనీని బాగా తెలుసు. ఆయనను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా చేయని ప్రయత్నమే లేదు. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఎంతోమందిని హత్య చేసింది. కొద్ది రోజుల క్రితమే పేజర్ బాంబులతో హెజ్»ొల్లా నాయకులను మట్టుబెట్టింది. ఖమేనీని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయిందంటే ఆయన ఎంత సురక్షితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ నన్ను చంపేయడం ఖాయం. దేశం కోసం వీరమరణం పొందడం నాకు సంతోషమే’’ అని కొన్నేళ్ల క్రితం ఖమేనీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా మెరుపుదాడి.. ఖండించిన ప్రపంచదేశాలు
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే శత్రుత్వంతో పరస్పర దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలోకి అగ్రరాజ్యం హఠాత్తుగా వచ్చి భీకరదాడులతో పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను మరింత ఎత్తుకు ఎగదోసింది. పర్వతగర్భంలో పటిష్టంగా, రహస్యంగా ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని బద్దలుకొట్టే లక్ష్యంతో అమెరికా యుద్ధవిమానాలు వేల కేజీల బరువైన అతిభారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని సమీప ఫోర్డో అణుకేంద్రంపై శనివారం అర్ధరాత్రిదాటాక గంటలకు జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబులను అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాలు జారవిడిచాయి. ఈ బాంబులు 200 అడుగుల లోతుకు చొచ్చుకెళ్లి అక్కడి భూగర్భాన్ని బద్దలుకొట్టాయి. నతాంజ్ అణుకేంద్రంపైనా అమెరికా ఇవే బాంబులను వేసింది. మొత్తంగా 14 జీబీయూ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, జనరల్ డేనియల్ కెయిన్ వెల్లడించారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్.. శనివారం అర్ధరాత్రిదాటగానే ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’పేరిట ఈ దాడులను చేసింది. అమెరికాలోని మిస్సోరీలోని వైట్హ్యాన్ వైమానిక స్థావరం నుంచి ఆరు బీ–2ఏ విమానాల దండు దండయాత్ర మొదలైంది. ఏకధాటిగా 37 గంటలపాటు ప్రయాణించి, మార్గమధ్యంలో గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటూ 11,400 కిలోమీటర్లు ప్రయాణించిమరీ ఫోర్డో, నతాంజ్ అణుకేంద్రాలపై ఒక్కోటి దాదాపు 14,000 కేజీల బరువుండే 14 బంకర్ బస్టర్ బాంబులను పడేశాయి. ఆ తర్వాత ఇస్ఫహాన్ అణుకేంద్రంపై అమెరికా జలాంతర్గామి 30 టోమాహాక్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మూడు అణుకేంద్రాలపై 75 దాకా గైడెడ్ క్షిపణులను ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. మొత్తంగా 125 విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కొన్ని విమానాలు దాడిచేయగా మిగతావి శత్రుసేనలను తికమక పెట్టేందుకు వేర్వేరు దిశల్లో చక్కర్లు కొట్టాయి. మెరుపువేగంతో దాడులుచేసి తిరిగి తమతమ స్థావరాలకు చేరుకున్నాయి. యుద్ధ, రవాణా, ఇంధన విమానాలు ఈ ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’లో పాల్గొన్నాయి. అమెరికా దాడుల్లో అణుకేంద్రాల్లో మౌలికవసతులు ఏ స్థాయిలో నాశనమయ్యాయో ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే పర్వతం పైభాగంలో ఆరు భారీ రంధ్రాలు పడ్డట్లు తాజాగా తీసిన ‘ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ’ఉపగ్రహ ఫొటోల్లో కనిపించింది. అయితే అణుబాంబు తయారీని అడ్డుకునేందుకు బాంబులేశామని, ఇరాన్లో యుద్ధాన్ని ఎగదోసి, ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమకు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. అయితే అణుబాంబు తయారీ సామర్యాన్ని ఇరాన్ సంతరించుకోవద్దనే లక్ష్యంతోనే తాము యుద్ధంలో పాల్గొన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనికచర్యను సమర్థించుకున్నారు. తమపై ప్రతిదాడి చేస్తే మిగతా లక్ష్యాలపై దాడులు తప్పవని ఇరాన్ను హెచ్చరించారు. అయితే దాడుల తర్వాత ఆయా అణుకేంద్రాల నుంచి ఎలాంటి అణుధారి్మకత వెల్లడైన ఛాయలు కనిపించలేదని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ స్పష్టంచేసింది. దాడికి ముందే అక్కడి నుంచి యురేనియం నిల్వలను తరలించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఊహించనిస్థాయిలో దెబ్బకొడతాం: అబ్బాస్ ఓవైపు అణు మధ్యవర్తిత్వం కోసం స్వాగతం పలుకుతూ మరోవైపు సమరాగ్నిని రాజేస్తున్న అగ్రరాజ్యాన్ని ఊరికే వదిలిపెట్టబోమని ఇరాన్ ప్రతిజ్ఞచేసింది. చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో దాడులుచేసి బదులు తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. ఇస్తాంబుల్లో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన అబ్బాస్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘దౌత్యనీతిని కాలరాస్తూ అమెరికా మాపై దాడులకు తెగబడింది. మేం దౌత్యాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టి దేశ రక్షణ కోసం భీకరపోరు చేయాల్సిన తక్షణావసరమిది. దుస్సాహసంతో దారుణంగా దాడులు చేసిన యుద్ధోన్మాద అమెరికా తదుపరి తీవ్ర పర్యావసానాలకు బాధ్యతవహించాల్సి ఉంటుంది. అమెరికా చర్యలకు ఇరాన్ తన సైన్యంతో బదులుతీర్చుకుంటుంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఇరాన్ పాటుపడుతుంది’’అని అబ్బాస్ అన్నారు. మరోవైపు తమపై దాడిచేసిన ఇజ్రాయెల్పైనా ఇరాన్ ఆదివారం మిస్సైళ్లను ప్రయోగించింది. తన అమ్ములపొదిలోని మధ్యస్థ శ్రేణి ఖుర్రమ్షహర్–4 క్షిపణిను సైతం ఇరాన్ ప్రయోగించింది. ఇది ఒకేసారి 1,500 కేజీల బరువైన వేర్వేరు వార్హెడ్లను ఏకంగా 2,000 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని ఈ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దాడులను పొగిడిన ఇజ్రాయెల్ ఇరాన్పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది. ఇదొక అద్భుత, సాహసోపేత, చరిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘దాడులు చేయాలని కోరాం. కానీ అమెరికా నిర్ణయం ముందస్తుగా మాకుతెలీదు. ఇదొక చారిత్రక నిర్ణయం. అమెరికా నేరుగా దాడులు చేస్తున్నందున ఇక మేం దాడులు చేయబోమని అనుకోవద్దు. ఇరాన్ మా భూభాగాలపై క్షిపణులు వేస్తోంది. మేం వాటికి బదులు చెప్పాలి’’అని ఇసాక్ అన్నారు. ఆదివారం సైతం ఇరాన్లోని డజనుకుపైగా మిలటరీ స్థావరాలపై దాడులుచేశామని చెప్పారు. అయితే ఆస్పత్రులు, మెడికల్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఆదివారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్లో 865 మందిదాకా చనిపోయారని, 3,396 మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్’సంస్థ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత సురక్షిత బంకర్కు తరలించినట్లు తెలుస్తోంది. తమ దేశంలో 24 మంది చనిపోయారని, వేయి మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ పాత లెక్కలనే చెబుతోంది మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ ఇరాన్పై దాడులను చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. దాడుల తర్వాత ఇరాన్కు ప్రపంచదేశాల నుంచి సైనిక సాయం పెరుగుతుందని రష్యా వ్యాఖ్యానించింది. ఈ మేరకు రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదెవ్ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘దాడుల కారణంగా ఆ అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదు. పైగా ఇరాన్కు బయటి మద్దతు పెరుగుతోంది. అణువార్హెడ్లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మంతనాలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆదివారం మాస్కోకు వెళ్లారు. భేటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జలసంధి దిగ్భందం!! ప్రపంచ చమురు జీవనాడికి పేరొందిన హోర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ బెదిరించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలపింది. అయితే జాతీయ ప్రయోజనాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ‘సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ఆమోదిస్తే జలసంధి ద్వారా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. దాంతో ఇంధన కొరత ఎక్కువై, గిరాకీ పెరిగి, పెట్రో ధరలు మరింత అధికంకానున్నాయి. భారత్పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముంది. మరోవైపు, అమెరికా జోక్యం, బాంబు దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్తో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ వివరాలను మోదీ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించారు. -
Israel-Iran Conflict: పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టుల మూసివేత
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. ఆ దేశాలు ప్రతీకార చర్యలతో రగిలిపోతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టులను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గగనతలాలపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తమ గగనతలాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేయగా.. అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. దీంతో లెబనాన్, జోర్డాన్, ఇరాక్లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు, తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం నేర్పాలన్న టార్గెట్తో సోమవారం ఉదయం క్షిపణుల వర్షం కురిపించింది.టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో కనీసం ఎనిమిది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. -
ఇరాన్పై నిప్పుల వర్షం
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. ఊహించినట్లుగానే ఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇలామ్, ఖుజిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్స్ల్లోని సైనిక, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం 100 ఫైటర్ జెట్లతో మూడు దశల్లో 20 లక్ష్యాలపై కచి్చతత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. ఇరాన్కు చెందిన క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలపై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే, చమురు నిల్వలపై దాడులు జరిగాయా లేదా అనేది తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. తాజా దాడుల్లో ఇరాన్కు ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ఇజ్రాయెల్ బయటపెట్టలేదు. ఇరాన్పై దాడుల తర్వాత తమ యుద్ధవిమానాలు క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయని వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాన్పై మరో దేశం నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఆపరేషకు ఇజ్రాయెల్ ‘పశ్చాత్తాప దినాల మిషన్’ అని పేరుపెట్టింది. రంగంలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ సైన్యం పక్కా ప్రణాళికతో ఇరాన్పై దాడికి దిగినట్లు సమాచారం. అత్యాధునిక ఫైటర్ జెట్లను సైన్యం రంగంలోకి దించింది. ఐదో తరం ఎఫ్–35 అడిర్ ఫైటర్ జెట్లు, ఎఫ్–15టీ గ్రౌండ్ అటాక్ జెట్లు, ఎఫ్–16ఐ సూఫా ఎయిర్ డిఫెన్స్ జెట్లు ఇందులో ఉన్నాయి. ఇవి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదింగలవు. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ సైనిక, ఆయుధ స్థావరాలపైనే గురిపెట్టింది. జనావాసాల జోలికి వెళ్లలేదు. తొలుత రాడార్, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలపై దాడికి పాల్పడింది. అనంతరం సైనిక స్థావరాలు, మిస్సైల్, డ్రోన్ల కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం మూడు దశల్లో దాడులు జరగ్గా, ఒక్కో దశ దాడిలో దాదాపు 30 చొప్పున యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో ఇజ్రాయెల్, అమెరికా తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. విమానాల రాకపోకలకు వీల్లేకుండా ఇరాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. టెహ్రాన్లో సాధారణ పరిస్థితులే.. ఇజ్రాయెల్ దాడుల్లో తమకు పరిమిత నష్టమే వాటిల్లిందని, ఎదురుదాడిలో నలుగురు సైనికులు మృతి చెందారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. దాడుల అనంతరం టెహ్రాన్లో సాధారణ పరిస్థితులే కనిపించాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. దుకాణాలు ఎప్పటిలాగే తెరుచుకున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. ఇదిలా ఉండగా, ఇరాన్పై దాడుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇజ్రాయెల్ చర్యను పలు దేశాలు ఖండించాయి. సంయమనం పాటించాలని సూచించాయి. అమెరికా వంటి మిత్రదేశాలు మాత్రం ఇజ్రాయెల్కు మద్దతు పలికాయి. 25 రోజుల తర్వాత ప్రతిదాడి ఇరాన్పై దాడుల సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇందులో టెల్ అవీవ్ ఉన్న కిర్యా మిలటరీ బేసులోని మిలటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ సైనిక సలహాదారులతో, సైనికాధికారుతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్»ొల్లా, హమాస్ నాయకులు మరణించడం పట్ల ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ నెల 1న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగంపై దాదాపు 200 క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తాము తగిన జవాబు ఇవ్వక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు. ఇరాన్ దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని అప్పట్లో భావించినప్పటికీ ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో తమ ఆపరేషన్ వాయిదా వేసుకుంది. పరిస్థితులు సానుకూలంగా మారడంతో 25 రోజుల తర్వాత ఇరాన్పైకి యుద్ధ విమానాలు పంపించింది. -
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
అభద్రతను పెంచుతున్న యుద్ధం
హమాస్–ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతా వన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసి యాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.ఇజ్రాయెల్, ఇరాన్ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగ కరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు, కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యక రంగా ఉంది. ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్ బాడీ పాలిటిక్స్పై ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యా లను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు,నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థ మంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతా లలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్గా పరిగణించడం లేదు.అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రుల అగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అదే విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదా హరణ ఏదంటే హమాస్ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చట్రాలను మనం మౌనంగా ఆమోదించడం!ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.ఇజ్రాయెల్కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బ లత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైన ప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.నేడు ఇజ్రాయెల్ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్ సౌత్లోని వారిచే వివిధ అంత ర్జాతీయ ఫోరమ్లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. గ్లోబల్ సౌత్ మద్దతుపై ఇజ్రాయెల్కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమె రికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షి ణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్ కోసం బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.మొత్తం మీద చూస్తే అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనో భావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్ప టికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యా హుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ’శ్వేత జాతీ యులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు’ అనేటటువంటి కేవల యూరోప్ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చి మాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్యూలో భారత విదేశీ విధాన బోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో...) -
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్స్టాప్గా దౌడు తీస్తున్న బుల్కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. అదే సమయంలో బందీలందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలన్నారు. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఏ సంఘటననూ ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. -
ఐసిస్పై లక్ష మిసైళ్లు
ఐసిస్.. సిరియా, ఇరాక్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు నిర్వహించి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న రాక్షసమూక. పశ్చిమాసియా దేశాలైన సిరియా, ఇరాక్లో గణనీయమైన భూభాగాన్ని అక్రమించుకుని ఖలీఫత్ పేరిట 2014లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆయిల్, ఇతర సహజవనరుల్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఆ సొమ్ముతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భావజాలానికి మద్దతుగా నిలిచింది. మైనారిటీ మతస్తుల్ని బందీలుగా చేసుకుని గొంతు కోసి హతమార్చడం, తమ భావజాలాన్ని వ్యతిరేకించే సొంత మతస్తుల్ని సజీవ దహనం చేయడం వంటి దారుణ చర్యలతో వణుకు పుట్టించింది. అయితే ఇదంతా గతం. 2014లో ఐసిస్ను అణచివేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు. చివరికి 2017, అక్టోబర్లో ఐసిస్ ఉగ్రవాదులు నక్కిన చివరి నగరమైన రక్కాను సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకోవడంతో ఐసిస్ను ఓడించేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. అయితే నిజంగానే ఐసిస్ను పూర్తిగా అణచేశారా? భవిష్యత్లో ఉగ్రదాడులు చేయడానికి వీల్లేకుండా దాన్ని ఆర్థికమూలాల్ని పూర్తిగా నాశనం చేశారా? అంటే జవాబు కాదనే వినిపిస్తోంది. ఈ విజయం తాత్కాలికమే: జమాత్–అల్–తావీద్–వల్–జీహాద్ (జేటీజే) పేరుతో 1999లో ఏర్పడ్డ ఈ సంస్థ.. క్రమక్రమంగా పశ్చిమాసియాలో పట్టు పెంచుకోవడం ప్రారంభించింది. లాడెన్ నేతృత్వంలోని అల్కాయిదాకు విధేయత ప్రకటించుకున్న జేటీజే.. 2003లో ఇరాక్పై–అమెరికా యుద్ధంలో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడింది. 2014 నాటికి ఇరాక్, సిరియాల్లో గణనీయమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని సంస్థ పేరును ఐసిస్గా మార్చుకుంది. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, బెల్జియం సహా 29 దేశాల్లో 140 ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. కశ్మీర్లోనూ అల్లరిమూకలు ఐసిస్ జెండాలు ప్రదర్శించంపై భారత నిఘా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ రక్షణ సంస్థ నివేదిక ప్రకారం సంకీర్ణ సేనలు ఐసిస్ అధీనంలోని 29,741 స్థావరాలపై ఇప్పటివరకూ 1,07,814 మిస్సైళ్లను, బాంబుల్ని ప్రయోగించాయి. ఈ దాడుల్లో 60,000 మంది ఉగ్రవాదులు, 6,321 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, మరోవైపు రష్యా, ఇరాన్, సాయంతో పోరాడుతున్న సిరియన్ బలగాలు ఐసిస్ కబంధ హస్తాల నుంచి చాలా పట్టణాలకు విముక్తి కల్పించాయి. అయితే ఈ విజయం తాత్కాలికమేననీ, ఇరుపక్షాల మధ్య దీర్ఘకాలిక పోరాటానికి ఇది ఆరంభమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకూ అఫ్గాన్లో 17 మంది అమెరికన్ కమాండర్లు మారినా పరిస్థితి మారకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియానే ఆయుధం: సంకీర్ణ సేనలు, రష్యా, ఇరాన్ బలగాల వరుస దాడులతో కుదేలయినప్పటికీ ఈ ప్రాంతంలో ఐసిస్ తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోలేదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్ దేశాలపై ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడాలని సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు ఉగ్రవాదులు విషాన్ని నూరిపోస్తున్నారని తెలిపారు. సరికొత్తగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా యుద్ధాలు, ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉన్న యువతను భారీగా భర్తీ చేసుకుంటూ ఐసిస్, ఇతర ఉగ్రసంస్థలు శక్తిమంతంగా మారేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. ఉగ్రమూకల్ని అణచివేయడంలో సైనిక చర్య ద్వారా తాత్కాలిక ఫలితాలను మాత్రమే సాధించగలమనీ, దీర్ఘకాలంలో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాబోదన్నారు. ఈ దేశాల్లో సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారానికి యత్నించినప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. ► సంకీర్ణ సేనలు లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ స్థావరాలు 29,741 ► ఐసిస్పై ప్రయోగించిన మిస్సైళ్లు, బాంబులు 1,07,814 ► హతమైన ఉగ్రవాదులు 60,000 ► చనిపోయిన పౌరులు 6,321 ► ఐసిస్ పంజా విసిరిన దేశాలు 29 ► ప్రపంచవ్యాప్తంగా జరిపిన ఉగ్రదాడులు 140 ► ఐసిస్ వద్ద ఆధునిక మెషీన్గన్ల నుంచి రసాయన ఆయుధాల వరకు ► ఇటీవలే బల్గేరియా నుంచి ఓ శక్తివంతమైన మిసైల్ను కూడా ఐసిస్ సేకరించిందన్న అమెరికా -
పశ్చిమాసియా దేశాల పర్యటనకు ప్రధాన మోదీ


